Saturday, July 28, 2012

My new poem on Agriculturalist life


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

ఆ శవం ఈ దారిలోనే పోవాలి...
అనే రైతుగీతం

గడ్డపలుగు చెలకపార మాట్లాడుకుంటున్నాయి
తమను పట్టుకునే చేతుల కేమైందని
వరి దుబ్బులు అనుకుంటున్నాయి
కలుపు తీసి ప్రేమతో  తమ వేళ్ళు చక్కవొత్తిన చేతుల కేమైందని 
నాగలి మేడి కన్నీరు పెట్టుకుంటూంది
తన సోగను పట్టుకున్న చేతుల కేమైందని
ఇంటి వసారాలో మూలకున్న తలపగ్గం ముల్లుగర్రా
గుసగుసలాడుతున్నాయి
ఆ చేతులు తమను ప్రేమతో పొదువుకోవడం లేదేమని
మెట్ట చేలో కోండ్ర తిరిగిన దుక్కి సాళ్ళు
తమ వెంట నడిచిన పాదాల కేమైందని బుగులుకున్నాయి
ఇంటిదారి అరక, కోటేరు వెనుక గీసిన ఏడికర్ర గీత
తనను ప్రేమతో తొక్కిన పాదాల కేమైందని దిక్కులు చూస్తూంది
ఎండిన మబ్బులు చూస్తున్నాయి అతని కళ్ళకేసి
నుదిటి చేత్తో తల పైకెత్తే ఆ నింగిచూపులెక్కడా అని
దమ్ము చేయని వరి మడి..
తన బురద గంధాన్ని అలదుకునే ఆ దేహం ఎక్కడా అనీ...
ఎండిన కృష్ణా గోదావరులు నిండుగా ఎడ్ల జత కళ్ళల్లో.....
బి.టి, మొన్ సాంటో ఏదైతేనేం
ఇక్కడ వేసిన గ్లోబల్ పత్తి విత్తనం
ఏదేశంలో డబ్బుకురిసిందో ఇక్కడ కళ్ళల్లో నీళ్లు విత్తింది
రెండు వేల అడుగులు దిగిన బోరుబావి
గొడ్డు గేదైంది, వడ్డీ సేటయింది
ఇంట్లో నగలను కంట్లో నీళ్ళనీ కాజేసింది
అది ఏరువాక పున్నమి కాదు
నిండు అమాస.. ఎవరు దోచారు ఇక్కడి వెలుగు వసంతాలను
గొర్రుకు పెట్టిన నొగలు పాడెకట్టె లయినాయి
అరకకు కట్టే పగ్గం పాడెకు దేహాన్ని కట్టింది.
ఓ స్వతంత్ర భారత దేశమా ఒక రోజు సెలవు పెడతావా
నీ వెన్నెముకని ఆర్ధో పెడిక్ హాస్పిటల్ లో చూపించాలి
యువతరమా నీ క్రికెట్ ఛానల్ కాసేపు ఆపుతావా
రైతు  శవం దగ్గరి పెళ్ళాం బిడ్డల ఏడుపులు
నేను కాసేపు గుండె నిండా వినాలి
ఓ పార్టీల నాయకులారా మీ రోడ్ షో కాస్త ఆపుతారా
ఒక రైతు శవం ఈ దారిలోనే పోవాలి....

Prof. Pulikonda Subbachary
Director, Internal Quality Assurance Cell
Dravidian University
Kuppam 517426

Wednesday, July 11, 2012

Article on Telugu Desham at Cross Roads


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

తెలుగు దేశం (19822014) ఒక అంతశ్శోధనం
ఉపఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మునుపు ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను చూస్తూ ఉంది.  ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో నిలబడిన అన్ని స్థానాలలో ఓడిపోయి చేదు అనుభవాన్ని మూటకట్టుకుంది. అంతే కాదు తెలుగు దేశం పార్టీ నేడు ఒక సంక్లిష్ట పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ గడ్డుకాలాన్ని చవి చూస్తూ ఉంది. ఈ పరిస్థితిని చారిత్రక నేపథ్యంలో విశ్లేషించడమే ఇక్కడి ఉద్దేశం.
 ప్రజా స్వామ్య ప్రక్రియ భారత దేశంలో ఒక ప్రత్యేకమైన రూపం పొందింది. 65 సంవత్సరాల చరిత్రలో మన ప్రజాస్వామ్యం నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుందే కాని దాని మౌలిక ప్రజాస్వామిక విలువలను పెంచుకోకపోగా భారత దేశంలో అధికారం అంటే మధ్య యుగాలనాటి రాచరిక వ్యవస్థ క్రమంగా నయారూపంలోనికి తీసుకు వచ్చి నయా రూలింగ్ డైనాస్టీస్ ను ఏర్పాటు చేస్తూంది. మన మార్కు ప్రజాస్వామ్యంలో అంటే బహుపార్టీల విధానంలో అధికారంలో ఉన్న పార్టీలు భ్రష్టు పట్టి ఒక రకమైన స్తబ్ధతకు దారితీయడం మనం గమనించాం. 1975 లో వచ్చిన ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల తర్వాత జనతా పార్టీ అధికారంలోనికి వచ్చే నాటి రోజులలో అఖిలభారత స్థాయిలో ఈ పరిస్థితి వచ్చింది. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ చేసిన ఉద్యమం దీని వెనుక ఉంది. ఈస్థితిలో ప్రజలు తీవ్రమైన మార్పు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో 1979 – 82 మధ్య వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పరిస్థితి  చాలా దారుణంగా తయారైంది. అధిష్ఠానం చేతిలో కీలుబొ మ్మలు ఇక్కడ రాష్ట్రంలో పార్టీలో చాలా ఎక్కువ కావడం గిల్లికజ్జాలు పెట్టుకోవటం  ఏడాదికొక ముఖ్యమంత్రి మారడం, రాష్ట్ర నాయకులకు నాయకత్వానికి ఒక స్వతంత్ర వ్యక్తిత్వం లేదు అనే స్థితి ఏర్పడింది,  అభివృద్ధి నీరుగారి పోయి ప్రజలు పూర్తిగా విసిగి పోయి ఒక శూన్యం ఏర్పడింది. దీన్ని శూన్యం అనడం కన్నా ఒక రాజకీయ దివాళా స్థితి అని అనవచ్చు. దీన్ని నింపే చారిత్రక అవసరంగా ఆనాడు మార్చి 29, 1982న తెలుగు దేశం పార్టీ ఏర్పడింది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు బహుముఖీన ప్రతిభతో తెలుగు చిత్ర సీమను ఏలిన రారాజు ఎన్టీ రామారావు అంతటి మహానటుడు రాజకీయాలలోనికి రావడం పార్టీ పెట్టడం అనేవి తెలుగు వారికి నూతన చరిత్ర. సినిమా నటుడు ఎం.జి ఆర్ అప్పటికే రాజకీయాలలో విశేష ఆదరణ పొంది ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అక్కడ ద్రావిడ కఝగం, ద్రావిడ మున్నీట్ర కఝగం, తర్వాత ఎం.జి. ఆర్ పార్టీ అఖిల భారత ద్రావిడ మున్నీట్ర కఝగం ప్రజలలో కలిగించిన స్ఫూర్తి, సాధించిన విజయాలు ఎన్టీఆర్ కి వెనుక స్ఫూర్తిగా నిలిచాయి. పార్టీ పేరు పెట్టడం ప్రచారం చేయడం ఈ శైలి అంతా అక్కడ నుండి తెచ్చుకున్నవే. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే నినాదాలు ప్రజల్లో తారక మంత్రంలా మోగినాయి. అద్దాల మేడల్లో, దంతభవనాలలో ప్రజల కలలో మాత్రమే నివసించే ఎన్టీ ఆర్ ప్రజల మధ్యకు రావడం ఒక పెద్ద సంచలనం. అతని ఆకృతి వాచికం ప్రజల గుండెల్లో ఎల్లప్పడూ మారుమోగుతుంటాయా. అలాంటిది అతన్ని బహిరంగంగా బయట చూడడం అతని గొంతును సజీవంగా వినడం. ప్రజలకు సరికొత్త అనుభూతి. దేశ రాజకీయాలలో ఒక చైతన్య రథం అనే భావన అలా కూడా ప్రచారం చేయవచ్చు అనే రీతి దేశ రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలో పార్టీని అఖండ విజయం వైపు నడిపాడు. ప్రమాణ స్వీకారాన్ని అప్పటిదాకా జరిగే రాజభవనాలలో కాక ప్రజల మధ్య చేయడం మరొక సంచలనం. ఆయన చేసినవి అన్నీ వినూత్న ప్రయోగాలే సంచలనాలే. ఇవి రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో 204 సీట్లు సంపాదించి అనూహ్యమైన అఖండమైన విజయాన్ని పార్టీ సాధించింది. తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ అనే మాటలు అంతర్జాతీయ మీడియాలోనికి వెళ్ళాయి. బిబిసి ప్రత్యేక వార్తాకథనాలు ప్రకటించింది.

