Sunday, December 29, 2013

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నేటికి ఏడాది దాటింది

ద్రావిడ విశ్వవిద్యాలయం

ఏవి తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు
నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పునరాలోకన

తెలుగు తల్లీ ఎక్కడమ్మా నీదు మల్లియలు

ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు

ఎచట తల్లీ నిరుడు పాడిన మెచ్చుగీతికలు

ఏల తల్లీ తెలుగు భాషకు ఈ దురదృష్టం

ఏవీ తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు

సరిగ్గా పోయిన ఏడాది ఇదేరోజు అంటే డిసెంబరు  29 న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసాయి. డిసెంబరు 27 నుండి 29 దాకా మూడు రోజుల పాటు జరిగాయి. సాక్షాత్తు మహా మహిమ్ భారత రాష్ట్రపతి తిరుపతికి విచ్చేసి  ఈ మహా సభల్లో పాల్గొన్నారు. ఎన్నో కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలోఉన్న తెలుగు వారు ఒక చోట చేరడానికి మంచి అవకాశం లభించింది. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్నో తెలుగు ప్రదర్శన కళలు లలిత కళలు ప్రదర్శితమైనాయి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమలు మూడు రోజుల పాటు చాలా అట్టహాసంగా చాలా ఆనందకరంగా జరిగాయి. సరే కొంత మంది అలగడం. మాకు తగిన ప్రాధాన్యం రాలేదని బాధపడడం ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఎలాగూ ఉంటాయి. అలగే ఉండినాయి. అంత మాత్రమే కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఏలినవారి పక్షాన మనామనిగా ఎంపికలు జరగడం కూడా తోసివేయరాని విషయం.
సరే ఈ వేడుకలన్నీ ఆనంద కరమైనవే. వీటిని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేన్ని గురించి ఆలోచించాలి. తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల అభృద్ధికి, తెలుగు అధికారభాషఅమలు గురించి చేసిన వాగ్దానాలు ఎన్ని. వాటికి పట్టిన గతి ఏమిటి అనే ఆలోచించవలసిఉంటుంది. ఇది ప్రభుత్వాన్ని కాని లేదా కొందరు ప్రభుత్వాధికారులు కానీ విమర్శించడానికి చేసే ప్రయత్నం కాదు. తెలుగుకు పట్టిన ఈ దౌర్భాగ్యస్థితికి ప్రగాఢమైన బాధను వ్యక్తం చేయడానికి చేసే ప్రయత్నమే. ప్రభుత్వ ప్రతినిధిగా మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఆయన నిజంగా భాష పట్ల సాహిత్యం పట్ల మంచి నిబద్ధత ఉన్నవారు. మంచి పని చేయాలని తలపెట్టినవారు. కాని ఆయన ఒక అనుకోని తీరులో రాజీనామా కూడా చేశారు. సభల్లో చేసిన వాగ్దానాలు చేసిన పథకాలు ఏవీ అమలు కాక పోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించవలసి ఉంది.
ఒక పక్క రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతుంది. తెలుగు జాతి తెలుగు భాష అని ఒక ఏకీకరణ భావంతో జరిగే ఈ మహాసభలు రాష్ట్రవిభజనకు అడ్డుపడతాయని తెలంగాణా వారు భావించారు. అక్కడనుండి చాలామంది కవులు కళాకారులు ఈ మహాసభలకు హాజరు కాలేదు. ఇది రాజకీయ కారణం. అయినా కొంత మంది హాజరయినారు. కొన్ని తెలంగాణా ప్రాంత జానపద కళారూపాలు కూడా ప్రదర్శితమైనాయి. ఇది సంతోషించ దగిన విషయమే.  ఈ మహాసభల్లో ముఖ్యమైన పథకాలు వాగ్దానాలు బయటికి వచ్చాయి. ముఖ్యమైనవి ఏమంటే అన్ని స్థాయిల్లోను తెలుగు అధికార భాషగా అమలు కావాలి. అవసరమైన చోట ఉర్దూ రెండవ అధికార భాషగా ఉంటుంది. ఈ ప్రయత్నం కొంత జరిగింది. న్యాయస్థానాలలో కూడా పూర్తి స్థాయిలో తెలుగు అమలు జరగాలని మరికొన్ని సభల్లో కూడా నిర్ణయాలు జరిగాయి. కాని దీని పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ పీఠమైన రాష్ట్ర సచివాలయంలోనే తెలుగు అమలు చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ
ఉత్తర్వులు ఎన్ని తెలుగులో వస్తున్నాయి అనే విషయం వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం పాఠశాల స్థాయిలో తెలుగు తప్పనిసరిగా ఒక అంశంగా ఉండాలి. ఈ నిర్ణయం ఆనాడే నిరాశను కలిగించింది. కారణం ఇంటర్ విద్య వరకు తెలుగు ఉండాలని తలపెట్టారు. కాని పది వరకైనా ఎన్ని పాఠశాలల్లో ఇది అమలు జరుగుతూ ఉందని ఏ విచారణైనా జరిగిందా. దీని అమలుకు పకడ్బందీ ప్రణాళిక విధానం రచితమైందా లేదు. అంతే కాదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలను నిరోధించి తెలుగును తప్పని సరి భాషగా పెట్టేందుకు ఏదైనా కచ్చితమైన అదేశాలు వారికి చేరాయా అవి అమలు అవుతున్నాయా ఫలితం ఏమి జరిగింది.
నగరాలలో అన్ని పట్టణాలలో దుకాణాల ముందు అన్ని సంస్థల ముందు నామ ఫలకాలన్నీ తెలుగులో ఉండేలా ఆదేశాలు చేస్తామన్నారు. నాటి అధి కార భాషాసంఘం అధ్యక్షులు దీని అమలును గురించి చాలా శ్రద్ధగా చెప్పారు. చేశారు కూడా. కాని హైదరాబాదులో నగరంలోని ఏ దుకాణం ముందూ బోర్డులు తెలుగులోనికి మారలేదు. అదే కర్ణాటకలో అయితే స్వచ్ఛంద సంస్థలవారే ఇంగ్లీషులో ఉన్న బోర్డులు అన్నింటిపైన నల్లరంగుపూస్తారు. కన్నడంలో రాసినదాకా ప్రభుత్వం వారు కూడా ఊరుకోరు. ఈ అదృష్టం తెలుగుకు రావడానికి ఇంకా ఎన్నిదశాబ్దాలు ఎదురు చూడాలి. ఈ ఏడాది మొత్తం తెలుగు భాష సాంస్కృతిక  సంవత్సరంగా పాటించి విశేషకార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. కాని ఏమి జరిగింది. మూడు కళా వేదికలు అంటే ఆడిటోరియంల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆ దిశగాపని ఏమి జరుగుతూ ఉందో తెలియదు. ఇది యాదృచ్ఛికంగా తెలుగు వైతాళికుడు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు నూటాఏభై యవ జయంతి. ప్రభుత్వం ఆయన కోసం కొన్ని మంచిసభలను నిర్వహించింది. మంచి కార్యక్రమాలు చేపట్టింది. కాని ఆయన కట్టుకున్న సొంత ఇల్లు ఆకుటుంబానికి దారిలేక అమ్ముకోవలసి వచ్చింది. దాన్ని కొనుకున్న వారు దాన్ని కూలగొట్టారు. ఇది తెలుగు వారు అందరినీ కలచివేసే అత్యంత దురదృష్ట ఘటన. ఏ భాషా రాష్ట్రంలోను ఇది జరిగి ఉండేది కాదు. ఏ మహాకవికీ ఇంతటి క్షోభకలిగేది కాదు. ఇది తెలుగు వాడైనందుకు గురజాడకు పట్టిన గతి.
ప్రపంచ మహా సభలు నిర్వహించి ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. కాని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏడాది గడిచి పోయింది. ఈ దురదృష్టానికి కారయణం ముఖ్యమైంది, తెలుగు జాతి ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే. రాష్ట్రం చీలి పోయే స్థితిలో అటు వారు కాని ఇటు వారు కాని చివరికి ప్రభుత్వం కాని భాషను గురించి పట్టించుకునే స్థితిలో లేదు. తెలంగాణా వారికి ముందున్న పెద్ద సమస్యవారికి రాష్ట్రం ఏర్పడడం ఆ సమస్య ముందు భాషకు సంబంధించినది వారికి చాలా చిన్న సమస్య అయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిదైన భాషా విధానాన్ని వారు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సర్కారాంధ్ర వారికి కాని రాయలసీమ వారికి కాని ముందున్న సమస్య రాష్ట్ర విభజనను అడ్డుకోవడం. ఈ సంకులసమరంలో తెలుగు భాషకోసం చేసుకున్న బాసలన్నీ నీటిలో కలిసినయ్. తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కు చెందిన కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్కడికి రావాలనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అది రెండు రాష్ట్రాలలో పని చేయవలసి వస్తుంది. తెలంగాణా వాడిగానే తెలంగాణా వాదిగానే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను.  రాజకీయంగా అధికార పరంగా పాలనా పరంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో ఉండవచ్చు. ఇది వేరే విషయం కాని భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో మనం ఇద్దరం అన్నదమ్ములం కొంత సంయమనం పాటించాలి రెండు రాష్ట్రాలలో ఉన్నంత మాత్రాన మాండలికాలు మారినంత మాత్రాన తెలుగు భాష రెండుగా చీలదు. అప్పుడు కూడా రాజమండ్రి నన్నయను, వరంగల్లు పోతన్నను రాయలసీమ పెద్దన్నను ఒకే భాషాసాహిత్య విమర్శ విధానాలతో చూడవలసి ఉంటుంది. అప్పుడూ తెలుగు సాహిత్యం ఒకటే అవుతుంది. తెలుగు తల్లికూడా రెండుగా చీలి తెలంగాణా తల్లి, ఆంధ్రమాతగా రెండుగా అవతారాలెత్తవలసిన అవసరం లేదు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉమ్మడి విధానాలు అవలంబించవచ్చు. రాష్ట్రం ఎలాగూ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానినికలిగి ఉంటుంది కాబట్టి తెలుగు క్లాసికల్ సంస్థ రాజధానిలోనే పెట్టుకొని ఇరు ప్రాంతాల వారు కలిసి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. అదే సమయంలో తెలంగాణా మాండలికాలకు రాయలసీమ మాండలికానికి కళింగాంధ్ర మాండంలికానికి తగిన విధంగా పెద్ద పీట వేసుకొని పరిశోధనలు చేయవచ్చు.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ఏడాది గడిచిపోయింది. అయినాఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది.  ఎవరినీ నిందించకుండా రెండు ప్రాంతాల వారు భాషాసాహిత్యాలకు సంబంధించి అధికార భాష అమలుకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవలసిన సమయం ఇది. ఇది ఎవరినో తప్పుపట్టడానికి కాకుండా తెలుగు భాషకు పట్టిన దురదృష్టానికి బాధపడుతూ రాసేది. భాషా సాహిత్యాల విషయంలో ఇద్దరు అన్నదమ్ములు మరింత సహనంతో సంయమనంతో పని చేయవలసిఉంది. చేసిన బాసలను తిరిగి ఆలోచించుకోవలసిన సమయం కూడా ఇదే.

Monday, December 16, 2013

Telugu Poetry in Internet Medium

పులికొండ సుబ్బాచారి

తెలుగు కవిత్వం మాధ్యమ పరిణామం, గుణాత్మక పరిణామం

కవిసంగమం ప్రయోగం కవిసంగమం ప్రగతి చారిత్రకం అవుతుంది

కవిసంగమం చిన్ని ప్రయత్నంతో ప్రారంభం అయింది. నా తమ్ముడు యాకూబ్ దీనికి నాంది పలికాడు. ఇంటర్ నెట్లో ఉన్న సౌకర్యన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చాలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఇతనికి కలిగింది. ఒక ప్రయత్నం చేశాడు. అతనికి వ్యక్తిగతంగా గడచిన పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్నవారు అయిన యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగాడు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. నాకు తెలిసిన వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు. కవిసంగమం ముఖపుస్తకం ఇప్పటికే సాధించిన ప్రగతి (విజయం అని అనడం లేదు)ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఇది చాలా ప్రముఖమైనది చారిత్రకమైనది అవుతుంది.
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవి సంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమంలోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ ను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్నవారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు.  తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనిక ప్రవేశించినదని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
అయితే కవి సంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ,  వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. తెలుగు పదం అనే ఒక గూగుల్ మెయిల్ గ్రూపు ఒకటి తెలుగు పదాల నూత్న కల్పనలను గూర్చిన ప్రయోగం చేసింది. అది ఇంకా జరుగూతూనే ఉంది. కాని మెయిల్ గ్రూపు కవిత్వ వ్యాప్తికి అంతగా అనువైనది కాదు. కాని ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న గూగుల్ ప్లస్ లో కూడా కవిసంగమంలాంటి ప్రయోగం చేయవచ్చు. నేను కూడా బ్లాగు తయారు చేసి దానిలో వ్యాసాలని కవితలను ప్రచురించడం దాదాపు ఆయిదు సంవత్సరాల క్రితమే చేసాను. దాదాపు రెండు వేలమందికి పైగా పాఠకులు నా బ్లాగును చదినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పినట్లుగా బ్లాగుకు, ఫేస్ బుక్ కు ఉన్నంత చాలన గుణం (డైనమిజమ్) ఉండదు. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.
అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందు బాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించ లేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడంమంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమిన్ని నిరసించిన వారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్త తరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు. కవిసంగమం రూపకర్త యాకూబ్ ని దీనికోసం నిరంతరం పనిచేస్తున్న ఇతర కార్యకర్తలను ఈసందర్భంగా నేను అభినందిస్తున్నాను. తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి కొత్త యుగంలోనికి ప్రవేశించినదని ఎలక్ట్రానికి మాధ్యమాన్ని అంటే విద్యున్మాధ్యమాన్ని ప్రత్యేక మాధ్యమంగా గుర్తించి, తెలుగు కవిత్వంలో విద్యున్మాధ్యమ కవిత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించి పరిశీలించాలని ఇక్కడ నేను ప్రతిపాదిస్తున్నాను.