ఎన్టీ ఆర్ ఏ ముహుర్తాన పార్టీ పెట్టాడో (ఇది పలుకుబడి, వ్యాసకర్తకు ముహుర్తాల మీద నమ్మకం లేదు) కాని ఆయన ఎదుర్కున్నవి సామాన్యమైన సమస్యలు కావు చాలా తీవ్రమైన ఆటుపోట్లు. అంత అఖండమైన మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న పార్టీ ఐదు సంవత్సరాలు అవలీలగా పాలించి మళ్లీ విజయం దిశగా వెళ్లవలసి ఉంది. కాని అలా జరగలేదు. ఎన్టీఆర్ స్వభావతః రాజకీయ నాయకుడు కాడు. అతను ఆవేశ పూరితుడైన కళాకారుడు. దీనివల్ల ఆయన ప్రజల వద్దకు పోగలిగాడు ఓట్లు సంపాదించాడు. సీట్లు సంపాదించాడు, ప్రభుత్వాన్ని సాధించాడు కాని రాజకీయాలు ఆడలేకపోయాడు. అధికారాన్ని సాఫీగా నిలుపుకోలేకపోయాడు. అధికారానికి వచ్చిన సంవత్సరానికే 1984 ఆగస్టులో నాదెండ్లభాస్కరరావు అతనికి సన్నిహితంగా ఉన్న నాయకుడే పార్టీకి వెన్నుపోటు పొడిచి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసాడు. ఇందిరాగాంధి కేంద్రంలో ప్రధానిగా అధినాయకత్వం ఉండడం. ఇక్కడ కాంగ్రెస్ తాబేదారు గవర్నర్ గా ఉండడంతో అల్పసంఖ్యాక ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం నాదెండ్ల భాస్కరరావుకు వచ్చింది. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్టీ ఆర్ కి వెంటనే ఉద్యమం చేయవలసి వచ్చింది. ఎమ్మెల్యేలని అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ సమక్షంలో పరేడ్ చేయించి మెజారిటీ తన వద్ద ఉందని రుజువు చేయడం ఆనాడు అదొక కొత్త చరిత్ర. ఇందిరాగాంధికి ఎన్టీ ఆర్ ని తిరిగి అధికారంలోనికి తీసుకు రాక తప్పదు అనే ఇంటిలిజన్స్ నివేదికలు చాలా బలంగా వెళ్లాయి. దీనితో గవర్నర్ ని మార్చి రామ్ లాల్ స్థానంలో శంకర్ దయాళ్ శర్మను తీసుకురావడం ఎన్టీఆర్ కి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం కల్పించడం వడివడిగా జరిగాయి. 31 రోజులు అధికారంలో ఉన్న నాదెండ్ల నెలరాజు అని కొత్త పేరు సంపాదించాడు. తిరిగి 1984లో సాధారణ ఎన్నికలు జరిగే సందర్భంలో ప్రభుత్వాన్ని రద్దు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాడు ఎన్టీ ఆర్. ఇది సాహసోపేతమైన చర్య అని అందరూ అప్పుడు కీర్తించారు. 1984 ఏడవ అసెంబ్లీలో తెలుగు దేశం 205  స్థానాలు గెలిచి తిరిగి చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ప్రజాపాలనలోను ప్రజాసంక్షేమంలోను ఎన్నో కీలకమైన విజయాలు సాధించాడు. అన్నింటికంటే చెప్పవలసినవి పాలనా సంస్కరణలు. అడ్మినిస్ట్రేటివి రిఫార్మ్ అనేవి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నిజాంల పాలనలో జరిగాయి. తర్వాత జరగలేదని చరిత్ర చెబుతూంది. ఎన్టీ ఆర్ తాలూకాల వ్యవస్థను తొలగించి మండలాల వ్యవస్థని తెచ్చాడు. ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకూ దీని సత్ఫలితాలను ఆనందిస్తున్నారు. తాలూకా వ్యవస్థలో అతి పెద్ద పరిమాణంలో తాలూకాలు ఉండడం వల్ల ప్రజలు పాలనా పరంగా సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కునే స్థితిలో మండలాల ఏర్పాటు ప్రజలకు వరంగా మారింది. దీని కన్నా ముఖ్యమైంది గ్రామాధికారుల వ్యవస్థను తొలగించడం. పటేల్, కరణం పద్ధతుల్ని తొలగించడం గ్రామస్థాయిలో ప్రజలకు మరొక వరంగా మారింది. రాచరిక వ్యవస్థ చిహ్నంగా మిగిలి ఈ దుష్ట వ్యవస్థని తొలగించే ధైర్యం అంతకు ముందెవరూ చేయలేదు. ఈ రెండు పాలనా సంస్కరణలు ఆనాటి తెలుగు దేశం వరంగా ఈనాటికీ ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి ఎన్నో విజయాలతో పాటు ఎన్టీ ఆర్ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకొని ప్రజాగ్రహానికి కూడా గురయ్యాడు. ఉద్యోగుల వయోపరిమితి తగ్గించడం ఇందులో ఒకటి. తిరిగి కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఇదే కారణం అయింది. 1989 ఎన్నికల్లో తెలుగు దేశం 78 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనా  తిరిగి 1994లో వచ్చిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మునుపెన్నడూ లేని విధంగా 218 స్థానాలు సాధించి మళ్ళీ చరిత్ర సృష్టించింది. ఇన్ని స్థానాల్ని ఏ పార్టీ ఇంతవరకు సాధించలేదు.

ఆ తర్వాత  పార్టీకి అతి గడ్డు సమస్య లక్ష్మీ పార్వతిరూపంలో ఎదురైంది. ఎన్టీ ఆర్ జీవితంలోనికి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి రాజకీయ పాత్ర పోషించి రాజ్యాంగేతర శక్తిగా మారింది. ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ అయితే పాలించేది లక్ష్మీ పార్వతి ఆమె చుట్టూ చేరిన వందిమాగధ గణం అనే స్థితి ఏర్పడింది.  ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులు ఏకమై తమ తండ్రిని తమ  పార్టీని రక్షించుకోవాలనుకున్నారు. చంద్రబాబు నాయకుడుగా ఆయన కుటుంబ సభ్యులు అందరు చేసిన ప్రయత్నాల కారణంగా కుటుంబ సభ్యుల చేతనే ఎన్టీ ఆర్ అధికారాన్ని కోల్పోయి అతని అల్లుడైన చంద్రబాబే అగస్టు సంక్షోభంలో ముఖ్యమంత్రిగా అవతరించాడు. ప్రజల్లో దీనికి మిశ్రమ స్పందన వచ్చినా ప్రజలు చంద్రబాబును పార్టీ నాయకుడుగా వారసుడుగా అంగీకరించారు. తర్వాతి తర్వాతి ఎన్నికల్లో ఇదే రుజువు అయింది. 1994లో 218 స్థానాలలో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ 1995లో నే అధికారాన్ని కోల్పోవడం అతను నిజమైన రాజకీయ నాయకుడు కాలేకపోయాడని రుజువు చేసింది. మంచి పరిపాలన అందించడం చేయగలిగాడు కాని రాజకీయాలు నడపలేకపోయాడు.
ఈ స్థాయి తర్వాతి నుండే తెలుగు దేశం పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబంతో సంబంధాలు దోబూచులు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని లక్ష్మీ పార్వతి కబంధ హస్తాలలోనుండి తప్పించడానికి చంద్రబాబుకు వెనుక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ నిలిచారు. తర్వాత 1995 నుండి 2004 నాలుగు వరకు చంద్రబాబు నిరాఘాటంగా పరిపాలించి కొత్త ఒరవడి సృష్టించాడు. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపు రాజకీయాలు మాట్లాడకపోవడం. ముఖ్యమంత్రి పదవిని పరిపాలించి ఒక సిఇఓ లాగా మార్చిన మార్కును సాధించాడు బాబు. కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యలనుండి చాలా ఆటుపోట్లను ఎదుర్కోవాల్సివచ్చింది. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, ఇలా వారి కుటుంబ సభ్యులను ఎవరినీ అధికారంలోనికి పదవులలోనికి రానివ్వక పోవడం చంద్రబాబుపై వారిలో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. మేము అతని వెనుక ఉండి అధికారంలోనికి తెస్తే అతను అధికారంలోనికి వచ్చి మమ్మల్ని దూరంగా నెట్టాడు అనే భావం వారిలో వచ్చింది. విసిగి పోయిన దగ్గుబాటి వేంకటేశ్వరరావు ముందు బి.జె.పిలో చేరాడు. తర్వాత చివరికి కాంగ్రెస్ వాదిగా అతను పురందేశ్వరి మారవలసి వచ్చింది. కాంగ్రెస్ మీద తన తండ్రి ఎన్టీఆర్ అలుపెరుగని పోరాటం చేసాడన్న విషయాన్ని కూడా పురందేశ్వరి మర్చిపోయేలా చేసింది వారికి అవసరమైన రాజకీయ బలం అధికార వాంఛ. ఇక హరికృష్ణ సొంత పార్టీ యే పెట్టుకున్నాడు. అన్నా డిం ఎంకె లాగా అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు. కాని పూర్తిగా విఫలమై తిరిగి చంద్రబాబు వద్దకే చేరి పార్టీలో ప్రజలలో బాబుకు ఉన్న పట్టును అంగీకరించవలసి వచ్చింది. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడి ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఏతావాతా ఎన్టీ ఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి అసలైన వారసుడు చంద్రబాబుగా దానికి ఇప్పటిదాకా అధ్యక్షుడుగా బాబు ప్రజాంగీకారం పొందాడు, స్థిరపడిపోయాడు.
కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఇతని సంబంధాలు అటు ఇటు, ఇటు అటు చెదిరి పోతూనే వచ్చాయి. హరికృష్ణకు మిగతా వారికి అధికార వాంఛ అలా తీరకుండానే వచ్చింది. పార్టీ పెద్దలు చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలే ఉన్నాయి అనే సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల మధ్య చెప్పుకునే స్థితి అప్పుడప్పుడూ వస్తూనే ఉంది. రాజుల కాలంలో రాజ్యాల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి శత్రువుల పిల్లల్ని వివాహం చేసుకునే వారని చదివాం. బాలకృష్ణ తన కూతురిని చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఇవ్వడంతో కుటుంబసంబంధాలలో కొత్త రాజకీయ కోణం వచ్చింది. బాలకృష్ణ బాబుకు దూరంగా పోలేని పరిస్థితి వచ్చింది. ఇక పురందేశ్వరి ఎలాగూ దూరం అయింది. కాగా ఇక హరికృష్ణ ఒంటరిగా నిలబడ్డాడు. జూనియర్ ఎన్టీ ఆర్ కొత్త శక్తిగా రూపుదాల్చడం ప్రజాభిమానం చాలా విస్తృతంగా ఉన్న నటుడు కావడం ఎన్టీఆర్ ని ప్రజలు అతనిలో చూడడం అన్నవి తిరిగి కొత్త సంబంధాలకు దారితీసింది. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు బాబుకు దూరం అవుతారని కొత్త పార్టీ పెట్టవచ్చుననే సంకేతాలు అప్పుడప్పుడూ వెలువడుతూ రావడం. సయోధ్యలు కుదుర్చుకోవడం ఇలా తెగూతూ ముడిపడుతూ రావడం జరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పూర్తిగా సయోధ్య కుదరడం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో పాటు ఎన్నికల ప్రచారంలో వీర విహారం చేయడం. తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అండ పూర్తిగా ఉందనే సంకేతాలు పంపింది. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడు కావడం దరిమిలా జరిగిన పరిణామం. అయినా ఈ సంబంధాలు ఇటీవల కూడా కొంత అపోహలకు అపార్థాలకు దారి తీసాయి. అనుమానాలు ఇంకా ఉన్నా సంబంధం స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అది ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీ సంబంధాలు చెడి దీనివల్ల బెడిసి కొట్టవచ్చు. పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబం నుండి చంద్రబాబు కుటుంబానికి శాశ్వతంగా పోతుందనే అర్థాలు వస్తాయి. దీనివల్ల పార్టీకి వచ్చే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంటుంది. పార్టీలో వీరవిధేయలు అధినాయకుడికి దగ్గర కావాలనుకునే వారు ఈ స్లోగన్లు తెస్తుంటారు. రాహుల్ ప్రధాని కావాలని వాదించిన రాజశేఖర్ చాలా బలవంతుడయ్యాడు. కాని  ఆ పార్టీ అప్పుడే అలా రాహుల్ ప్రధానిని చేసే ఆలోచన చేయక ఇప్పటి దాకా తొక్కి పట్టింది. ఈ స్థితి తెలుగు దేశానికి కూడా ఉంది. ఇక్కడే పార్టీ ఆచి తూచి వ్యవహరించక పోతే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
ఈ పరిణామాలు చెప్పే సంకేతాలు ఏమంటే కేంద్రంలో నెహ్రూ కుటుంబంలాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఎన్టీ ఆర్ కుటుంబం అలా  ఏర్పడి అధికార కేంద్రంగా మారింది. ఈ వారసత్వపు ధోరణి మన ప్రజాస్వామ్యానికి అడ్డు కాదని ఇది అవసరం అయితే లాభిస్తుందని మన రాజకీయాలలో రుజువు అయింది. దీనికి దూరంగా పార్టీని బలోపేతం చేయాలనుకునే చంద్రబాబు సంకల్పం గండిపడుతూనే వచ్చింది.
1999లో తెలుగు దేశం పరాజయం పొంది ఓడి పోయి 184 సీట్లకు పరిమితమై కాంగ్రెస్ కు అధికార పగ్గాలను అందించింది. దీని కారణాలను విశ్లేషించుకుంటే ప్రజలు మార్పు కోరుకున్నారనే మొదటి విషయమే కాక అప్పటి చంద్రబాబు పాలనా శైలి కూడా దీనికి కారణం అయింది. హైటెక్ ముఖ్య మంత్రి అని పేరు తెచ్చుకోవడం. రైతులు ఎన్నో కడగండ్లు పాలు కావడం అతి వృష్టి అనావృష్టి. రైతులలో నిస్సహాయ స్థితి కలిగి ప్రభుత్వ వ్యతిరేక ధోరణి పెరగడం. ఇవే కాక బాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరులో ప్రజల మధ్యకు పాలనలో ప్రజల ఎదురుగా ప్రభుత్వాధికారులను నిలిపి వారిని తీవ్రంగా విమర్శించి దోషులుగా నిలబెట్టిన తీరు ఆరోజున ప్రజలు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. కాని ఈ ధోరణి ప్రభుత్వాధికారులలో తీవ్రమైన అసంతృప్తిని అలజడిని వ్యతిరేకతను సృష్టించింది అనే విషయాన్ని పార్టి గుర్తించలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఉద్యోగ వర్గం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి కారణం అయింది. రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకత్వం, పాదయాత్ర ఉచిత విద్యుత్తు వంటి రైతులకిచ్చిన వరాలు ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోనికి రాగలిగింది. అప్పటి నుండి చంద్రబాబుకు తన పాలనా లోపాలను సరిదిద్దుకునే అవకాశం కాని పార్టీ తన తప్పిదాలను సరిచేసుకునే అవకాశం కాని రాలేదు. 2004 లో జరిగిన ఎన్నికల్లో అతి దీనంగా 47 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.
తెలంగాణా విషయం 1999 నాటికే గడ్డుసమస్యగా తెలుగు దేశానికి పరిణమించింది. కాంగ్రెస్ తెరాసతో పొత్తు పెట్టుకోవడం ఆనాటికే కాంగ్రెస్ లాభించింది. తెరాస ఉనికి వల్ల అది బలపడడం వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం కన్నా తెలుగు దేశానికి వచ్చిన నష్టమే అధికం. చిరంజీవి కొత్త పార్టీ పెట్టడం అనే కొత్త పరిణామం కాంగ్రెస్ కే లాభించి తెలుగు దేశం అధికారంలోనికి వచ్చే అవకాశానికి గండి కొట్టింది. చిరంజీవి కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాడనుకున్న దేశం అంచనా తలక్రిందులైంది. దరిమిలా చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వేరే విషయం.
2009 ఎన్నికల్లో తెలుగు దేశం పుంజుకొని 94 స్థానాలు దాకా పొంద గలిగినా తెలంగాణా సమస్య తెరాస ఉనికి పార్టీకి తీవ్రమైన సమస్యని సృష్టించింది. తెలంగాణా వాదాన్ని అక్కడి పార్టీల నైజాన్ని ఎదుర్కోవడంలో  తెలుగు దేశం అప్పటినుండి ఇప్పటికీ సరిగ్గా వ్యవహరించలేక పోతూ ఉంది. మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పిందే కాని అంతకు ముందుకు పోలేకపోయింది. కాంగ్రెస్ ఆడే రాజకీయ క్రీడను ఎదుర్కోవడమే దీని వెనుక ఉన్న వ్యూహం. కాంగ్రెస్ మేము తెలంగాణాను కచ్చితంగా ఇస్తాం అని అధిష్ఠానం చెప్పలేక రెండు పడవల్లో కాళ్ళు పెట్టి కూర్చొంది. అలాంటప్పుడు మేము తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతున్నామని ఎందుకు చెప్పాలి అది అధికారంలోఉన్న కాంగ్రెస్సే చెప్పాలి కదా అనేది తెలుగు దేశం వ్యూహం.