పులికొండ సుబ్బాచారి. 

Friday, November 15, 2013

ఖమ్మం వీధుల్లో పరిమళం - హృదయ వైద్యునితో ఓ గంట.
ఖమ్మం వెళ్ళడం అంటే అక్కడి వీధుల్లో నడుస్తుండడం అంటే నాకెంతో ఇష్టం. ఏడాదికి ఒక్కసారైనా అలా ఖమ్మం వెళ్ళికి రాకపోతే ఏదో పోగొట్టుకున్నవాడిలా అయిపోతాను. ఖమ్మం వీధుల్లో నడుస్తుంటే అది వీధుల్లో నడవడం కాదు, నేను నా బాల్యంలో, కౌమారంలో, తొలియౌవనంలోనికి, తొలి ప్రేమసందడుల్లోనికి నడుచుకుంటూ వెళ్ళడమే. ఆమె కళ్ళు ఏవీధుల్లో జీవితాల్ని కొలుస్తూ తిరుగుతుంటాయో అనుకుంటూ నా కళ్ళు ఆ వీధులన్నీ ఆమె కళ్ళ కోసం గాలిస్తూ వెదికిన గుర్తులు అక్కడ ఇంకా చెదరకుండా ఉంటాయి. పగలంతా చెమటోడ్చి (దారు శిల్పం – అన్ని దారు పరికరాలు) అదే చెమటతోని ఈవెనింగ్ కాలేజికి అలా సైకిల్ పైన వెళ్తూ వెళ్ళిన రోజులు ఆ స్వేదపరిమళాన్ని మనసుముక్కుకు అందిస్తాయి.

బాబూ మియా టీ అంటే అదొక అనుభూతి. బాబూమియా అనే వ్యక్తి స్టేషన్ కి ఎదురుగా ఉన్న  అప్పటికి సన్నగా ఉన్న వీధిలో టీకొట్టు. అంటే మామూలు టీ కొట్టు కాదు. అతని చేతిలో ఏదో మాయ ఉంది. బొగ్గుల కుంపటి మీద  టీచేస్తాడు. అందులో అల్లం వేస్తాడు ఇంకేదో వేస్తాడు అతని మాయని. వేడివేడిగా అక్కడ బాబూమియా టీతాగడం ఖమ్మం వాసులకు అదొక అనుభూతి ఆ రుచిని ఎవరూ మరవలేరు. చాలా పెద్దవాళ్ళు అక్కడికి వచ్చి టీ తాగుతారు. కార్లు ఆపి బాబూ మియా టీ తాగి అక్కడినుండి ఆ ఉత్తేజంతో నిష్క్రమించడం అదొక భావన. అంతే కాదు ఈనాటికి బాబూమియా వారసులెవరో దాన్ని నడుపుతున్నారు. కాని ఆ పరిమళం లేదు. నేను అఫ్సర్ కబుర్లాడుకున్న ఆ ప్రభాత్ టాకీస్ కూలి పోయింది. ఏదో ఎక్కడో గాయం తగిలినట్లనిపించింది. ఆ వీధులన్నీ మారిపోయినయ్ పాతవాటిని కూల్చినయ్. తమను తాము వెడల్పు చేసుకున్నయ్ . జనసమ్మర్ధం బాగా పెరిగింది.

డా. ఎం.ఎఫ్ గోపీనాథ్ తో సంవాదం
నాకొక ఖమ్మం మిత్రుడు హృదయ వైద్యుడు  ఎం.ఎఫ్ గోపీనాథ్. భారత దేశంలో తొలి దళిత సామాజిక వర్గపు హృదయ వైద్యుడు. ఈయన హృదయాలను శోధించే హృదయ వేదనలకు స్పందించే భావుకుడు. నారచనలు ఆయన చదువుతుంటాడు. ఆయన రచనల్ని నేను చదువుతుంటాను. కలిసి ఒక దశాబ్దం పైగానే అయిందనుకుంటా. ఇటీవలి కాలంలో కలవలేదు. అయినా మేము మాట్లాడుకుంటూంటే రోజూ కలుస్తున్న వాళ్లం మాట్లాడుకున్నట్లే ఉంది. అదే వేవ్ లెంక్త్ అంటే... ఈసారి ఖమ్మంలో తప్పనిసరిగా కలవాలని ముందే అనుకున్నాం. 14 వ తేదీ ఆయనతో దాదాపు ఒక గంటపైగా గడపడం చాలా ఆలోచనలకు దారి తీసింది. ఇటీవలి ఆయన పుస్తకం "నాపొగరు మిమ్మల్ని గాయపరిచిందా అయితే చాలా సంతోషం". అనేది చాలామందిని బాగా ఆలోచింపజేసింది. మేము మాట్లాడుకున్న గంటసేపూ ఈ సామాజిక వేదనలగురించే.. మిత్ ని విశ్లేషించి సామాజిక వేదన తిరుగుబాటు వాటిలో ఎలా ఉందో తెలుసుకోవడం గురించి మాట్లాడుతూ మత రహిత సమాజం, జీవితం గురించ చాలా చర్చ చేశాము. జానపద శాస్త్రంలో పరసనల్ ఎక్స్ పీరియన్స్ నేరేటివ్స్ పైన పరిశోధన చేయడం ఈనాడు చాలా విస్తృతంగా జరుగూతూ ఉంది. దళితులకు సంబంధించిన ఇలాంటి నేరేటివ్స్ ని చాలా సేకరించాను. కాని ఇటీవలి కాలంలో ఒక దళిత ఎక్స్ పీరియన్స్ గోపీనాథ్ రాసినంత విస్తృతంగా ప్రభావవంతంగా రాలేదు. దీనిపైన మరింత అధ్యయనం అవసరమని ఇద్దరం గుర్తించాము.

మళ్ళీ ఖమ్మం పరిమళం గురించే మనసంతా భావనామయం అయింది. కవిత్వం చివ్వున లేస్తుంది ఖమ్మాన్నితలచుకుంటే. నేను, అఫ్సర్, సీతారాం, యాకూబ్ అందరం ఖమ్మం పరిళానికి తలవంచిన వారిమే..
పులికొండ సుబ్బాచారి.

Saturday, June 8, 2013

మిత్రులారా కవితలు పేజీలో నా సరికొత్త కవిత

చినుకు ఓనమాలు 
చూడండి.

స్పందిస్తే చాలా సంతోషం.
సుబ్బాచారి పులికొండ.

Wednesday, May 8, 2013


తెలుగు జాతి కవులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఎందుకీ వివక్ష 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రావూరి భరద్వాజను సముచితంగా గౌరవించింది. పదిలక్షల రూపాయిలను బహూకరించింది. అంతే కాదు సాంస్కృతిక శాఖ తన తరఫున రెండు లక్షల రూపాయిలను అందజేసింది. 
ఇంత వరకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. కాని ఇది వివక్షాపూరితం అని చెప్పాలి. అంతే కాదు కవులను, రచయితలను గౌరవించే పద్ధతి కూడా ఇది కాదు అని చెప్పువలసి ఉంది. మిగతా రంగాల వారి ముందు కవులను అక్షర సేద్యంచేసే సృజన శీలురు అందరినీ తక్కువ చేయడం గా భావించ వలసి ఉంది. ఎందుకంటే బాడ్ మింటన్ ఆడే కళాకారిణికి ఒక అంతర్జాతీయ స్థాయి ఆటలో గెలిస్తే 50 లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది ఈ ప్రభుత్వం. మరొక కబడీ కళాకారుడికి పాతిక లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది. ఇంతకుముందు కూడా క్రీడాకారులకు ఇంత మొత్తంగా బహుమతులను ప్రకటించడం ఇండ్ల స్థలాలను అందించడం చేస్తూ ఉంది ప్రభుత్వం. కేంద్రప్రభుత్వం జ్ఞానపీఠ పురస్కారం పొందినవారికి పాతిక లక్షల ఇస్తున్నారనే వార్త ఆనందం కలిగించేదే. కాని క్రికెట్ క్రీడలో గెలిచిన క్రీడాకారులకు కోట్ల రూపాయిలు ఇచ్చి విదేశీ కార్లు ఇచ్చి రాజధానిలో ఇళ్ళ స్థలాలిచ్చి ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఒక కవి ఒక రచయిత అత్యంత సృజనశీలుడై ప్రతిభావంతుడై జీవితాంతం చేసిన అక్షర శ్రమకు అత్యంత విలువైన అక్షర కళకు ఇచ్చే బహుమతి జ్ఞానపీఠ పురస్కారం అలాంటి వ్యక్తిని సాహిత్య స్రష్టను ప్రభుత్వాలు ప్రోత్సహించవలసింది ఇంతేనా. ఏం వాళ్ళు చేసే కృషి క్రీడాకారులు చేసే కృషికన్నా తక్కువా. నిజానికి క్రీడాకారులు సమాజనికి ఇచ్చేది ఎంత వారి వల్ల కలిగేది ప్రజలకు తాత్కాలిక మైన ఆనందం మాత్రమే. క్రీడాకారుల కృషి అప్పటికప్పుడే ముగిసి పోతుంది. కాని ఒక కవి చేసిన సాహిత్య కృషి తరాలు శతాబ్దాల పాటు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. పఠనానందాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకు 50 లక్షలు కోట్ల రూపాయిలు ఇచ్చే కేంద్ర రాష్ట్ర్రప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి సాహిత్య కారులను జ్ఞానపీఠ వంటి అత్యంత ఉన్నత పురస్కారాలు పొందిన వారిని క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు తగ్గకుండా అంతకు ఎక్కువగా ఇచ్చి గౌరవించాలి. అలా కాకుండే ఒక బాడ్ మింటన్ క్రిడాకారిణికి 50 లక్షలు ఇచ్చి ఒక క్రికెట్ క్రీడాకారుడికి కోటి రూపాయలు ఇచ్చి జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారికి పది లక్షలు ఇవ్వడం అనేది నిస్సందేహంగా సాహిత్యకారులను అవమానించడమే. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడా మేల్కొనాలి కవులకు సాహిత్యకారులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. కనీసం మన పొరుగు రాష్ట్రం కన్నడిగులు జ్ఞానపీఠ పురస్కారం పొందిన కువెంపు అనే కవికి ఎంత గౌరవం ఇచ్చిందో గ్రహించాలి. సుమారు పది కోట్ల విలువైన భవనాన్ని కట్టి అందులో ఆయన పేరిట సాహిత్య పరిశోధన కేంద్రం పెట్టారు. కోటి రూపాయిలతో ఆయన ఇంటిని నవీకరించారు. ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. తెలుగు జాతి కవులను సాహిత్యకారులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఇంకా ఎంత కాలం కావాలి. 
పులికొండ సుబ్బాచారి. 

Sunday, April 28, 2013

ఆచార్య పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
చరవాణి:          9440493604