ఈ ఆలోచనను దేవేందర్ గౌడు రాజ్యసభలో చాలా స్పష్టంగా చెప్పాడు. "చిదరంబరం ఇతర పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏముంది. పార్లమెంటు లో వారు తీసుకునే నిర్ణయాలు అన్నీ మమ్మల్ని సంప్రదించి తీసుకుంటున్నారా. బిల్లులన్నీ తమ అభిప్రాయాన్ని తీసుకొని పెడుతున్నారా. ఇప్పుడు మా అభిప్రాయం దేనికి తెలంగాణా పూర్తిగా ఇస్తాం అని మీరే చెప్పండి". అని వాదించాడు. దీనితో తెలంగాణా బంతిని కాంగ్రెస్ కోర్టులోనికి తెలుగుదేశం బాగా బలంగా తోయగలిగింది. వ్యూహం బాగానే ఉంది కాని దీని వల్ల తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఎలా దూరం అవుతూ ఉందో తెలుగు దేశం కూడా అలాగే దూరం అవుతూ వస్తూ ఉంది. ఈ నిజాన్ని పార్టీ గ్రహించాలి. తెలుగు దేశం రైతు చైతన్య యాత్రలు నిర్వహించి ఇతర కారణాలతోను చంద్రబాబు తెలంగాణాలో విస్తృతంగా పర్యటించినప్పుడు పార్టీ పరిస్థితి నిజానికి బాగా మెరుగుపడింది. పార్టీ తెలంగాణా ఫోరంలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి చేసే తెలంగాణా వాదం కెసిఆర్ పై విమర్శ చాలా గట్టిగానే మీడియాలో వినపడింది. తెలుగుదేశం నిజంగా తెలంగాణాని పూర్తిగా సమర్థిస్తే రెండు రాష్ట్రాలలోను తెలుగు దేశం గట్టిగా నిలబడి అధికార పగ్గాలను పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాని ఇది చాలా ఖరీదైన రాజకీయ క్రీడగా మారే అవకాశం కూడా లేకపోలేదు. సీమాంధ్రలో ఉన్న తెలుగు దేశం నాయకత్వాన్ని మానసికంగా అందుకు తయారు చేసే స్థితిలో కాని ఒప్పించే స్థితిలో కాని పార్టీ  లేదు.
సీమాంధ్రలో వైకాపా కొత్తశక్తిగా అవతరించింది. నిన్న మొన్న జరిగిన ఉపఎన్నికలు తెలుగు దేశానికి ఎన్నడూ లేని చేదు అనుభవాన్ని అందించాయి. కాని వచ్చిన ఓట్ల సంఖ్య ఆశాజనకంగానే ఉంది. పార్టీ రెండో స్థానంలో ఉండడం గుడ్డిలో మెల్ల అన్నట్లుంది. కాగా తెలంగాణాలో తెరాసని నిలువరించి అధిక స్థానాలు పొందాలంటే తెలంగాణా విషయంలో కాంగ్రెస్ కన్నా తామే మేలు అనే సంకేతాన్ని ప్రజలకు అందించవలసి ఉంటుంది. తెరాస కన్నా తామే తెలంగాణా ప్రయోజనాలను కాపాడగలం అని కూడా అది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించవలసి ఉంది. ఇలా కాని పక్షంలో పార్టీ పరిస్థితి ఏదో కొన్ని స్థానాలకు పరిమితం కావలసి ఉంటుంది.
ఇక పార్టీకి ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న తాజా పరిస్థితి ఇంకా కొంత అనుమానపు సంకేతాలను అందిస్తూనే ఉంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీ ఆర్ మాతోనే ఉన్నారని పదే పదే ప్రజలకు నమ్మించేలా చెప్పుకోవలసిన పరిస్థితే ఎదురవుతూ ఉంది. బాలకృష్ణ ప్రచారం చేస్తానని చెబుతున్నాడు అతనికి వేరే మార్గం కూడా లేదు. ఈ కుటుంబం ఎలా చివరికి పవర్ సెంటర్ గా తనకు ఎదురు శక్తిగా నిలబడుతుందా, లేక తమకు పూర్తిగా అనుకూలంగా ఉండి బాబు నాయకత్వానికి వెనుక ఉండడానికి సిద్ధపడుతుందా అనే విషయాన్ని కూడా నాయకత్వం ఇప్పుడు సరిచూసుకోవసలిన అవసరం ఉంది.
ఎన్టీ ఆర్ పార్టీ పెట్టిన దగ్గరనుండీ బి.సిలకు పార్టీలో పెద్ద పీట ఉంది. 50 శాతం స్థానాలకు మించి బి.సి ఎస్.సిలకు సీట్లు ఇచ్చింది పార్టీ. అంతే కాదు బాబు పాలనలో కూడా బి.సిలు కీలకమైన మంత్రి పదవులు పొందారు. కానీ ఇటీవల పార్టీ కొంత బి.సిలకు దూరం అవుతూ వచ్చినట్లు ఇటీవలి ఎన్నికల్లో తెలియవస్తూ ఉంది. 2014 నాటికి ఇప్పుడున్న నేపథ్యంలో పార్టీ వ్యూహరచన చేసుకోవలసి ఉంటుంది. బి.సి ఎస్.సి లకు సింహభాగాన్ని ఇచ్చి. ఎనబై శాతం సీట్లను ఈ రెండు వర్గాలకు పార్టీ ఇవ్వగలిగితే నిజమైన అధికారాన్ని బలహీన వర్గాలకు బదిలీ చేసే స్థిరసందేశాన్ని ఈ బి.సి ఎస్.సి వర్గాలకు ఇవ్వగలిగితే తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది. 2014 నాటికి బి.సిలు పార్టీపెట్టి అది ఒక నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు ఎండమావుల్లా ఉన్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మా పార్టీ లో బి.సి సెల్లు ఉంది దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు వారికి కూడా పదవులు ఇస్తున్నాము అని చెప్పుకోవడం, కాక. మాదే బి.సిల పార్టీ బలహీన వర్గాలు అన్నింటికి కలిపి ఎనబై శాతం సీట్లు ఇస్తున్నాం ఇది బి.సిల పార్టీ అని ఒక ముద్రను పార్టీ ఇవ్వగలిగితే 2014 నాటికి ఇలాంటి వ్యూహరచన చేసుకోగలిగితో రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ స్థితిని పొందే అవకాశం ఉంది.  బి.సిలకు బలహీన వర్గాలకు ఎనబై శాతం సీట్లు ఇవ్వడం అన్నది వైకాపా చేయలేదు, కాంగ్రెస్ అసలే చేయలేదు. చేయగలిగేది ఒక తెలుగుదేశం పార్టీయే. మాది బి.సిల పార్టీ అనిపించుకోగలగిన అవకాశం దానికే ఉంది. ఈ వ్యూహం తెలుగుదేశానికి వరం అయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రలో తెలుగు దేశం సంపూర్ణ మెజారిటీ సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో 2014 నాటికి తెలుగు దేశం పూర్తిగా నిర్ణాయక శక్తిగా మారవచ్చు. ఏమైనా తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటూ ఉంది. బలహీన వర్గాలకు సామాజిక న్యాయమే కాదు రాజ్యాధికారం అవసరం ప్రాంతీయ న్యాయమూ అవసరం అనే నిజాన్ని గ్రహించి పార్టీ 2014 కు వ్యూహరచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఆర్ నాటి వైభవాన్ని పొందవచ్చు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604