ఆకలి అక్షరాల భరద్వాజ
పాకుడు దారిలోని ప్రతిభామూర్తికి జ్ఞానపీఠం

జ్ఞాన పీఠ పురస్కారానికి అర్హతలు అన్ని ఉండి దాన్ని పొందే క్రమంలో  నిలవడానికీ ముందుగా ఎన్నవలసిన వ్యక్తి భరద్వాజ. కాని భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం, తెలుగు సాహిత్య వర్గాలలో అందునా అవార్డులు ఎలా వస్తాయో తెలిసిన సాహిత్య వర్గాలలో మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈయన భరద్వాజ గోత్రీకుడా అని అడిగిన వారున్నారు. ఈ ఆశ్చర్యానికి కారణం లేకపోలేదు. భరద్వాజ సాహిత్యంలో తప్ప మిగతా ఎన్నో విషయాలలో బలహీనుడు. ఈయన విద్యార్హతలు లేనివాడు. ఏడో తరగతే చదివాడని పదేపదే చెప్పవలసిన అవసరంలేదు కాని విషయం ఏమంటే ఈయన విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఆచార్యుడు కాడు. ఆ పరిసరాల్లోకి రాడు. సాహిత్య వాతావరణాన్ని ఏలేది సాహిత్యవిమర్శనారంగంలో గజ్జకట్టి ఆడేది, తిమ్మిని బమ్మిని చేసేది బమ్మిని తిమ్మిని చేసేది, ఒక కవితార్భకుడిని మహాకవిని చేయగలిగేది, తమకు నచ్చని సామాజిక వర్గాలలో నుండి వచ్చిన మహాకవుల్నైనా మచ్చులోనికి లేకుండా చేయగలిగేది, విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండి ఆచార్యశ్రేణులలో ఉన్న కవిపుంగవులు కవితావిమర్శక కేసరులు రాజకీయ నాటక ధురంధరులు. ఏ అవార్డును ఎలా తెచ్చుకోవాలి ఎవరితో ఎలా మెలగాలి. ఏ గుంపులో ఉంటే సాహిత్య రంగంలో ఎలా పేరు వస్తుంది. ఏలినవారితో ఏరకాలుగా సహవాసాలు చేయాలి రాజకీయ ప్రాపకాన్ని ఎలా పెంచుకోవాలి. ఇలాంటి మెళకువలు లాబీయింగులు ఎన్నో  విద్యలు వస్తే కాని, ఈనాడు కవిగా కాని సాహిత్య కారుడుగా కాని రాణించడంకాని లేదా అవార్డులు తెచ్చుకోవడం కాని సాధ్యం కాదు. ఈ మాట తెలుగు సాహిత్యానికి ఒక్కదానికి మాత్రమే వర్తించేది కాదు. భారతీయ భాషల్లో ఉన్న అన్ని సాహిత్య వాతావరణాలకు వర్తించే మాట ఇది. జ్ఞాన పీఠ పురస్కారాలు పొందినవారందరూ నిస్సందేహంగా మహా సాహిత్య కారులే మహాకవులే అందులో సందేహం లేదు. కాని బంగారు పళ్ళెరానికి కూడా గోడచేర్పు అవసరం.
ఇక్కడ ఏ కవికి ఏ సాహిత్య కారుడుకి ఏ గోడ చేర్పు దొరుకుతుంది అన్నదే ప్రధాన విషయం. ఏ లాబీయింగ్ చేతకానివాడు, విశ్వవిద్యాలయాల వాతారణంలో లేనివాడు కులంబలం లేనివాడు, రాజకీయ బలం అసలే లేనివాడు అయిన భరద్వాజకు జ్ఞానపీరావడం సాహిత్య లోకంలో నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. పాకుడు పట్టిన రాళ్ళమీద ప్రయాణం చేస్తూ ఒక మెట్టు ఎక్కగానే జారుతూ జారూతూ ఉన్నా కిందికి పోకుండా తిరిగి ఇంకో మెట్టుపైకి పోతూ, తన విస్తరినిన తానే వేసుకొని అన్నింటిని ఒక్కొక్కటిగా సమకూర్చుకునే దశలో తను వడ్డించుకున్న దాన్ని ఎవడో వచ్చి తినిపోతుంటే కూడా చూస్తూ నడిచి, నడిచి, పరుగెత్తి ఈనాటికి జ్ఞానపీఠం అనే అత్యున్నత స్థానానికి రావడం భరద్వాజకు నిజంగా వైకుంఠపాళి ఆడడమే.
ఆశ్చర్య పోవడం అనే మాటకు మరిన్ని వత్తాసు మాటలు ఇక్కడ చెప్పుకుంటే భరద్వాజ విలువ జనానికి మరింత తెలుస్తుంది. ఇటీవలి కాలంలో కన్నడంలోఒక గొప్ప కవి రచయిత నాటకకారుడుకి జ్ఞాన పీఠ పురస్కారం వచ్చింది. రాష్ట్రప్రజలు చాలా సంతోషించారు. కానిఒక వర్గం మరొక కవికి రచయితకు రావలసిన జ్ఞాన పీఠాన్ని ఇతను తన్నుకుపోయాడు, అంతా రాజకీయం జరిగింది. రాజకీయ బలం అతనికి లేకపోయింది అందుకే అతనికి కాకుండా మరొకరికి ఇచ్చారు. ఇంత హీనంగా రాజకీయాలు చేస్తారా అని కన్నడ నాట చాలా దుమారం లేచింది. అయితే అక్కడ  అవార్డు వచ్చిన సాహిత్య కారుడు కూడా ఆ అర్హతకు ఏమాత్రం తీసిపోని వాడే. కాని ఆనాడు జరిగిన వివాదంలో చాలా చాలా సాహిత్యేతర విషయాలు తెలిసి వచ్చాయి అంటే ఏ వర్గం వారి మనిషికి అవార్డు కోసం ఎలా పనిచేస్తుంది అనే విషయాలు. తెలుగులో కూడా నెటిజన్లు కొంత మంది, ఏమిటీ అఘాయిత్యం ఫలనావారు వి.సిలుగా పనిచేశారు ఆయన ఫలానా వర్గానికి చెందుతాడు, అంతే కాదు ఫలానా విశ్వవిద్యాలయ ఆచార్యుడు కూడా వి.సిగా కూడా పనిచేశాడు బోలెడంత కవిత్వం రాశాడు జ్ఞానపీఠ కమిటీకి వీరు కనిపించలేదా అని మెటికలు విరచినవారు ఆడిపోసుకున్నవారు ఉన్నారు. ఇవేవీ తెలియకుండా నిరామయంగా ఉన్న భరద్వాజను చూస్తే ఎందుకు ఆశ్చర్యం కలగదు.
అలాగని భరద్వాజకు ఇంతకు ముందు పురస్కారాల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పడానికి వీలు లేదు. ఆయనకు చాలా అవార్డులు సాహిత్య అకాడమీ అవార్డులు కూడా వచ్చాయి. కాని అప్పుడు కూడా ఇంతే విధంగా ఆశ్చర్య పోయే ఘటనగానే ఎందరికో అనిపించింది. తెలుగులో ఏ లాబీయింగూ చేయకుండా పురస్కారాలు తెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించడం అనేది ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయం.
తెలుగు సాహిత్యానికి జ్ఞాన పీఠ పురస్కారం వచ్చి పాతికేళ్ళు దాటింది. 1970 విశ్వనాథ సత్యనారాయణగారు. తర్వాత 1988లో  సినారె పుచ్చుకున్న తర్వాత ఇంత కాలం వేచి చూడవలసి వచ్చింది. కాని మిగతా దక్షిణాది భాషలకు ఈ పరిస్థితి లేదు. కన్నడంలో ఎనిమిది సార్లు జ్ఞాన పీఠం వచ్చింది. మళయాళంలో అయిదు  సార్లు వచ్చింది. తమిళం వారికి మనలాగే రెండు సార్లు వచ్చింది. ఇలా ఎక్కువ సార్లు రావడానికి అక్కడి భాషల్లో మిగతా భాషల కన్నా ఎక్కవసాహిత్య సృజన జరిగిందని కాడు. అక్కడి ప్రభుత్వాలు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఇచ్చిన ప్రోత్సాహం కారణం. మాకు ఇంత గొప్ప కవి ఉన్నాడు అతనికి పురస్కారం రావాల్సిందే అని అక్కడి ప్రభుత్వాలు గొంతెత్తి మాట్లాడతాయి. తెలుగు వారికి ఇంత మక్కువ వీటిపట్ల లేదు. తెలుగు వారికి వచ్చిన పద్మశ్రీలు చాలా తమిళ సోదరులు సిఫారిష్ చేస్తే వచ్చినవని తెలిసి మనం సిగ్గుతో చచ్చి పోవాలి. కాని మనం ఈ విషయంలో హాయిగా బతికే ఉంటాం.
భరద్వాజ ప్రత్యేకతని చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. భరద్వాజ ప్రధానంగా రచయిత, కవి కాడు. ఆయనకు కథారచయితగాను నవలా రచయితగాను పేరుందే కాని కవిగా ఆయనను చెప్పుకోవడం లేదు. తెలుగులో రెండు పురస్కారాలు వచ్చింది కవిత్వానికే గాని వచనానికి కాదు. కన్నడంలో నవలా సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారంవచ్చింది. మళయాళంలో నవలా సాహిత్యానికి కథా సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. తమిళంలోను వచన సాహిత్యానికి పురస్కారం వచ్చింది. ఇప్పటిదాకా 53 మందికి జ్ఞానపీఠ పురస్కారాలు వస్తే ఎక్కుమందికి కవిత్వానికే వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువమందికి వచన రచయితలకు నాటకకారులకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. కాని తెలుగులో ఇద్దరికీ ఇప్పటిదాకా కవిత్వానికే పురస్కారం వచ్చింది. విశ్వనాథ కవిత్వంతో పాటు అతి విస్తృతమైన నవలా సాహిత్యం కూడా రాశాడు. కాని ఆ వచనాన్ని ఆధునిక వచనంగా అంగీకరించడానికి వీలు లేదు. అర్థగ్రాంథిక సంపూర్ణగ్రాంధిక భాషలలో ఉన్న ఈ నవలలు ఆధునిక వచనంగా అంగీకరించలేము. ఇక సినారెకి కూడా వచ్చింది కవిత్వానికే కాని సినారేని వచన రచయితగా మనం గుర్తించం. కాగా తెలుగు ఆధునిక వచనానికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తెచ్చిన ఘనత రావూరి భరద్వాజకే దక్కుతుంది. తెలుగులో మంచి ఆధునిక వచనసాహిత్యం కథాసాహిత్యం చాలా ఉంది. కాని మనకు వచ్చిన అకాడమీ పురస్కారాలు చాలా కవిత్వానికే వచ్చాయి. తెలుగు వచనానికి ఇంత గొప్ప కీర్తిని ఒక జాతీయ స్థాయిని అంతర్జాతీయ స్థాయిని తెచ్చిన ఘనత ఇలా భరద్వాజకు దక్కుతుంది.
మరొక విషయంలో కూడా భరద్వాజ ప్రత్యేకతని చెప్పడానికి వీలుంది. తెలుగులో నవలలు రాసివారున్నారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు వచ్చిన నవలలు కూడా ఉన్నాయి. కన్నడంలో, మళయాళం తమిళభాషలలో నవలలకు ఈ అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయి. కాని తెలుగులో నవలా సాహిత్యానికి జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారాన్ని తెచ్చిన ఘనత కూడా భరద్వాజదే.
జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఒక పుస్తకం పేరును చెప్పినా ఒక కవిగాని సాహిత్యకారునికి గాని ఈ పురస్కారం ఇచ్చే సందర్భంలో అతను చేసిన మొత్తం సాహిత్య కృషిని దృష్టిలో పెట్టుకునే ఈ అవార్డు ఇస్తారు. ఆ విధంగా చూచినా భరద్వాజ సాహిత్యం అత్యధికం వచన సాహిత్యం కావడాన్ని కూడా అందరూ గమనించాలి. తెలుగు ఆధునిక వచన సాహిత్యానికి శిఖరప్రాయమైన గౌరవాన్ని తెచ్చిన వ్యక్తిగా ఇలా భరద్వాజ చిరస్థాయిగా నిలుస్తున్నాడు.
భరద్వాజకు జ్ఞాన పీఠ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన జీవితాన్ని గురించి ఆయన రచనల పట్టికల గురించి ఇప్పటికే చాలా మంది చెప్పారు. వాటిని తిరిగి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. మరికొన్ని ప్రత్యేకతలని ఇక్కడ చెప్పాలి. మనకు తెలుగులో స్మృతి కావ్యాలు చాలా వచ్చాయి. సతీ వియోగంతో మిత్రవియోగంతో పుత్రవియోగంతో చాలామంది గొప్ప సాహిత్య కారులు స్మృతికావ్యాలు రాశారు. అవి అన్నీ కవిత ప్రక్రియలు కావడం గమనించాలి. కాని సతీ స్మృతిని వచనంగా రాసిన వ్యక్తి భరద్వాజ ఒక్కడే. ఈయన 1956 నుండి డైరీ రాశాడు. ఈయనను అత్యంతం ప్రేమించి ‍ఒక చిన్న బాలుడిగా పెంచిన ప్రేమ కురింపిన భార్య కాంతం జీవన గమనంలో మధ్యలోనే 1986 లో తనను విడిచి పోయింది. ఈ బాధ భరద్వాజ తట్టుకోలేక పోయాడు. ఈ గాయం నేటికీ మానలేదు. ఆగాయపు పులుపులనే అయిదు కావ్యాలుగా రచించాడు. భరద్వాజ నాలోని నీవు, ఒకింత వేకువ కోసం, అంతరంగిణి వంటి పేర్లతో ఆయిదు పుస్తకాలను సతీ స్మృతిలో వెలువరించాడు భరద్వాజ. నిజానికి ఆయన రాసిన వచనం పాకుడు రాళ్ళు నవలలో పొడి పొడిగా ఉంటంది. కాని అత్యంత మధురమైన వచనం చిక్కటి తియ్యటి తేటైన వచనం ఈ స్మతి కావ్యాలలనే  రాశాడు భరద్వాజ. కవితలో లాగా గుండెను తాకేలా చప్పున, గుప్పున గుండెను ఆవరించేలా వచనం రాయడం సులువు కాదు. చాలా కష్టం. కాని భరద్వాజ ఈ స్మృతి కావ్యాలను పట్టుకుంటే, ఒక్కొక్క శకలం ఇలా గుండెను పట్టుకుంటుంది. సతీ స్మృతి ఇంత గాఢంగా ఉంటుందా ఆ ప్రేమ ఇంత హృదయ దఘ్నంగా ఉంటుందా ఆ బాధ ఇంత తీవ్రంగా ఉంటుందా అని కదిలి పోతాం, కరిగి పోతాం. రెండు వాక్యాలు ఇక్కడ చూద్దాం. ప్రభూ ఈ శరీరం నాకు ఇరుకుగా ఉంది. ఈ పరిసరాలు నాకు అననుకూలంగా ఉన్నాయి. వీటిల్లోంచి నన్ను తప్పించు. నన్ను విముక్తం చేయి:… “ఆకాశం నిండా విషాదం ఆవరించింది. వాయు తరంగా లు వెక్కి వెక్కి పడుతున్నాయి. గిరిశిఖరాలనుండి శోకగీతికలు జాలు వారుతున్నాయి. ఉషస్సుందరి దుఃఖ తప్త హృదయంతో వివశయై పడిఉంది. తూరుపు తలుపులింకా మూతపడే ఉన్నాయి. నీ గురించి తలచుకొని....  భూదేవి శిరస్సున దోసిళ్ళకొద్దీ వెండి ముత్యాలు తలంబ్రాలు పోస్తున్నాడు చంద్రుడు. ఆ ముత్యాల మెరుపులన్నీ వెన్నెల గామారి జారిపోతున్నాయి. కొండలమీద బండలమీదా పురాలమీదా గోపురాల మీద, తోటల మీద బాటలమీదా మొగ్గలమీద చిన్నారి బుగ్గలమీదా, పూలమీద పచ్చని నేలమీదా చివరికి నామీద కూడా”…కాంతం స్మృతి ఇలా ఉంటుంది.