Sunday, July 8, 2012

An Article on Madiga Poetry




మార్గం వేసుకున్న మాదిగ కవిత్వం

ప్రతి శాస్త్రంలోను ప్రతి జీవన రంగాలలోను సెగ్మెంటేషన్ పెరుగుతున్న రోజులివి. శాస్త్రం పెరిగిన కొద్దీ ఒక అధ్యయన రంగం కాని కళా రంగం కానీ వైపుల్యాన్ని సంతరించుకుంటున్న క్రమంలో దానిలో చిలవలు పలవలుగా శాఖోపశాఖలు ఏర్పడతాయి. ఉదాహరణకి వైద్య రంగంలో శరీరంలోని పైకి కనిపించని లోలోని ఎన్నో అవయవాలకు ఒక్కొక్క దానికి ఒక్కో శాస్త్ర అధ్యయన రంగం ఏర్పడింది. తెలుగు కవిత్వం కవిత్వ అధ్యయనం అంటే విమర్శలలో కూడా ఈ తీరు కనిపిస్తూ ఉంది. కవిత అంటే ఒకప్పుడు కవితే. కాని నేడు అలా కాదు. తెలుగు కవిత్వం చాలా వర్గాలుగా విడిపోయింది. స్త్రీ వాద కవిత, దళిత కవిత, బి.సి వాద కవిత, మైనారిటీ కవిత, డయస్పోరా కవిత, బ్లాగు కవిత, అంతర్జాల కవిత. ఇన్ని రకాలుగా వచ్చాయి. ఇందులో దళిత కవిత్వం తిరిగి విడిపోయింది. మాదిగ కవిత్వం, మాల కవిత్వం, దళిత స్త్రీవాద కవిత్వం అనేవి ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దళిత స్త్రీ వాద కవిత్వంలో కూడా మాల, మాదిగ వైరుద్ధ్యం వస్తుందేమో చూడాలి. ఇది ఇప్పటికైతే స్ఫుటంగా కనిపించడం లేదు. మొత్తం మీద దళిత కవిత్వంలో మాదిగ కవిత్వం అనేది ప్రత్యేకంగా రూపుదిద్దుకొంది. ఈ వాదంతో ఎంతో మంది కవులు మంచి కవితల్ని ప్రచురించారు. వీరి కవితలతో ఒక ప్రత్యేకమైన కవిత సంకలనమే వచ్చింది. ఈ మాదిగ కవితా వాదంలోని బాగోగుల్ని ఎలువు సలువుల్ని చూడడం ఇక్కడి ఉద్దేశం.   
దళిత కవిత్వంలో మాదిగల ప్రత్యేక కవిత్వం రావడానికి ఒక ప్రధానమైన సాంఘిక కారణం ఉంది. ఇది మాదిగలు తమ అస్త్విత్వం కోసం చేసిన బ్రతుకు పోరాటం. అదే మాదిగ రిజర్వేషన్ పోరాటం. ఎన్నో దశాబ్దాలుగా అంటే రిజర్వేషన్ అమలైన దగ్గరనుండి దాని అమలులో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని. వచ్చిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మాల కులం వారికి వెళ్ళాయని తమకు అన్యాయం జరిగిందని మాదిగలు ఉద్యమోన్ముఖులయ్యారు. మొత్తం షెడ్యూల్డు కులాలలో మాదిగల ఉపకులాలు 25 కాగా మాలల ఉపకులాలు 27 అని సేకరించిన ఆధారాలు తెలియ జేస్తున్నాయి. ఇందులో మాదిగ మాల అనే కులాలు ప్రధానమైనవి. కాని రిజర్వేషన్ అన్నది అన్నిషెడ్యూల్డు కులాలకు కలిపి ఒకే యూనిట్ గా ఉండడంవల్ల వచ్చిన 15 శాతం రిజర్వేషన్ లో ఎస్.సి కేటగిరీ పొందిన కులం ఎదైనా ఉద్యోగాన్ని పొందడానికి వీలుంది. అయినా పొందిన ఉద్యోగాలలో కాని సర్కారీ లబ్ధి దారులలో కాని మాలలే అత్యధికంగా ఉన్నారని మాదిగలలో విద్యావంతులైనవారు మేధావులు భావించారు. వారికి అందిన గణాంకాల ప్రకారం 90 శాతం పైగా ప్రభుత్వ ఉద్యోగాలలో మాలలు ఉన్నారని అందువల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగిందని మాదిగలు దాని ఉపకులాలు చాలా పెద్ద ఉద్యమం చేసాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద సాంఘిక ఉద్యమంగా దీన్ని పేర్కొనవచ్చు.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ లో ఎ.బి.సి.డి అనే ఉపవిభాగాలను చేసింది. దీని ద్వారా సాంఘిక న్యాయం జరిగిందని వారు భావించారు. కాని తర్వాత సుప్రీంకోర్టు ఈ ఉపవిభాగల రిజర్వేషన్ ను కొట్టివేసింది. దీనితో రాజ్యాంగ సవరణ అవసరం అని మాదిగ పోరాట ఉద్యమం దీన్ని చేయించేలా చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం మీద తీవ్రమై ఒత్తిడి చేస్తూ ఉంది. అంతే కాదు ఈ ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది.
ఈ సాంఘిక నేపథ్యంలో మాదిగలు తమ సామాజిక అస్తిత్వాన్ని తాము సాధించుకునే దిశగా ఉద్యమం చేసే సందర్భంలో వారిదైన సాహిత్యం కూడా సృజించుకున్నారు. అంతే కాదు. మాల మాదిగల మధ్య వృత్తి పరంగా సాంఘిక సంబంధాల పరంగా సాంస్కృతిక పరంగా చాలా వైరుద్ధ్యాలు చాలా శతాబ్దాలనుండి ఉన్నట్లుగా పరిశీలనలో తెలుస్తుంది. తెలుగులో ఒక పలుకుబడి ఉంది అన్నాదమ్ములు తగాదా పెట్టుకొని విడిపోయేటప్పుడు "వాడు మాల నేను మాదిగ ఇక వాడికి నాకు ఏ సంబంధం లేదు". అని అంటూండటం ఉంది. అన్నా తమ్ముళ్ల వంటి మాల మాదిగల మధ్యన వైరాలు ఉన్నాయని ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాషువా కూడా ఈ ప్రస్తావన చేసాడు. గబ్బిలం రెండవ భాగంలో ప్రత్యేకించి చెప్పాడు. ఇద్దరూ కలిసి పని చేయవలసి వచ్చింది అని కూడా చెప్పాడు. కాని ఈ సాంఘిక వైరుద్ధ్యాలు పెరుగుతూ వచ్చాయే కాని తగ్గలేదు. రాజకీయ రంగంలో కూడా పార్టీలు తాము ఇచ్చే సీట్లలో కానీ లేదా ప్రభుత్వ పదవులలో కాని ఈ వైరుద్ధ్యం ప్రభావం కనిపిస్తూ ఉంది. పార్టీలు ప్రభుత్వం ఈ వైరుద్ధ్యాల మధ్య ఒక సమతూకం ఉండేలా చూస్తున్నాయి. కాని రిజర్వేషన్ కారణంగా ఇరు కులాల మధ్య బాగా అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితి కవులలో కవితలలో పూర్తిగా ప్రతిబింబించింది. ఇద్దరి