ఇలాంటి వచనం మనకు ఆయన పాకుడు రాళ్ళు నవలలో కనిపించదు. అక్కడ వచనం చాలా పొడిగా పొడిగా ఉంటుంది. అక్కడి వచనం ఒక వీడియో కెమేరా లాగా పనిచేస్తుంది. పాకుడు రాళ్ళు నవల చదవడం  అంటే ఒక సినిమాను చూసిన అనుభూతి పొంది పుస్తకం అనే థియేటర్ నుండి బయటికి రావడమే. కాని ఆయన స్మృతి కావ్యాలలోని వచనం పాఠకుడిని ఏవేవో తీరాలలోనికి ఏవేవో అంతరంగ ప్రపంచాలలోనికి ఏవేవో  ప్రేమ మహళ్ళలోనికి లాక్కుపోతుంది. ఆవచనం చదవడం ఒక విశేషమైన అనుభూతి.
భరద్వాజ సాహితీ ప్రస్థానం చాలా విస్తృతమైంది. మొత్తం 160 పుస్తకాలు రాస్తే ఇందులో నవలలు, కథా సంకలనాలు బాలలకు ఉద్దేశించిన కథా సంకలనాలు గల్పికలు వ్యాసాలు ఇలా చాలా చాలా రకాల వచన ప్రక్రియలున్నాయి. అయితే వీటన్నింటికన్నా విలక్షణమైన పుస్తకం మరొకటి ఉంది. అది జీవన సమరం. నగరంలో వీధిలోనికి పోయి తోపుడు బండ్ల దగ్గరనుండి ఫుట్ పాత్ పై చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరనుండి, రిక్షా తొక్కే వారి దగ్గరనుండి రకరకాల వృత్తులు చేస్తూ జీవన పోరాటం చేస్తున్న వ్యక్తుల వ్యథార్త జీవితాలను వారినుండే సేకరించి రాసిన పుస్తకం జీవన సమరం. తెలుగులో ఇలాంటిది లేదు. భరద్వాజ సాహిత్యం అంతా ఇంత విస్తృతంగా వైవిధ్యభరితంగా ఉంది. కథకుడుగా నవలా కారుడుగా చిరస్థాయిగా తెలుగులో నిలిచే సాహిత్య శిఖరం భరద్వాజ. కాగా ఆయనకు అజరామరమైన కీర్తినితేగలిగే నవలలు రెండు ఒకటి పాకుడు రాళ్ళు అయితే మరొకటి కాదంబరి. ఈ వ్యాసం ఉద్దేశం సాహిత్యం అంతటిని గురించి పరిచయం చేయడం కాదు. భరద్వాజ ప్రత్యేకతని గురించి నాలుగు ముక్కలు ఇలా చెప్పి అసలు పురస్కారాన్ని ప్రకటించిన నవల గురించి ఇక్కడ మరికొంత రాయడమే. మిగతా వాటిని గురించి మరొక సారి రాస్తాను.
భరద్వాజ తన 17 వ ఏటినుండే కథలు రాయడం మొదలేసాడు. అప్పట్లో చలం ప్రభావంతో కాస్తంత అశ్లీలం ధ్వనించే కథలు కూడా రాసాడని జనం దవళ్ళు నొక్కుకున్న మాట వాస్తవం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కునే క్రమంలో అన్నం కోసం యుద్ధం చేయవలసిన దారిలో భరద్వాజ తన జీవితాన్ని మద్రాసుకు మార్చుకున్నాడు. అక్కడే అతనికి సినిమాయాలోకంతో గాఢమైన పరిచయం ఏర్పడింది. ఇదే ఒక సుదీర్ఘమైన సీరియల్ రాయడానికి దారివేసింది. యాబైయవ దశకంలో కృష్ణాపత్రికలో మాయజలతారు పేరుతో ఒక సీరియల్ రాశాడు భరద్వాజ. ఆరోజుల్లో దాన్ని దగ్గరగా చూచిన మరొక సాహిత్య కారుడు సంపాదకవర్గంలోని వాడు శీలావీర్రాజు దీనికి పాకుడు రాళ్ళు అని పేరుపెట్టాడు. ఆపేరుతోనే నవలగా వచ్చింది. ఇది ఇప్పటికి ఆరు ముద్రణలు పొందింది. చివరి ముద్రణ 2008లో వచ్చింది. అయిదు వందల పుటల చాలా పెద్ద నవల పాకుడు రాళ్ళు. ఈ నవల 1960లో తొలి ముద్రణ పొందింది. అంటే యాబైఆరు సంవత్సరాల క్రితం సినిమా పరిశ్రమ ఎలాంటి స్థితిలో ఉందో అత్యంత ప్రతిభావంతంగా కళ్ళకు కట్టినట్టు చూపిన నవలగా ఇది నిలబడింది. రాసిన 56 సంవత్సరాల తర్వాత ఈ నవలకు అత్యంత ఉన్నత పురస్కారం లభించడం ఇక్కడి మరొక విశేషం. ఈనాటికీ వస్తు రీత్యా ఇది నేటి సినీ ప్రపంచానికి కూడా చాలా వరకు వర్తించేలా ఉండండం దీని మరొక ప్రత్యేకత.
నవలా రచనలో దాని నిర్మాణంలో ఒక కొత్త పుంత తొక్కాడు భరద్వాజ ఆనాటికి ఆధునిక నవలా సాహిత్యం ఇంత స్థాయికి రాలేదు. ఒక వ్యక్తి జీవితాన్ని కాకుండా ఒక విస్తృతమైన ప్రపంచాన్ని మన కళ్ళముందుంచాడు రచయిత. నవలలో ప్రధాన పాత్ర మంజరి అనబడే మంగమ్మ. ఆమె నాటకాలలో స్త్రీపాత్రలు నటించే స్థితినుండి సినిమా ప్రపంచానికి పరిచయమై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ఉన్నత స్థాయి కథానాయికగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందింది. కాని జీవితంలో నోట్లకట్టలనే హంసతూలికా తల్పంగా చేసుకోగలిగే స్థితిలో కూడా మనశ్శాంతి లేక నిజమైన ప్రేమను పంచే వారు లేక ఎందరో చేసే మానసిక హింసకు గురవుతూ ఆ క్రమంలోనే దీనంగా తనను తాను అంతం చేసుకున్న వ్యక్తిగా మంజరి పాత్రను తీర్చి దిద్దిన తీరు ఒక వాస్తవానికి పట్టిన అద్దం.
నవలా రచనా శిల్పం విషయానికి వస్తే ఆనాటికి అదొక నవ్యమార్గం. కథలోని ఒక పాత్ర మాధవరావు కథను చెప్పడంతో ప్రారంభమై కొద్ది దూరం పోగానే అతను ఆపిన తర్వాత ఉత్తమ పురుష కథనాన్ని వీడి రచయిత చేసే ప్రథమ పురుష వర్ణనలోనికి వచ్చి, తిరిగి నవల అంతంలో మాధవరావు చేసే కథనంలోనికి ప్రయాణించడం నవలలోని నిర్మాణ వైవిధ్యం.
నవలలోని వచన రచన అబ్బుర పరిచేలా ఉంటుంది. ప్రతి పాత్ర సజీవంగా దానికి వచ్చిన భాషలో అది మాట్లాడుతుంది. పాత్ర చిత్రణకాని సంభాషణ కాని వర్ణన కాని అత్యంత సహజంగా కదిలే జీవన గమనాన్ని ఒక వీడియో తీసి చూపించే పద్ధతిలో కొనసాగింపజేయడం ఇక్కడి విశేషం పుస్తకం మొదలు పెట్టిన దగ్గర నుండి చివరి వరకు పుస్తకం చదువుతున్న అనుభూతి కాక ఒక సామాజిక ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా చూచి బయటికి వచ్చిన అనుభూతి కలిగించడం దీని ప్రత్యేకత. ఇక్కడి ఉద్దేశం నవలను ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సమీక్ష చేయడం కాదు. భరద్వాజకున్న సామాజిక చింతనను గురించి చెప్పడమే. ఈ నవల అంతా ఆర్త జీవుల గురించి రాసిన ఉదంతమే. నాటకాలు ఆడే స్త్రీలు సినిమాలలో వేషాలకోసం ప్రయత్నించే స్త్రీలు తమ శరీరాలను ఎలా పెట్టుబడిగా పెట్టుకోవాలి అత్యంత దీనంగా బతకాలో వివరించే నవలగా దీన్ని చూస్తే భరద్వాజ సామాజిక చింతన మనకు తెలుస్తుంది. ఇందులో మంజరి అనబడే మంగమ్మ, మంజరి మాత్రమే కాదు, ఆమె గమనంలో వచ్చిన వసంత, రాజ్యం, కల్యాణి (కన్నమ్మ), మంగతాయారు (సినిమా నాయిక కావాలని వచ్చి చివరికి పనిమనిషిగా మిగిలిన వ్యక్తి), విజయ ఈ వ్యక్తులు అందరూ తొలుత ఆహారం కోసం, బ్రతకడం కోసం ఎలా ఒళ్ళు అమ్ముకోవలసి వచ్చింది. మజరి నాయికగా ఎదిగే క్రమంలో అవసరాలకు ఎందరికి తన శరీరాన్ని విందు చేసింది. అత్యంత జుగుప్సావహంగా ఉండే జీవితాన్ని దైనందిన క్రమంలో చూపిన ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఇందులో పాత్రలేవీ మూసపోసినట్లుండవు. సినిమాకు ఫైనాన్స్ చేసే వ్యక్తులు మొదలియార్ వంటి వారు కాని, పాత్రలు ఇప్పిస్తామని తిరేగే బ్రోకర్లు కాని చలపతి వంటి కింగ్ మేకర్లు కాని శర్మ వంటి సినీమా పత్రికా రచయితలు కాని రాజన్ వంటి పారిశ్రామిక వేత్తలు కాని స్త్రీ శరీరాన్ని ఎలా వాడుకుంటారు అని చెప్పడమే కాదు, స్త్రీ తన శరీరాన్ని తను వెళ్ళే ఉన్నత మార్గంలో తనను తాను అర్పించుకునే ఒక వ్యాపార వస్తువుగా ఎలా మలచుకుంటుంది ఇందులో చెప్పిన తీరు సినీ ప్రపంచంలో స్త్రీల హైన్యస్థితిని బట్టబయలు చేస్తుంది. మంజరికి ఉన్న లౌక్యం ఒక ఎత్తైతే మగవాడి బలహీనత ఆడదాని శరీరాన్ని పొందడంలోనే ఉంది అని తెలుసుకున్న మంజరి తాను ఎదిగే క్రమంలో ఎంతటి సంపన్నుడినైనా ఎంతటి మగధీరుడినైనా చివరికి ఋషిని అనుకునే వాడినైనా తన పదునైన మాటలతో హావభావాలతో పడవేసి తను కసిగా మగవాడిని కాలికింద తొక్కుకున్న వైనం, ఒక స్త్రీ తన ఆడతనంతో పురుష ప్రపంచాన్ని జయించిన పద్ధతిలో ఆమెను చిత్రీకరించడం భరద్వాజ చూపిన నైపుణ్యం. మంజరి పురుషులతో వ్యవహరించే సందర్భాలను భరద్వాజ వర్ణించే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాక్యాలను సగంలోనే ముగిస్తాడు. అంటే కొద్దిగా చెబుతాడు. మిగతాది పాఠకుడికి అక్కడ ఏం జరిగిందే ఇట్టే అర్థమై పోతుంది. కవిత్వంలో ధ్వని ద్వారా భావాలను వ్యక్తం చేయడం వేరు. కాని వచనంలో అదీ నవలలో ధ్వనిని అధ్యాహారాన్ని ప్రయోగించి జుగుప్సాకరమైన శృంగారాన్ని పైకి ఏమీ తెలియకుండా అత్యంత సుదంరంగా రాయడం ఇతని శైలిలో పరాకాష్ట. పులిలా దూకి దీన్ని చంపుతాను దీన్ని అష్టకష్టాలు పెడతాను అని బీరాలు పలికిన హీరోలను, ఫైనాన్షియర్లను, నిర్మాతలను దర్శకులను, పారిశ్రామిక వేత్తలను మంజరి పిల్లిలా చేసి బొమ్మల్లా ఆడిస్తుంది. స్త్రీ తలచుకుంటే తన శరీరాన్ని తనకున్న శృంగార శక్తిని పదునైన  ఖడ్గంగా దూస్తే ఏం జరుగుతుందో చెప్పిన తీరు ఇలా మరొక నవలలో కనిపించదు.  అంతే కాదు ఇంతటి జాణ అయిన మంజరిలో ఎంతో ఉన్నతమైన మానవతా మూర్తిని చూపుతాడు భరద్వాజ. మంజరి తాను తన పరిశ్రమలో తన శరీరాన్ని పెట్టుబడిగా చేసి అందరి ముందు పరిచానని తెలుసు కాని తనలాగా అతి కింది స్థాయిలో జీవన పోరాటంలో నాటకాలలో ఉండి కాని సినిమాలలో చేరాలని కాని ఆ క్రమంలో ఒళ్ళు అమ్మకుని బ్రతికే మరికొందరికి అండగా నిలబడుతుంది. వాళ్ళ వేదనను పంచుకుంటుంది. వారిని పరిశ్రమలో పైకి తేవాలనుకోవడమే కాదు వారికి డబ్బుతో సహా అన్ని విధాలా తోడుపడుతుంది. ఈ విషయంలో బ్రోకర్లు తన చుట్టుతిరిగే చలపతి వంటి వ్యక్తులు ఏమి చెప్పినా వినదు. వారికి అండగా నిలవడం మానదు. ఇలా పాకుడు రాళ్ళ నవలలో వర్ణించింది నిజంగా మాయజలతారునే. ఈ మాయలో నలిగి మసై పోయేది కింది వర్గం వారు, స్త్రీలే. శ్రీశ్రీ కన్యాశుల్కం నాటకాన్ని భీభత్సప్రధానమైంది అని చెప్పాడు.  కాని పాకుడు రాళ్ళు నవల బాగా లోతుగా ఆలోచించి చూస్తే దాన్నిఅనుభవించి చదివితే ఇందులో స్త్రీ జీవితం ఎంత భీభత్సంగా ఉంటుందో తెలుస్తుంది. దీన్ని భీభత్స రస ప్రధానమైన నవల అనాలి. ముగించిన తర్వాత కలిగే అనుభూతి అత్యం భీభత్స దృశ్యాలను చూచి మనసు కలచివేసిన స్థితి కలుగుతుంది.
యాబై ఆరు సంవత్సరాల క్రితం సినిమా ప్రపంచం ఎలా ఉందో అందులో స్త్రీలు ఎలా ఉన్నారో చూచి నేటి సినిమా ప్రపంచాన్ని చూస్తే ఎన్నో మార్పులకు గురై సాంకేతిక పరిణామాలలో ఎదిగినా కూడా సినిమా ప్రపంలో అధో జగత్ నేటికీ అలాగే ఉండడాన్ని చూచినప్పుడు స్త్రీలు కనీసం ఒక స్థాయి వారైనా అత్యంత దీన స్థితిలో ఉండే పరిస్థితిని గమనించి నప్పుడు భరద్వాజ దర్శించజేసిన వర్ణించిన సాహిత్య శక్తి మనకు అవగతం అవుతుంది. భరద్వాజ అధోజగత్ సోదరుల పక్కన అత్యంత భయానక వేదనా భరితమైన జీవితాన్ని సాగించిన స్త్రీల పట్ల నిలిచిన తీరు తెలుస్తుంది. ఆయన నిజజీవితంలో అత్యంత దీన స్థితిలో పొట్టకోసం చేసిన పోరాటాలలో పొందిన అనుభవం ఇలా అధోజగత్ ప్రపంచం కోసం రక్తాన్ని అక్షరాలుగా చేయడానికి భూమికగా నిలిచింది. 
భరద్వాజ తొలిరోజుల్లో కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు అంతే కాదు తర్వాత కూడా తాను వివిధ వ్యక్తులతో కూడిన కమ్యూనిస్టు సంస్థలకు దూరంగా ఉన్నా తాను కష్టజీవుల పక్కన దీనహీన స్థితిలోని స్త్రీల పక్కన నిలిచాడు వాళ్ళకోసం ఆరాటపడ్డాడు వాళ్ళకోసం అక్షరాన్ని అమ్ముల పొదిగా చేశాడు. విద్యకు విద్యాలయాలకు దూరంగా ఉండడం వల్ల తనను తాను అన్ లెర్న్ చేసుకోగలగడం వల్ల తనను తాను అపండితీకరించుకోవడం వల్ల ఇది సాధించగలిగాడు భరద్వాజ. కళ్ళముందే పోయిన ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, చేయి విడిచి ముందే స్వర్గానికి పోయిన సహధర్మచారిణి మానని పచ్చి గాయాలుగా ఆయన ఒంటి మీద కాదు గుండె మీద మిగిలారు. సరిగ్గా ఠాగూర్ కి కూడా అత్మీయులుచేసిన గాయాలు ఒంటినిండా ఉన్నాయి. కాని భరద్వాజ గాయాలు ఆయన అక్షరాలు అన్నింటిలో పరుచుకున్నాయి. ఆ గాయాలతో పుష్పించిన మందార చెట్టుకే నేడు జ్ఞానపీఠం వరించింది. అది తనను తాను అలంకరించుకుంది. తెలుగు వచనానికి ఇది వజ్రకిరీటం. దొరికిన చిరయశస్సు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