మధ్యనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి కూడా ఒక దశలో ఏర్పడింది. కాని అక్కడక్కడ సమన్యయ ధోరణులు బాగా కనపడ్డాయి. ఇటీవల కత్తి పద్మారావు ఒక దినపత్రికలో ఒక సాహిత్య వ్యాసం రాస్తూ తాను జాషువ నుండి చాలా స్ఫూర్తి పొందానని రాసాడు. ఇలా సమన్వయం చేసే వారు కొందరు సాహిత్య కారులు ఇరు వర్గాల నుండి ఉన్నా ఈ వైరుద్ధ్యం బాగా వైపుల్యం చెందింది. చివరికి ప్రభుత్వం జాషువా పేరుమీద ఒక సాహిత్య పీఠాన్ని పెట్టగానే మాల వర్గంనుండి మరొక డిమాండ్ వచ్చింది. జాషువా అంత స్థాయి మహాకవి ఉండగా దళితులందరికీ అతను ప్రాతినిధ్యంవహిస్తాడనే దృక్పథం మాల వర్గం అటుంచింది వారి వర్గం నుండి కూడా ఒక కవి పేరుతో పీఠం ఏర్పాటు కావాలనే కోరిక బలంగా వినిపించిన కారణంగా ప్రభుత్వం బోయి భీమన్న పేరుతో మరొక పీఠాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కనిపించే సామాజిక వైరుద్ధ్యాలు దళిత సాహిత్యంలో తిరిగి మాల మాదిగ కవిత్వం అనే వింగడింపులకు కారణం అయింది.
మాదిగ కవులు చాలా కాలంనుండే కవిత్వం రాస్తున్నారు. జాషువా మాదిగ వర్గంలో శిఖర ప్రాయమైనకవి. ఈయన 1919 ప్రాంతంనుండే కవిత్వాన్ని వెలయించడం ప్రారంభించాడు. కాని 1893 లో ఆంధ్రక్రైస్తవ గీతాలు అనే పుస్తకం వెలువడింది. దీనిలో కొందరు మాదిగ కవులు పాటలు రాసారు. ఆధునిక కాలంలో ఇదే తొలి మాదిగ కవిత్వంగా భావించాలి. (కృపాకర్ మాదిగ ఈ సమాచారాన్ని అందించాడు). కాని మాదిగ కవిత్వాన్ని ఈ వ్యాసంలో ఆ  కాలంనుండి పరీశీలించడం లేదు. 1985 తర్వాత మాదిగల సాంఘిక అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మాదిగ కవిత్వం అనే ప్రత్యేకమైన వింగడింపు ఏర్పడిన కారణంగా ఆనాటి నుండి ఉన్న కవితలనే ఇక్కడ పరిశీలిస్తున్నాను. ఆధునిక కవులలో కనీసం 60 మంది మాదిగ వర్గానికి చెందిన కవులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పొనుగోటి కృపాకర్ మాదిగ ఒక మంచి ప్రయత్నం చేసి మాదిగ కవులు చేసిన ఆధునిక కవితలను ఒక సంకలనంగా కూర్చాడు. కైతునకల దండెం అని దీనికి పేరు పెట్టాడు. ఇందులో 91 కవుల కవితలు ఉన్నాయి. ఇందులో దళితేతరులైన ఇతర కులాలకు చెందిన కవులు కూడా రాసిన కవితలున్నాయి. ఇది చాలామంచి ప్రయత్నం. అంతే కాదు. మాదిగలకున్న ప్రత్యేకమైన చారిత్రికాంశాలను సాంస్కృతిక నేపధ్యాన్ని మాలలతో వారికున్న సంబంధాన్ని గురించి వివరిస్తూ  ఈ కవితలను చదవడానికి ఒక నేపథ్యాన్ని సృష్టించాడు కృపాకర్. పై చెప్పిన ఈ కాలంలో వచ్చిన ప్రముఖమైన కవితలనీ అదీ మాదిగ వాదాన్ని వినిపించే కవితల్ని ఇక్కడ కొన్నింటిని పరిశీలిస్తాను. అయ్యయ్యో దమ్మక్కా అనే కవితా సంకలనంలో జూపాక సుభద్ర పుస్తకం పేరుతోనే ఉన్న కవితలో మాదిగల సాంఘిక జీవితాన్ని వర్ణించింది. తెలంగాణాలో అమాయకమైన స్త్రీని సర్వసాధారణంగా ఓసి దమ్మక్కా అని అంటారు. ఇతర ప్రాంతాలలో దద్దమ్మా అనే అర్థంలో దీన్నివాడతారు. ఉత్త అమాయకురాలైతివి కదా అనే అర్థంలో దీన్ని  వాడతారు. ఈ అయ్యయ్యో దమ్మక్కా అనే కవితలో ఒక చోట "మల్లన్న తోలమ్మ/ మొకానికి గింత సున్నం బూడిద రాసియ్యంగనే/ దప్పుగ తెప్పుగ/, తొండంగ, సబ్బండగ/ నన్ను జూడు నా అందం జూడని/ గీ జబ్బురు తోలమ్మ తొంబై రకాలుగా వన్నెలు బడ్తదా". ఇక్కడ మాదిగ వృత్తి నేపథ్యాన్ని వర్ణిస్తూ ఉంది  కవయిత్రి. మాదిగల వృత్తి చెప్పులు కుట్టడం దానికి వారు తోలు ఊనుతారు. తోలుకు సున్నం బూడిద రాస్తారు. ఉప్పుకూడా రాస్తారు. తర్వాత లందలో తంగేడు చెక్కలో నానబెడతారు. ఇంకా చాలా పని చేసి తోలును ఊనుతారు. అంటే టానింగ్ చేస్తారు. తర్వాతనే ఇది చెప్పులకు కాని డప్పుకు కాని లేదా మోట బొక్కెన తొండానికి కాని ఇతర వ్యవసాయ అవసరాలకు కాని వినియోగిస్తారు. ఇంకా దీని కష్టాలు వర్ణిస్తుంది సుభద్ర ఇక్కడ. "అయ్యయ్యో దమ్మక్కా... / లందను పొందిచ్చుడంటే/ గుబండ కుదిచ్చుకొని/బొంద దువ్వినట్లు గాదు/ నరం తోలు నానీకి/ కోసెడు బాటలు అరిగే నీళ్ళు మొయ్యాలె/ కుక్క నక్క కాకి గద్ద కండ్ల పడకుంట/ కూడు మర్సి కావలుండాలె/లుక్కలుక్క పురుగులు/ జిబ్బజిబ్బ ఈగలు/ గప్ప గప్ప గబ్బులు/ కడుపుల పేగుల్ని కత్తోలె మెలిబెట్టి/ కండ్లు బెయిని తిప్పి అడ్డం బెడేసినా తప్పని తలరాతయింది అయ్యయ్యో దమ్మక్కా". ఇంకా ఇలా సాగుతుంది కవిత. దీనిలో స్పష్టంగా మాదిగల వృత్తిలో ఉన్న భీకరమైన కష్టాన్ని వర్ణించింది. దీనికి భిన్నంగా మాలల జీవితం ఉంటుంది. వారికి చర్మకార వృత్తి లేనేలేదు. అయితే వ్యవసాయం లేదా నేత. లేదా ఇతర చాలా వృత్తులు. కూలీ జీవితం. కాని ఈ మాదిగ జీవితంలోని కష్టాన్ని అనుభవించిన వారుతప్ప దీన్ని తెలుసుకొని రాయలేరు. ఇదే వృత్తిని ఎండ్లూరి సుధాకర్ అత్యంత ప్రతిభావంతంగా రచించాడు. "ఈ సప్త సముద్రాల తోలు ఒలిచి/ఆకాశానికోమేకు/పాతాళానికోమేకు/ సప్త సముద్రాల మీద/ చర్మాన్ని నానబెట్టిన నీకు/ ఆసూర్య చంద్రులు / చెరో చెప్పు కావలసిందే/ఆకలితోనో/అవమానంతోనో/ తలవంచుకొని నీ చర్మపు జోళ్ళు/ కుట్టుకుంటున్న తాతా/ ఈ ప్రపంచం/ ఉంగటంగా మారి నీ ముంగాలి బొట్టినేలిని/ ముద్దు పెట్టుకోవాలని/ కలలు కంటున్నాను". మాదిగ వృత్తిని నేపథ్యంగా వర్ణంచిన ఈ కవితలో జాంబవుని ప్రసక్తి, జాంబపురాణ ప్రసక్తి ఉంది. విశ్వమంత నేపథ్యం ఉందీ కవితలో. జాంబవుడు అవలీలగా సప్త సముద్రాలను దాటేవాడని పురాకథ ఉంది. రామాయణంలో జాంబవునే మొదట లంకకు పోయి రమ్మని చెప్పగా. పూర్వం నాకు మోకాలి లో ఒక పర్వతం విరిగింది తానిప్పుడు ఎగరలేను హనుమంతుడు దానికి సరైన వాడని చెబుతాడు. ప్రపంచ మొత్తం ఉంగటంగా మారి నీ పాదాలను ముద్దుపెట్టుకోవాలి అనడం అత్యంత ప్రతిభా వంతమైన కవితాభివ్యక్తి అదే సమయంలో మాదిగల కుల అస్తిత్వంపైన మంచివాదాన్ని వినిపిస్తుంది ఈ కవిత విశ్వం మొత్తాన్ని నేపథ్యంగా చేసిన ఈ కవితాప్రతిభా శక్తిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎండ్లూరి సుధాకర్ ఇటీవలే వెలయించిన గోసంగి కావ్యం కూడా కవితాప్రతిభకు పండిన చేను. మాదిగలలో ఒక ఉపకులమైన గోసంగి కులం గురించి ప్రత్యేకంగా రాసిన దీర్ఘ కవిత ఇది. ఇందులో వారి ప్రత్యేక సాంఘిక అస్తిత్వాన్ని గురించి మాట్లాడాడు. మొత్తం దళిత కవులలోనే ఎండ్లూరిసుధాకర్ ఆధునిక కాలంలో ఉన్న అత్యంత ప్రతిభావంతమైన సృజనశీలియైన కవి అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో రాసే మరొక దళిత కవిని ఇంకా వెదక వలసే ఉంది. మాదిగలలోనే కళాకారులు కళారూపాలు చాలా ఉన్నాయి. బైండ్లకథ ఆసాది కథ డక్కలి పటంకథ, చిందుయక్షగానం, గోసంగి వేషం, ఇవన్నీ మాదిగల ఉపకులాల కళారూపాలే. వారు జన్మతః కళాకారులు, మంచిగాయకులు ఈ స్థితిని వర్ణించే కవిత నాగప్పగారి సుందరరాజు రాసిన కవిత పెద్దింటి పిల్ల దీనిలో గ్రామంలోని అన్ని కులాల ఆడపిల్లలు పెద్దమనిషి అయినప్పుడు పోయి పాట పాడిన మాదిగ పిల్ల తాను పెద్దమనిషి అయితే ఒక్క కులం వారు కూడా రానందుకు హృదయం ద్రవించేలా బాధపడుతుంది. చివరికి మా మాలోళ్లు కూడా మా కంటే ఎక్కువంట వాళ్ళ పిల్ల కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు కూడా మా కంటే పెద్దోళ్ళంట అని అనుకుని నా పాట నేనే పాడుకుంటా నా పాట నేనే పాడుకుంటా అని ఈ కవిత ముగుస్తుంది. మాదిగల జీవితపు మరోకోణాన్ని ఆవిష్కరించింది ఈ కవిత. మాదిగలు చనిపోయిన పశువులను తీసుకుపోవడం దాని మాంసాన్ని విభజించడం పంచుకోవడం తినడం గురించి వర్ణించిన కవితలున్నాయి. మాదిగల సాంస్కృతిక చిహ్నాలైన డప్పును చెప్పులుకుట్టే ఆరె చిహ్నాన్ని వారి ఇతర సంగీత  చిహ్నాలను మాలలు హైజాక్ చేసి వారి కులసంబంధ విషయాలలో మాలలు వాడుకుంటున్నారని బాధను వ్యక్తం చేసిన కవితలున్నాయి. సువార్తమ్మ అనే కవయిత్రి (బహుశా మారుపేరేమో) తెరతీయగరాదా అనే కవితలో మాల ప్రముఖులు తమ మాదిగలకు చేసిన అన్యాయాలను రాజకీయాలను ఎండగడుతుంది. మాల ప్రముఖుల పేర్లను కవితలలో నర్మ గర్భంగా ఇరికించి వారి దమననీతిని దుయ్యబడుతుంది ఈ కవిత. దున్న కూర అనే కవితలో మాదిగల ఆహార సంస్కృతిని గురించి వర్ణించడం ఉంది. మాదిగ సాహిత్యాన్ని సృష్టించడమే కాదు దానికి మార్గదర్శనం చేస్తూ సాహిత్య కృషి  చేస్తున్న మరికొందరు ప్రముఖులలో దార్ల వెంకటేశ్వరరావు ఒకడు. కొలకలూరి ఆశాజ్యోతి, ఎజ్రా శాస్త్రి లాబన్ బాబు. ఇంకా చాలా మంది కవులు దాదాపు అరవై మందికి పైగా మాదిగ కవులు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తి సాంఘిక ఆవేశంతో వచ్చిన ఈ కవితలలో కవిత శక్తి చాలా పలచబడిన అసలు లేని కవితలు కూడా ఉన్నాయి. కేవల వచన ప్రాయమైన కవితలూ వచ్చాయి. వాటిలో ఉన్నది మాదిగ ఉద్యమ స్పూర్తే.  మాదిగ కవిత్వాన్ని ఒక చోట సంకలించిన సంకలనానికి కైతునకల దండెం అనే పేరు పెట్టడం కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంది. తెలంగాణాలో కవిత్వం రాసే వాడిని కైతకాలోడు అంటారు. కవిత్వాన్ని కైతకం అంటారు. కై  అన్నది దీనికి  పొట్టి రూపం. దండెం  అంటే ఇంటిలోపల బట్టలు వేసుకోవడానికి గడను కాని పొడవాటి కర్రను కాని అడ్డంగా వేలాడదీసి కడతారు. దీన్ని తెలంగాణాలో దండెం అంటారు. అలాగే మాదిగలు మాంసం ముక్కల్ని ఇంటి బయట ఆరేసుకోవడానికి కట్టిన తాడు కాని గడను కాని దండెం అని అంటారు. ఈ ముక్కల్నే సియ్యలు అని అంటారు. సియ్యలు ఆర బెట్టేది దండెం. కవితలను కైతునకలు అని అచ్చ తెలుగు మాట వాడి  ఈ పేరు పెట్టడంలో కూడా మాదిగల జీవన రీతి తెలియ వస్తూ ఉంది. దళిత కవిత్వంలో మరొక పాయ ఉందని దీన్ని ప్రత్యేకంగా చూడాలని దళిత కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని గుండుగుత్తగా చూడడం వల్ల సరైన ఫలితం ఉండదని సాహిత్య విమర్శలో గ్రహించాలి. మాదిగ కవిత్వం, సాహిత్యం ప్రత్యేక మార్గాన్ని వేసుకుంది. ఇది వారి అస్తిత్వ మార్గం దీన్ని ఇలా చూస్తేనే సామాజిక న్యాయం మరింతగా జరుగుతుంది.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604