Saturday, April 27, 2013

my article on annmayya song


పులికొండ సుబ్బాచారి

అన్నమయ్య పాట మాధ్యమం, నిర్మాణం
పాట అనే సంగీత సాహిత్య  ప్రక్రియ భాష సంస్థితి పొందుతున్న పొందిన అతి ప్రాచీన కాలంలోనే రూపొంది అతి పాతదైన మానవనిర్మిత కళారూపం, సాహిత్య రూపం. అప్పటికి సాహిత్యం లిఖితం మౌఖికం అనే వింగడింపు పొందలేదు. కారణం అప్పటికి ఉన్నది మనిషి నోటిద్వారానే సాహిత్యం మొత్తాన్ని సృష్టించుకునే విధం మాత్రమే. దానికి కొన్ని లేఖన చిహ్నాలను ఏర్పరచుకొని రాయడం నేర్చుకొని తన సాహిత్యానికి చూడడానికి వీలైన ఒక దృశ్యాత్మక స్థిరరూపాన్ని  ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే లిపి.  అందుకే లేఖనం లేదా రాయడం అనేది ఆతర్వాత చాలా కాలానికి జరిగిన సాంకేతిక విధానం సాహిత్యానికి ఒక సహాయం మాత్రమే. సాహిత్యం అన్నది అందునా పాట అన్నది ఒక మానవ అంతః సృజనం ఒక బౌద్ధిక, హార్దిక చర్య దానికి బాహ్య స్వరూపమే లిపి అంటే సాహిత్యానికి ఏర్పడిన లేఖన రూపం.  ఇక్కడే ఒక చారిత్రక సత్యాన్ని ప్రస్తావించాలి. మానవుడు బాగా బుద్ధిజీవుడై మాట్లాడ గలిగిన దశ ఏర్పడి 30,000 ముప్పై వేలనుండి 50,000 ఏభై వేల సంవత్సరాల నాడు అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మనిషినే హోమోసాపియన్ అని అంటారు.  కాని మనిషి లిపిని సృష్టించుకొని దాన్ని సాహిత్య లేఖనానికి వినియోగించుకోవడం ప్రారంభించింది కేవలం 6,000 ఆరు వేల సంవత్సరాల క్రితమే అని కూడా వివిధ చారిత్రక అధ్యయనాలలో తెలిసింది.[1] అలా పాట లిపికన్నా చాలా ప్రాచీనమైనది.  అంటే మౌలికంగా నోటి సాహిత్యానికి చెందింది నోటినుండి నోటికి జారుతూ ప్రవహించే పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ.
 అన్నమయ్య జీవించి సాహిత్యాన్ని సృష్టించిన కాలం 1408 నుండి 1503 మధ్య అంటే దాదాపు పదిహేనో శతాబ్ది మొత్తం ఉన్నాడు.     కాలానికి సాహిత్యం లిఖిత రూపంలో కూడా బాగా స్థిరపడింది. పరివర్థితమైన ఛందస్సులు ఏర్పడడం వాటిలో ప్రౌఢమైన కావ్యాలు వెలయడం చాలా కాలం క్రితమే జరిగింది. అయినా అన్నమయ్య కాలానికి లిఖితంగా ఉండే సాహిత్యం తాళపత్రాలకు, శాసనాలకు రాగిరేకులకు పరిమితం అయింది. ఆధునిక కాలాన వచ్చిన కాగితం కాని సాహిత్యాన్ని సామాన్య మానవులు అందరికీ చేరేలా చేయగలిగే ఇతర సాంకేతిక మాధ్యమం కాని లేదు. సామాన్య మానవుల వరకు చేరగలిగే సాహిత్యం అప్పటికీ మౌఖిక సాహిత్య రూపం మాత్రమే అంటే అందరికీ చేరగలిగేది మౌఖికంగా ఉన్న పాట, ప్రదర్శనకు వీలయిన నాటకం, నోటినుండి నోటికి చేరగలిగిన కథ మాత్రమే. ఉన్నత విద్యావంతులైన కవులు పండితులకు అందుబాటులో ఉండే తాళపత్రాల పైన రాయడం లేదా రాగిరేకుల మీద రాయడం వాటిని వాడుకొని చదవడం  అనేది అప్పటికి బాగా ఉన్నత వర్గాలకు అతి చిన్న సంఖ్యలో ఉన్న విద్యావంతులైన శ్రేణికి మాత్రమే అందుబాటులో ఉండే సాంకేతిక సౌకర్యం. స్థితిలో అన్నమయ్య తను నమ్మిన దైవాన్ని గురించి వైష్ణవ మతాన్ని గురించి జనసామాన్యంలో జనబాహుళ్యంలో బాగా విస్తృతంగా ప్రచారం చేయడానికి తలపెట్టాడు. అందుకు బాగా వినియోగపడుతుంది అని ఆయన భావించిన మాధ్యమం పాట. పాటే జనానికి బాగా చేరగలిగిన మంచి మాధ్యమంగా మంచి ఆయుధంగా గ్రహించి అత్యంత ప్రతిభావంతంగా దాన్ని వాడుకొని తన భావాల్ని జనం దగ్గరికి చేర్చగలిగాడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
అన్నమయ్య పండిత కుటుంబంలో విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రితాతలు సంప్రదాయ సాహిత్యానికి లేఖన సాహిత్య సంప్రదాయానికి చెందిన వారే, వేద పండితులే. ఆనాటికి బాగా విస్తృతంగా ఆమోదించిన ప్రక్రియ కులీన వర్గంలో బాగా విస్తృతంగా ఉన్న ప్రక్రియ ఉన్నత వర్గానికి చెందిన ప్రక్రియ కావ్యం లేదా ప్రబంధం. ఇవి చంపూ సాహిత్య మార్గాలు. అంటే సంస్కృత ఛందస్సులతో నిండిన పూర్తిగా లిఖిత సాహిత్యానికి చెందే స్థిరపాఠ్యప్రక్రియ[2] అయిన కావ్యం  ఆనాడు ఉన్నత వర్గం మధ్య తిరుగాడే సాహిత్య ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఇతర దేశ భాషలలో బాగా నిష్ణాతుడైన అన్నమయ్య ఉన్నత వర్గానికి పరిమితం అయ్యే కావ్య ప్రబంధ ప్రక్రియలను కాని లిఖిత మాధ్యమానికి చెందిన నాటక ప్రక్రియను కాని గ్రహించకుండా పాటను ఎన్నుకొనడం, ఆయన సంస్కృతంలో కాని గ్రాంథికమైన క్లిష్టమైన ప్రౌఢమైన తెలుగు భాషలో ప్రబంధాలను కానీ రాయడం చేతగాక కాదు. తన లక్ష్యాన్ని చేరడానికి అవి పనికిరావని జనాన్ని చేరడానికి వినియోగపడవని గ్రహించడం వల్లనే. పాటే తన వైష్ణవ భక్తి ప్రచారానికి తగిన మాధ్యమం అని నిర్ణయించుకున్న తర్వాతనే పాటలోనే తన భావాలన్నింటిని రచించాడు. అంటే జనం మధ్య పాడుకున్నాడు. అందరూ పాడడానికి దోహదపడ్డాడు. తాళ్ళపాక చిన్నతిరుమలాచార్యుడు అంటే ఆయన మనుమడు అన్నమయ్య విగ్రహాన్ని తొలుతగా చేయించాడు.[3] విగ్రహాన్ని చూస్తే అందులో అన్నమయ్య చేతికి దండె మాత్రమే కాకుండా ఆయన కాళ్ళకు గజ్జెలు కూడా కనిపిస్తాయి. అంటే దీనితో తెలిసేదేమంటే దండెను మీటుతూ దానితో తన పాటకు శృతిని మేళవించుకొని పాటకు అనుగుణంగా నాట్యం చేస్తూ జనం మధ్య ఆటతో పాటను కలిపి ప్రదర్శించాడని తెలుస్తూ ఉంది.[4]
జనం మధ్యలో జన సాహిత్యంగా ఉన్న పాటను తన మాధ్యమంగా గ్రహించాడు అన్నమయ్య. దీని ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని కూడా సృష్టించాడు. పాట కొత్త ఒరవడి కాదు. అంతే కాదు దేశి సాహిత్య ప్రక్రియలను వాడుకోవడం కూడా కొత్త ఒరవడి కాదు. కాని తన జీవితంలో మొత్తం సాగించిన సాహిత్య యాత్రలో పాటనే ప్రధాన సాహిత్య ప్రక్రియగా ఎన్నుకోవడమే అప్పటికి చాలా విశేషం.  జానపద సాహిత్యంలో లభించే కథలను వాడుకోవడం జనానికి బాగా దగ్గరికి వెళ్లగలిగే పాటకు బాగా దగ్గరిగా ఉండి పాడుకోవడానికి అనువుగా ఉండే ద్విపద ఛందాన్ని వాడుకోవడం అన్నది పదమూడో శతాబ్ది నాటికే పాలుకురికి సోమనాథుడు వంటి శివకవులు చేశారు. నిజానికి తాళ్ళపాక కవులు పెదతిరుమలాచార్యుడు, చినతిరుమలా చార్యులు తిరువెంగళనాథుడు, క్రమంలోని  అందరూ ద్విపద ఛందంలో రచనలు చేశారు. ఆనాటి వారే అయిన వెంగమాంబ వంటి ఇతర కవులుకూడా ద్విపద ఛందాన్ని వాహికగా చేసుకున్నారు. అయినా తాళ్ళపాక కవులు బాగా ఆధారపడిన సాహిత్య వాహిక, ప్రక్రియ పాటే. దీన్ని పదం అని వారు అన్నా, లేదా సంకీర్తన అని అన్నా అది మౌలికంగా, మౌఖికంగా వ్యాప్తిలోనికి వచ్చిన పాటే.
దృష్ట్యా చూచినప్పుడు జానపద సాహిత్యంగా ఉన్న అంటే మౌఖిక సాహిత్య రూపంలో ఉన్న పాటను తీసుకొని జానపద ప్రక్రియను వినియోగించుకొని వైష్ణవ మత సిద్ధాంతాన్ని, వేంకటాద్రీశుని పైని భక్తిని ప్రచారాన్ని చేయడానికి పూనుకున్నాడు అన్నమయ్య. ఇలా జానపద గేయాన్ని అంటే జానపద సాహిత్యాన్ని మరొక లక్ష్యం కోసం వాడుకొని తొలినాటి అనువర్తిత జానపద సాహిత్యాన్ని (Applied folk literature) ని సృష్టించిన వాడుగా అన్నమయ్య నిలబడుతున్నాడు. అన్నమయ్య పాటను తనదైన పద్ధతిలో రాయడమే కాదు అంటే పాడడమే కాదు. తన కాలానికి బాగా వ్యాప్తిలో  ఉన్న జానపద ఫణితులను అంటే పాటల వరుసలు చందమామా, జాజర, ఓలచ్చ గుమ్మడి వంటి వారాను వర్తానాలున్న ప్రత్యక్ష జానపద బాణీలను కూడా గ్రహించి పాటలు కట్టాడు. కాబట్టి తొలి నాటి అనువర్తిత జానపద గేయాలుగా అంటే అప్లైడ్ ఫోక్ సాంగ్స్ గా అన్నమయ్య పాటల్ని చెప్పాలి.[5] అంతే కాదు ఆయన తన పాట పాడుకోవడానికే అని భావించాడు. తను పాడిన పాటలు మరింత నమ్మకంగా వచ్చే తరాలకు చేరాలనే ఉద్దేశంతో పాటల్ని రాగి రేకుల మీద పాఠ్యాన్ని స్థిరంగా ఉంచాలనే ఆలోచన చేసి పని ప్రారంభించింది అన్నమయ్య అయినా, ఆయన పాటల్ని అన్నింటిని అంటే 32 వేల సంకీర్తనల్ని రాగిరేకులమీద చెక్కించింది ఆయన కుమారులు మనుమలు. సాళువ నరసింహరాయల వెన్నుదన్ను ద్వారా తర్వాతి ఏలికల ద్వారా వారు పని చేయించారు. అయినా అన్నమయ్య పాటలు తాళపత్ర రూపంలో ఉండి చదువుకోవడానికి అంటే పాఠకులకు ఉద్దేశించి సృష్టించినవి కావు. అవి పాడుకోవడానికి చేసిన నోటి సాహిత్య రూపాలు పాడుకునే పాటలే. అలా అన్నమయ్య మౌలికంగా నోటి సాహిత్య ప్రక్రియకు లేదా మౌఖిక సాహిత్య ప్రక్రియకు చెందిన కవి.   అన్నమయ్య సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం. ఒక లిఖిత సాహిత్య సంప్రదాయానికి చెందిన వాడు కులీన వర్గానికి చెందినవాడు పండితుడు అయి ఉండి మౌఖిక సాహిత్య మాధ్యమాన్ని ఎన్నుకుని జీవితాంతం పాడుతూ జీవితాన్ని పాటలా గడిపిన సాహిత్యకారుడు అన్నమయ్య. అతని పాట, సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం.
అన్నమయ్య ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానాన్ని పొందాడు. దీనికి కారణాలు ముఖ్యమైన వాటిని ఇక్కడ చెప్పాలి. ఆయన తన పదహారో ఏటనే పదాలు కట్టడం అంటే పాటలు కట్టి పాడడం మొదలు పెట్టానని స్పష్టంగా చెప్పాడు. దీనికి గట్టి చారిత్రక ఆధారాన్ని ఆయనే ఇచ్చాడు. రాగిరేకు మీద ఆయన స్వయంగా రాయించిన విషయం ఇక్కడ ఉంది. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు 1346 (1424) అగు నేఁటి క్రోధి సంవత్సరమందు, తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించి పదహారు యేండ్లకు తిరువేంగళనాథుండు (వేంకటేశ్వరస్వామి) ప్రత్యకక్షమైతేను, అది మొదలుగాను శాలివాహన శకవరుషంబులు 1426  అగు నేటి దుందుభి సంవత్సర పాల్గుణ . 12 నిరుధానకు తిరువేంగళనాథుని మీదను అంకితముగాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన అధ్యాత్మ సంకీర్తనలు  అని రాగి రేకు ఆరంభంలో స్పష్టంగా ఉంది.[6] అన్నమాచార్యులు క్రీ.. మేనెల 9 తేదీ 1408లో పుట్టి ఫిబ్రవరి 23, 1503లో పరమపదం చెందినట్లు చెప్పడానికి తిరుగులేని చారిత్రక ఆధారాలున్నాయి. పైన చెప్పిన రాగిరేకే ఇందుకు బలమైన సాక్ష్యం. ఆయన 95 సంవత్సరాలు జీవించాడు. అంటే పదహారవ యేట సంకీర్తనలు అంటే పాటలు కట్టడం ప్రారంభించిన అన్నమయ్య మరణించిన దాకా అంటే దాదాపు ఎనభై సంవత్సరాల పాటు పాటలు నిర్విరామంగా రాసాడు. అంటే 29,200 రోజులు పాటలు రాసాడు. ఆయన 36 వేల సంకీర్తను రాసినట్లు కూడా తిరుగు లేని చారిత్రక ఆధారాలున్నాయి. కాని మనకి ఇప్పటికి దొరికినవి 12 వేలు మాత్రమే. అన్నమయ్య పాట ఒక దానిలో ఒక పల్లవి మూడు చరణాలు ఉంటాయి. పల్లవికి రెండు పంక్తులు చరణానికి నాలుగు పంక్తులు ఉంటాయి. అంటే మొత్తం 14 పంక్తులలో పాట పూర్తి అవుతుంది. కొన్ని పాటలు తక్కువ పంక్తులతో ఉన్నా మరికొన్ని ఎక్కువ గా ఉన్నా దాదాపు 95 శాతం పాటలు 14 పంక్తులతోనే ఉన్నాయి.
దీన్ని బట్టి అన్నమయ్య సృష్టించిన సంకీర్తనలు లేదా పాటలు 32 వేలలో మొత్తం 4,48,000 వేలు అక్షరాలా నాలుగు లక్షలా నలబై ఎనిమిది వేల పంక్తులు రచించాడు. ఒక కవి ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించడం మరెక్కడా జరిగినట్లు సమాచారం లేదు. ప్రపంచంలోనే మొదటిది క్రీ.పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినదిగా భావించడబడే ఇలియడ్ అనే హోమర్ కవి కృతిగా చెప్పే ఇతిహాసంలో ఉన్నది 15,693 పంక్తులు మాత్రమే. ఇక భారతీయ ప్రాచీన ఇతిహాసం మహాభారతం జయ అనే 25,000 శ్లోకాల స్థితినుండి అది మహాభారతం అనే లక్ష శ్లోకాల విస్తృతి చెందింది. అంటే రెండు లక్షల పంక్తుల పరిమాణంలో మాత్రమే ఉంది. సంప్రదాయికంగా మహాభారతం వ్యాసకృతం అనిచెప్పినా ఎందరో అజ్ఞాత వ్యక్తులు 25 వేలనుండి లక్ష శ్లోకాలకు పెరిగే క్రమంలో కవులుగా దానిలో భాగస్వామ్యం పంచుకున్నారు. భారత దేశంలో 2,00,000 పంక్తులు విస్తృతి ఉన్న సాహిత్యం మరొకటి లేదు. కాని అన్నమయ్య ఒకే వ్యక్తిగా ఉండి 4,48, 000 పంక్తుల సాహిత్యాన్ని సృష్టించాడు. అంతే కాదు ఇందులో కూడా కొన్ని పాటలే చాలా బాగుంటాయి మరికొన్ని పాటలు తాలుగా పోతాయి అని చెప్పడానికి వీలు లేదు. ప్రతి పాటా ఆణిముత్యం అనదగిన పాటే. మరొక ప్రత్యేకత ఏమంటే ఒకే వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఇంత విస్తృతి  కలిగిన మౌఖిక సాహిత్యాన్ని సృష్టించిన వాడు కూడా మరొకరు లేరని ఇక్కడ గట్టిగా చెప్పవచ్చు. అన్నమయ్య సాహిత్యం మౌఖిక మాధ్యమ సాహిత్యం నేడు మౌఖిక మాధ్యమంలో లేదు. కాని ఆయన పాట రాయలేదు. పాడాడు. పాడడం కోసమే పాట కట్టాడు. దాన్ని లిఖిత మాధ్యమంలోనికి మార్చింది తర్వాతి పని అది అతను కాని అతని కొడుకులు మనుమళ్లు కాని చేసి ఉండవచ్చు. కాని అతనికి అవి పాటలే. మౌఖిక మాధ్యమ సాహిత్యం కర్తగా విస్తృతిలోగాని ప్రతిభాప్రకృతిలో గాని అన్నమయ్యకు సాటి మరొకరు నాస్తి నాస్తి నాస్తి అని చెప్పవలసి ఉంది. ఇది ఆయన సాహిత్య మాధ్యమం గురించి ఇక ఆయన పాట నిర్మాణాన్ని చూద్దాం.
పాట అన్నది ఒక బహుళ ప్రక్రియా రూపం అది సంగీతానికి సాహిత్యానికీ ఒకే సారి చెందుతుంది. అంటే సంగీతరచన సాహిత్య రచన ఒకే సారి సద్యఃస్ఫూర్తితో జరుగుతాయి. మౌఖిక మాధ్యమంలోనే సృజనం జరుగుతుంది. అంటే నోటి కళగా అది అప్పటికప్పుడు పుడుతుంది.  పాట పాడే లయకు రాగానికి అనుగుణంగానే పాటలోని మాటల కూర్పు అంటే సాహిత్య సృజనం అప్పటికప్పుడు జరుగుతుంది. అంతే కాదు పాడుతూ నాట్యం  చేసే వ్యక్తికి నాట్యంలోని లయకు కూడా అనుగుణంగా పాట సంగీతం ఉంటుంది. అంటే పాట అనేది మూడు కళల సమాహార కళ. ఒకటి సంగీతం, రెండు సాహిత్యం, మూడు నాట్యం. పాట సంస్థితి అన్ని సందర్భాలలో మూడింటిలో ఉండకపోయినా పాట అనేది సంగీతం సాహిత్యం అనే రెండు కళల సమాహారంగా ఎప్పుడూ ఉంటుంది. లిఖిత రూపంలో పుస్తకంలో అచ్చువేసిన పాటలో కూడా పాఠ్యంలో అంతర్గతంగా సంగీతానికి సంబంధించిన నిర్మాణం ఉంటుంది. పాట సృష్టించే వ్యక్తి జానపదుడు కాకుండా అప్పటికప్పుడు పాటను పాడుకునే వాడు కాకుండా ఉన్నా సరే చివరికి అతను సినిమా పాట రచయిత అయినా సరే దాన్ని పాడ బోయే సంగీత బాణీని తెలుసుకుని సంగీత దర్శకునితో కలిసి కూర్చొని పాటను దానికి అనుగుణంగా పదాల పాదాల కూర్పు చేసి రచించవలసి ఉంటుంది. కాలంనాటి వాగ్గేయ కారులుగా ఎంచ బడుతున్న అనువర్తిత జానపద గాయకులు (applied folk singers) గద్దర్, వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న మొదలైన వారు సృష్టించే పాట సృజనలో పద్ధతినే పాటిస్తున్నారు. పాట రచన అంటే సాహిత్య రచన సంగీత రచన కలిసే ఉంటాయి. పాట అన్నది మౌలికంగా మౌఖిక సాహిత్య ప్రక్రియ అది ప్రాథమికంగా పాడడానికి ఉద్దేశించింది. అన్నమయ్య చేసిన పాట రచన కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆయన పాటలు కట్టింది తను నమ్మిన మత సిద్ధాంతాన్ని వైష్ణవ భక్తిని జనబాహుళ్యంలో ప్రచారం చేసి జనం నాలుకల మీద ఆడేలా చేయడానికే.  దాని నిర్మాణాన్ని కూడా అందుకు అనుకూలంగానే  చేసుకున్నాడు.
అన్నమయ్య పాటల్లో ఉన్న జానపదం గురించి జానపద సంగీత బాణీల గురించి చందమామా, జాజర వంటి వారానువర్తనాల గురించి ఇప్పటికే చాలా మంది పరిశోధన చేసారు. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. అంతే కాదు అన్నమాచార్యుల కుమారుడు పెదతిరుమలాచార్యుడు ఆయన కుమారుడు అంటే అన్నమయ్య మనుమడు చినతిరుమలా చార్యులు అనే ఆయన సంకీర్తన లక్షణమ్ అనే లఘు కృతిని రచించాడు.[7] పదం అనే సాహిత్య ప్రక్రియకు ఉండే లక్షణాన్ని చెప్పాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. పాటను సంప్రదాయ కావ్యశాస్త్రాల మర్యాదను అనుసరించి పదం అని అంటూంటారు. అప్పటి భరతుని నాట్యశాస్త్రం దగ్గరనుండి నండూరి యెంకి పాటల వరకు పాటకు పదం అనే మాటను పర్యాయపదంగా వాడారు. పదం పాడిందంటే పాపాలు పోవాలి అనియెంకిని గురించి చెబుతాడు. 71 కందపద్యాలలో రాసిన సంకీర్తన లక్షణంలో కొన్ని పద్యాలలో ఎన్ని రకాల పదాలుంటాయి వాటి నిర్మాణం ఎలా ఉంటుంది. యతి ప్రాస నియమాలు ఎలా ఉంటాయి. అనే విషయాలను రాసాడు చిన తిరుమలయ్య.
పదం అనే దానికి ప్రాథమికంగా ఎన్నిలక్షణాలు ఉంటాయో చెప్పడానికి ముందు పదం లక్షణాలను అంతకు ముందే ఎక్కడెక్కడ ప్రాచీనులు చెప్పారో చెప్పాడు ఒక సీస పద్యంలో.[8] సంగీత రత్నాకర ప్రబంధం లో, సంగీత చంద్రిక లో, సంగీత చూడామణి, సంగీత సుధాకరం అనే గ్రంథాలలోను వాటికి మూలమైన భరతంలోను పదలక్షణాలు చెప్పబడ్డాయని ఆధారాలు ఇచ్చాడు. తిరుమలాచార్యుడు. పదము అనే ప్రక్రియకు వృత్తము, చూర్ణము, నిబంధకము అనే పేర్లున్నాయని చెప్పాడు. వృత్తము అనేది సమవృత్తము అని విషమ వృత్తము అని రెండు రకాలు గా ఉంటుందని సమ వృత్తంలో నాలుగు పాదాలుంటాయని సరిపాదాలు లేకుంటే దాన్ని అర్థసమవృత్తం విషమ వృత్తంలో పాదాలు మరింత వేరే గా ఉంటాయని దీన్ని అన్నయార్యుడు అన్నాడని చెప్పాడు.  
నిబంధన అనే పేరున్న పదములో యతులు ప్రాసలుంటాయి మాత్రలు తాళసంగతులుంటాయి అని అన్నాడు. వీటిలో నాలుగు పాదాలలో యుతులుంటాయి అని రెండో అక్షరంలో ప్రాస ఉంటుందని లక్షణంగా చెప్పాడు. నిబంధన అనే పదము నకు అవాతంరంగా అవయవాలుగా ఇతర పద్ధతులలోను నిబంధనలుంటాయి అన్నాడు. ఇంకా వివిధ రకాలైన పదములను గురించి వాటి పేర్లను గురించి సంకీర్తన లక్షణంలో ఉంది. అంతే కాదు గ్రామ్యోక్తులను వాటి
ఒడుపు తెలిసి ప్రాముఖ్యాన్ని తెలిసి నైపుణ్యంతో పలకాలి అంటే రచించాలి అని చెప్పాడు. పదము అనే ప్రక్రియ గ్రామ్య భాషలో అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలోనే చెప్పి ఒప్పించాలి అని చెప్పాడు.
ఇలా సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని శాస్త్రాన్ని బట్టి తెలిసేది పాట నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే. కాని అన్నమయ్య తన కాలంనాటివికాని తనకు పూర్వం ఉన్న కాలం నాటివికాని అలంకార గ్రంథాలలో ఉన్న పదము అనే ప్రక్రియకున్న లక్షణాల గురించి తెలుసుకున్నా ప్రత్యక్షంగా తాను పాటలు కట్టేటప్పుడు వాటిని గురించి అంతగా పట్టించుకోలేదు. అన్నమయ్య పాటలు సంకీర్తన లక్షణంలో చెప్పిన వింగడింపుకు ఒక్కొక్కటి చెందుతుందో లెక్కకట్టి నిరూపించడం చాలా కష్టం. దుస్సాధ్యం. కాని పాటలో ఒక ప్రాస నియతి యతి నియతి పెట్టుకుని రాసారు అని నియమాలు శాస్త్రాలలో కూడా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. అన్నమయ్య పాటల్ని సంకీర్తన లక్షణ గ్రంథంలో చెప్పిన పేర్ల ప్రకారం లక్షణాల ప్రకారం ఉదాహరణలుగా చూపి అధ్యయనం చేయడం అనేది పెద్ద ప్రయోజనం ఉన్న విషయం కూడా కాదు. కారణం అన్నమయ్య పాట ఒక్కటీ సమాన నిర్మాణంతో లేదు. కాగా అన్నమయ్య తాను పదం కీర్తన అనే పేర్లను ఎలా వినియోగించినా పాటే తన ప్రక్రియ అని భావించినట్లు చెప్పడానికి ఉపయోగపడే ఉదాహరణలు ఆయన పాటల్లోనే దొరుకుతాయి. కీర్తన అనే మాట మామూలు నిత్యవ్యవహార భాషలో పాట అనే అర్థంలోనే జన సామాన్యంలో ఉంది. కీర్తించడం అనే మాట కూడా భక్తికి సంబంధించిన పదంగానే వినియోగంలో ఉంది. బుర్ర రాం కీర్తన పాడుతుంది రోయ్ జాగ్రత్త. అనే తెలుగు పలుకుబడి ఇక్కడ కీర్తన అంటే పాట అనే అర్థం. సంగీతంలోను కీర్తన అనే మాట కృతి అనే మాట కూడా పాట పరంగానే వాడుతున్నారు.
అన్నమయ్య పాటల్లో వస్తు పరంగా ఉన్న వైవిధ్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించి చర్చించడం సాధ్యం కాదు. కాని వస్తువుకు రాగానికి దగ్గరి సంబంధం ఉంది. అలాగే పాటలోని రూపానికి సంబంధం ఉంది. వీటిని పూర్తిగా విడిగా చూడడం కుదరదు. అన్నమయ్య తన పాటలన్నింటికి రాగాలను తనే నిర్దేశించాడు. తాను కూడా అదే రాగంలో పాడి అలా పాడడంలో పాటకు బాగా వ్యాప్తి వచ్చిన తర్వాతనే పాట ఆరాగం అనే సంబంధం కలిసింది. రాగిరేకులలో ప్రతి పాట దగ్గర, రాగం పేరు ఉంది. అన్నమయ్య రాగం చెప్పాడు కాని తన పాటలకు తాళం చెప్పలేదు. దీనివల్ల తర్వాతి కాలపు గాయకులు అన్నమయ్య పాటల్ని వారికి అనుకూలమైన తాళంలో పాడుకునే వైవిధ్యం లభించింది. పాటలు పాడే తీరు పరివర్థితమై అన్నమయ్య పదాలు నేడు కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతం శైలిలోనికి వచ్చాయి. కాని అన్నమయ్య పాడిన పద్ధతి ఇదేనా అని చెప్పడం ఈనాడు దీని వల్ల సాధ్యం కాకుండా పోయింది. అన్నమయ్య పాటల్ని బాగా ప్రసిద్ధంగా పాడే వారు పాడిన పద్ధతిని గ్రహించినా కూడా అన్నమయ్య ఇలా పాడి ఉండేవాడు అనే చెప్పే వీలు లేదు. కొన్ని చందమామా అనే వారానువర్తనం ఉన్న పాట తుమ్మెదా అనే వారానువర్తనం ఉన్న పాట ఇంకా ఇలాంటి జానపదగీతాల వరుసల్లో ఉన్న పాటల్ని అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్న వరుసలు కాబట్టి ఇలా పాడి ఉంటాడు అని చెప్పడానికి వీలవుతుంది.
అన్నమయ్య వస్తువుతో రాసిన పాటకైన ఒక సుష్ఠు నిర్మితిని పెట్టుకున్నాడు. పాటకు ఒక పల్లవి ఉంటుంది. ఇది రెండు పంక్తుల్లో ఉంటుంది. రెండు పంక్తుల్లోను యతి మైత్రి పాదానికి పాదానికి ఉంటుంది. పాదంలోని మొదటి అక్షరానికి పాదంలోని మధ్యలోని ఒక అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. సాధారణంగా పదాదిని అక్షరంతోనే మైత్రి కుదురుతుంది. కాని యతి మైత్రి వృత్త పద్యాల ఉన్న రీతిలో ఫలానా సంఖ్యలోని అక్షరానికి (10, 11, 12) అని  కాని జాత్యుపజాతి పద్యాల లో ఉన్న రీతిలో ఫలానా గణంలోని మొదటి అక్షరానికి అని కాని ఒక నియమం ఏదీ ఉండదు. మొత్తానికి ఒక యతి మైత్రి తప్పని సరిగా ఉంటుంది. ఇక పల్లవి లోని రెండో పాదంలోను ఇదే తీరున యతి మైత్రి ఉంటుంది. పల్లవి లోని రెండు పాదాలకు ప్రాస నియమం ఉంటుంది. కింద ఒక ఉదాహరణ చూద్దాం.
అదివో అల్లదివో శ్రీ హరివాసమూ
పదివేలు శేషుల పడగల మయమూ 

ఇక్కడ ఉన్న రెండు పాదాలలో మొదటి పాదంలోని యతి మైత్రి తొమ్మిదో అక్షరానికి ఉండగా రెండో పాదంలో ఎనిమిదో అక్షరానికే ఉంది. ప్రాస కారంతో కుదిరింది. మరొక ఉదాహరణ.
నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు
త్యము వీరల రణని బ్రదుకరొ సాటికి బెనగక జడులాల

రెండు పాదాలలోను యతి మైత్రి రెండు చోట్ల ఉంది. కాని నిత్యులో 'ని', నిగమాంత లో ఉన్న 'ని' యతి స్థానంలో ఉండటం వల్ల  రెండో పాదంలో సత్యములో '' సాటికి లోని 'సా' కు యతి మైత్రి కుదరడం వల్ల పల్లవి పాడడంలో లయ కుదురుతుంది. ఇందులోని ప్రాస సంయుక్త తకారం.
ఇలా ఏర్పడిన తర్వాత వరుసగా మూడు చరణాలు ఉంటాయి. ఒక్కో చరణంలో సరిగ్గా నాలుగు పంక్తులు ఉంటాయి. పైన పల్లవిలో చెప్పిన యతి ప్రాసనియమాలు చరణాలలోను ఉంటాయి. కాకుంటే పల్లవిలో రెండు పాదాలుండగా చరణంలో నాలుగు పాదాలుంటాయి. ఇక చివరి చరణంలో ముద్ర ఉంటుంది. అది వేంకటేశ్వరుని కున్న వివిధ నామాలలో ఏదైనా ఒకటి ముద్రగా మూడో పాదంలో కాని నాలుగో పాదంలో కాని ఉంటుంది లేదా ఇందులోని పాదంలోనైనా ఉండవచ్చు. నియమం లేదు. ఇది అన్నమయ్య కీర్తన అని గుర్తు పట్టడం ముద్ర వల్లనే సాధ్యం అవుతుంది. ఒకరు సృష్టించిన పదాలను మరొకరు అంది పుచ్చుకొని పాడే అలవాటు ఆనాడే ఉందని ఒక విషయం ద్వారా తెలుస్తుంది. తాళ్ళపాక చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణం లో ఇలా పాటల్ని చౌర్యం చేసే వారిని దూషిస్తూ ఒక పద్యం రాస్తాడు. పరిస్థితిని గమనించే వేంకటేశ్వర స్వామి ముద్రను వేసాడు అన్నమయ్య. కాని ముద్రలో తన పేరును కాకుండా స్వామి పేరునుంచడం లోని అంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ చౌర్యం నిరోధించడంగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోకూడదు. అన్నమయ్య రాసిందే అయినా ప్రజల్లోనికి వెళ్ళి అందరు పాడే స్థితిలో ఎవరైనా ఇది నా పాటే అని చెప్పుకునే వారు రావచ్చు. అప్పుడు పాట అసలు కట్టిన వానికి కీర్తి రాకుండా మధ్యలో వానికి రావచ్చు. దృష్టితోనే ఆనాటి వాగ్గేయ కారులు శతక కవులు తమ ముద్రలను ఏదో ఒక రూపంలో వేసుకున్నారు.  కింద ఒక చరణాన్ని చూద్దాం.
లజాక్షి మోమునకు క్కవ కుచంబులకు
నెలకున్న కప్పురపు నీరాజనం
లివేణి కురువునకు స్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం                     - క్షీరాబ్ది-

ఇదే పాటలో చివరి చరణం కింద ఉంది

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం                          -క్షీరాబ్ది-

ఇలాంటి చరణాలు మూడు సర్వసాధారణంగా అన్ని పాటల్లోను ఉన్నాయి. కాని చాలా అరుదుగా కొన్ని పాటల్లో ఆరుచరణాలున్నాయి. బ్రహ్మమొక్కటే పాటలో ఆరు, జో అచ్యుతానంద జోజోముకుందా పాటలో అరుదుగా తొమ్మిది చరణాలున్నాయి. నానాటి బ్రదుకు నాటకము లో రెండే చరణాలున్నాయి.  ఇంకా చాలా వైరుద్ధ్యాలున్నాయి. కొన్ని పాటలు కేవలం ఆరు పంక్తులతో ఉన్నాయి. ఇలాంటి విశేషమైన పాటలు కొన్నే కనిపిస్తాయి. కాని అత్యధికంగా కనీసం తొంభై శాతం పాటలు ఒక పల్లవి మూడు చరణాలతో నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. పల్లవిలో రెండు పాదాలు చరణంలో నాలుగు పాదాలు యతిమైత్రి  ప్రాసనియమం అనే నియమాలు అన్ని పాటల్లో ఉన్నాయి. ఇలా పాటలన్నీ ఒక ఏకరూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.
కాని పాటల నిర్మాణం ఒక అమరికలో ఏక రూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కాని పాటకు పాటకు నిర్మాణం మారుతుంది. కారణం  పల్లవి పాదాలలో కాని చరణాలలోని పాదాలలో కాని గణ నియమం అనేది లేదు. అంతే కాదు పాదం పొడవులో నియమం ఏదీ లేదు.  పాదాలు ఎంత పొడవైనా ఉండవచ్చు. అంతే కాదు ఒకే చరణంలోఉన్న నాలుగు పాదాలు కూడా నాలుగు పొడవుల్లో ఉండవచ్చు. అన్నమయ్య పాటల్లో అతి తక్కువలో ఎనిమిది అక్షరాలున్న పాదాలున్నాయి అతి దీర్ఘంగా 26 అక్షరాల దాకా ఉన్న పాదాలున్నాయి. పాట కట్టడంలో ఇంత స్వేచ్ఛ ఉండడం వల్లనే పాటలు మౌఖిక మాధ్యమంలో ప్రజల్లో అతి సులభంగా చాలా బాగా వ్యాప్తిలోనికి రాగలిగాయి. జానపద గేయాలకుండే ప్రధాన లక్షణమే ఇది పాద నియమం కాని గణ నియమం కాని ఏదీ ఉండదు. జానపద గేయాలు ఏదీ తీసుకున్నా పల్లవిలోను చరణాలలోను అనుకోకుండా మీకు యతినియమం కనిపిస్తుంది. గద్దర్ పాటల్లో కూడా  నియమం అనుకోకుండానే కనిపిస్తుంది. ఇది పాటలో సంగీత మాధుర్యం రావడానికి తోడ్పడుతుంది. అంతే కాదు జానపద గేయం చరణాలలో ఏదో ఒక విధంగా ఆది ప్రాస కాని అంత్య ప్రాస కాని సమతూకంలోని పాదాలు కాని ఉండి పాటకు లయను తియ్యదనాన్ని తెస్తాయి. పాటని వచనం నుండి వేరు చేసే గుణమే ఇది. విధమైన సమానాక్షర సమ్మేళనం వల్ల స్వేచ్ఛలో కూడా ఉన్న నియతి వల్ల పాటలకు సంగీత గుణం, తియ్యదనం చేరతాయి. అవి వివిధ రాగాలకు ఒదగడానికి సాధ్యం అవుతుంది. అన్నమయ్య పాటలోని నిర్మాణాన్ని కింది విధంగా ఒక డయాగ్రంలో చూడవచ్చు.

అన్నమయ్య పాటకు చిత్ర రూపం ఇది. ఇందులోని అడ్డు గీతలు పల్లవి చరణాలలోని పంక్తులు, మొదటి నిలువు గీత అన్ని పంక్తులలోని తొలి అక్షరం. రెండవ నిలువు గీత  ప్రాస స్థానం అన్ని పంక్తులలో అంటే పాదాలలో ఒకే చోట ఉండడాన్ని సూచిస్తుంది. మూడో నిలువు గీత యతి మైత్రి అక్షరాన్ని తెలుపుతుంది. కాని దాని పక్కన ఉన్న గుండ్రటి గుర్తులు యతిస్థానం వేరు వేరు చోట్ల ఉండడాన్ని తెలుపుతుంది. మొదటి అక్షరం మాత్రం ఒకే తొలిస్థానంలో ఉండడాన్ని కూడా చూడవచ్చు. పల్లవి ఎన్ని చోట్ల పునరావృతమౌతూ ఉందో చూడవచ్చు. పాట నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉన్నా స్వేచ్ఛకూడా ఉండడాన్ని గమనించవచ్చు.
పల్లవి
చరణం1
చరణం2
చరణం3
పల్లవి
పల్లవి
పల్లవి
పల్లవి
ప్రాస
యతి మైత్రి
యతి మైత్రి అక్షరాలు
అఅ
 











పై నున్న పాట నిర్మాణాన్ని సాహిత్య రూపంలో కింద పూర్తిగా చూడవచ్చు.

అప్పులేని సంసార మైన పాటే చాలు
తప్పులేని జీత మొక్క తారమైన చాలు                      -అప్పులేని-

కంత లేని గుడిసె గంపంతైనా చాలు
చింత లేని అంబ లొక్క చేరెడే చాలు
జంత గాని తరుణి జాతైన నదే చాలు
వింత లేని సంపదొక్క వీసమే చాలు                  -అప్పులేని-

తిట్టు లేని బతుకు ఒక దినమైన నదే చాలు
ముట్టు లేని  కూడొక్క ముద్దెడే చాలు
గుట్టు చెడి మనుకంటె కొంచెపు మేలైన చాలు
వట్టి జాలి పడు కంటె వచ్చినంతె చాలు         -అప్పులేని-

లంపట పడని మేను లవలేశమె చాలు
రొంపి కంబమౌ కంటె రోయుటె జాలు
రంపపు కోరిక కంటె రతి వేంకట పతి
పంపున నాతని జేరె భవమే చాలు                   -అప్పులేని-


అన్నమయ్య పాట అంతర్గత నిర్మాణాన్ని పైన చిత్ర రూపంలోను సాహిత్యంలోను చూచాము.
పాట నిర్మాణాన్ని పాడే క్రమంలో వింటూండగా మరొక రకమైన నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఇది శ్రేణీకృతమైన నిర్మాణం. పాడేటప్పుడు చరణంలోని ఒక పాదం తర్వాత మరొక పాదం పాడుకుంటూ పోతాడు గాయకుడు. పైన చిత్రంలో పాదాలు ఒక దానికింది మరొకటి ఉండడం చూచాము. కాని పాడే క్రమంలో పాదాలను ఒక దాని తర్వాత ఒక దాన్ని ఒక శ్రేణిలో రాస్తే వరసలోని పాదాలలో అక్షరాలు ఏవేవి ఎక్కడెక్కడ పునరావృత్తి చెందుతాయో మనం మరొక రీతిలో గమనించవచ్చు. అక్షరాలు నిర్ణీత క్రమంలోను స్వేచ్ఛగానూ పునరావృతమై పాటకు నిర్మితిని కల్పిస్తాయి. పాటను శ్రవణపేయం చేస్తాయి.  యతి మైత్రి కలిగించే అక్షరాలు అలాగే పాదాల ప్రాస స్థానాక్షరాలు కూడా పునరావృతమై ఇదీ ఒక క్రమంలో జరగడం వల్ల చరణంలో ఒక సుష్ఠు నిర్మితి ఏర్పడి పాటకు మాధుర్యాన్ని పునరావృతులే కలిగిస్తాయి. అయితే పునరావృతుల్ని సంప్రదాయకమైన వృత్యను ప్రాసాలంకారంగా చెప్పడం పాట నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసినట్లు అవుతుంది. కవి ఉద్దేశానికి అపచారం  చేసినట్లు కూడా అవుతుంది.

దీన్ని కింద చిత్ర రూపంలో చూడవచ్చు.
పాదం 1
పాదం 2
పాదం 3
యతిమైత్రి పాదంలో
 పై
ప్రాస సంబంధం పాదాల మధ్య
 







Structure of a Song:  syllable repetition at equal intervals in linear order.
పాట నిర్మాణం:  శ్రేణీక్రమ సమానాంతర అక్షరావృత్తి

మౌఖిక మాధ్యమంలో స్వేచ్ఛగా రచించే పాటలో అప్పటికప్పుడే సంగీత సాహిత్యాలు సృజన జరిగే పాటలో అంతర్గతంగా ఇంత నిర్మాణం ఉంటుంది. నియమాలు ఏమీ లేవు అనే స్థితిలో కూడా నిర్మాణం ఉంటుంది. అన్నమయ్య తాను సృష్టించిన పాటల్లో ముప్పావు మువ్వీసం పాటలు ఇదే రీతిలో సృష్టించాడు.  చాలా జానపద గేయాలలో వాటిదైన నిర్మితి వాటికి ఉంటుంది. దీనిలో చరణాలలోని పాదాల సంఖ్య కాని చరణాలలో సమాక్షర యతిస్థానం నిర్ణయించడం గాని కవి అప్పటికప్పుడు చేసుకుంటాడు. ప్రాస స్థానాన్ని పాటించక పోయినా అంత్య ప్రాసను పాటించవచ్చు. లేదా సమతూకంలో ఉండే పదాలు చివరలో కాని మొదటలో కాని వేసుకోవచ్చు. ఏదైనా పాటకు అప్పటికప్పుడే దాని నిర్మాణం ఏర్పడుతుంది. ఎన్ని జానపద గేయాలు చూచినా రీతి కనిపిస్తుంది. పల్లవి మూడు చరణాలుండే పాటలే సర్వసాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. పాట సాహిత్యంలో మాత్రం నిర్మాణం లేకుండా కేవలం వచనంలా కనిపించే వచనాన్ని సైతం సంగీతజ్ఞులైన గాయకులు తియ్యగా పాడ వచ్చు. కాని అంత మాత్రాన అది మంచి పాట కావాలని ఏమీలేదు. పాట అనే ప్రక్రియ సాహిత్య ప్రక్రియగా తనదైన నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడే సంగీతానికి బాగా తోడ్పడుతుంది. తియ్యటి పాట సృష్టి జరుగుతుంది. అన్నమయ్య పాటకాడుగా విజయం సాధించింది ఇక్కడే. పాటకాడు అనే మాటను వాగ్గేయకారుడు అనే మాటకు సరిగ్గా సమానార్థక పదంగా వాడుతున్నాను. మనవాళ్లు తెలుగు సమాసాన్ని వాడడానికి ఎందుకో ఇష్టపడరు గాని. పాటకాడు అనే మాట రాసే వానికి పాడే వానికి రెండింటికి సమానంగా వర్తిస్తుంది. కాబట్టి అన్నమయ్య మంచి పాటకాడు.
Select Bibliography:
అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. సంపుటాలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు.
చిన్న తిరుమలా చార్యులు తాళ్ళపాక. 1835. సంకీర్తన లక్షణమ్. విజయ రాఘవాచార్య వి. సంపా. 1935. మైనర్ వర్క్స్ ఆఫ్ అన్నమాచార్య అండ్ హిస్ సన్స్. మద్రాసు. మహంతాస్ దేవస్థానమ్స్ ప్రెస్. లోనిది.
Ambika Ananth and Adviteeya. N. Dixit. (tr.) 2005. Nector Ocean of Annmacharya (Translations of Annamayyas songs). Tirupathi. T.T. D press.
Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio.
Ong, J. Walter. 1982. Orality and Literacy: Technologizing of the Word. Metheun & Co. ltd.
Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
జానపద విజ్ఞాన గిరిజన అధ్యయన శాఖ
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం 517246



[1] Ong, J. Walter. 1982 p. 2.
[2] లిఖిత సాహిత్యం (fixed text) స్థిరపాఠ్యంతో ఉంటుంది. అదే మౌఖిక సాహిత్యం లేదా జానపద సాహిత్యంలోని పాఠ్యం అస్థిరమైనది మనిషి మనిషికి ఇది మారుతుంటుంది. అన్నమయ్య పాడడానికి ఉద్దేశించుకున్న పాట ఇలా మనుషుల మధ్యలోనికి చేరి మారిపోయేదే.
[3] Ambika Ananth and Adviteeya. N. Dixit. 2005. P. 144
[4] దండె అనే ఈ సంగీత వాద్యం కడప జిల్లాలో ఇప్పుడు కనిపించడం లేదు. కాని ఈవ్యాసకర్త ఇటీవల వికారాబాద్ జిల్లాలో క్షేత్రపరిశోధన పర్యటన చేసినప్పుడు అనంతగిరి కొండ మీద పద్మనాభ స్వామి ఆలయం దగ్గర్లో విష్ణుభక్తుడైన మాలదాసరి దండె తీసుకొని పాడుతూ కనిపించాడు. ఇది పాట పాడేటప్పుడు శృతి చేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుంది.
[5] Applied folklore is the branch of folkloristics concerned with the study and use of folklore and traditional cultural materials to address or solve real social problems. -- http://en.wikipedia.org/wiki/Applied_folklore.                                     In the early years of the concept of Applied Folklore it was called as Folklorisums and Folklorism. These Ideas were conceptualized by Regina Bendix. She Defined Applied folklore as “Folklore outside of it context   or spurious folklore… The term Folklorisums has been applied to visually and aurally striking or aesthetically pleasing materials such as festive performance, music, art (but also foods) that lend themselves to being extracted from their initial contexts and put to new use for different often for larger audiences” p. 537  Bendix, Regina 1988. Folklorism: The Change of Concept. International Folklore Review 6: 5-15. In Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio
[6] అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు. పుట. 59.
[7] Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press. Pp. 137-150

[8] Ibid p. 140