Sunday, July 8, 2012

An Article on Madiga Poetry




మార్గం వేసుకున్న మాదిగ కవిత్వం

ప్రతి శాస్త్రంలోను ప్రతి జీవన రంగాలలోను సెగ్మెంటేషన్ పెరుగుతున్న రోజులివి. శాస్త్రం పెరిగిన కొద్దీ ఒక అధ్యయన రంగం కాని కళా రంగం కానీ వైపుల్యాన్ని సంతరించుకుంటున్న క్రమంలో దానిలో చిలవలు పలవలుగా శాఖోపశాఖలు ఏర్పడతాయి. ఉదాహరణకి వైద్య రంగంలో శరీరంలోని పైకి కనిపించని లోలోని ఎన్నో అవయవాలకు ఒక్కొక్క దానికి ఒక్కో శాస్త్ర అధ్యయన రంగం ఏర్పడింది. తెలుగు కవిత్వం కవిత్వ అధ్యయనం అంటే విమర్శలలో కూడా ఈ తీరు కనిపిస్తూ ఉంది. కవిత అంటే ఒకప్పుడు కవితే. కాని నేడు అలా కాదు. తెలుగు కవిత్వం చాలా వర్గాలుగా విడిపోయింది. స్త్రీ వాద కవిత, దళిత కవిత, బి.సి వాద కవిత, మైనారిటీ కవిత, డయస్పోరా కవిత, బ్లాగు కవిత, అంతర్జాల కవిత. ఇన్ని రకాలుగా వచ్చాయి. ఇందులో దళిత కవిత్వం తిరిగి విడిపోయింది. మాదిగ కవిత్వం, మాల కవిత్వం, దళిత స్త్రీవాద కవిత్వం అనేవి ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దళిత స్త్రీ వాద కవిత్వంలో కూడా మాల, మాదిగ వైరుద్ధ్యం వస్తుందేమో చూడాలి. ఇది ఇప్పటికైతే స్ఫుటంగా కనిపించడం లేదు. మొత్తం మీద దళిత కవిత్వంలో మాదిగ కవిత్వం అనేది ప్రత్యేకంగా రూపుదిద్దుకొంది. ఈ వాదంతో ఎంతో మంది కవులు మంచి కవితల్ని ప్రచురించారు. వీరి కవితలతో ఒక ప్రత్యేకమైన కవిత సంకలనమే వచ్చింది. ఈ మాదిగ కవితా వాదంలోని బాగోగుల్ని ఎలువు సలువుల్ని చూడడం ఇక్కడి ఉద్దేశం.   
దళిత కవిత్వంలో మాదిగల ప్రత్యేక కవిత్వం రావడానికి ఒక ప్రధానమైన సాంఘిక కారణం ఉంది. ఇది మాదిగలు తమ అస్త్విత్వం కోసం చేసిన బ్రతుకు పోరాటం. అదే మాదిగ రిజర్వేషన్ పోరాటం. ఎన్నో దశాబ్దాలుగా అంటే రిజర్వేషన్ అమలైన దగ్గరనుండి దాని అమలులో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని. వచ్చిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మాల కులం వారికి వెళ్ళాయని తమకు అన్యాయం జరిగిందని మాదిగలు ఉద్యమోన్ముఖులయ్యారు. మొత్తం షెడ్యూల్డు కులాలలో మాదిగల ఉపకులాలు 25 కాగా మాలల ఉపకులాలు 27 అని సేకరించిన ఆధారాలు తెలియ జేస్తున్నాయి. ఇందులో మాదిగ మాల అనే కులాలు ప్రధానమైనవి. కాని రిజర్వేషన్ అన్నది అన్నిషెడ్యూల్డు కులాలకు కలిపి ఒకే యూనిట్ గా ఉండడంవల్ల వచ్చిన 15 శాతం రిజర్వేషన్ లో ఎస్.సి కేటగిరీ పొందిన కులం ఎదైనా ఉద్యోగాన్ని పొందడానికి వీలుంది. అయినా పొందిన ఉద్యోగాలలో కాని సర్కారీ లబ్ధి దారులలో కాని మాలలే అత్యధికంగా ఉన్నారని మాదిగలలో విద్యావంతులైనవారు మేధావులు భావించారు. వారికి అందిన గణాంకాల ప్రకారం 90 శాతం పైగా ప్రభుత్వ ఉద్యోగాలలో మాలలు ఉన్నారని అందువల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగిందని మాదిగలు దాని ఉపకులాలు చాలా పెద్ద ఉద్యమం చేసాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద సాంఘిక ఉద్యమంగా దీన్ని పేర్కొనవచ్చు.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ లో ఎ.బి.సి.డి అనే ఉపవిభాగాలను చేసింది. దీని ద్వారా సాంఘిక న్యాయం జరిగిందని వారు భావించారు. కాని తర్వాత సుప్రీంకోర్టు ఈ ఉపవిభాగల రిజర్వేషన్ ను కొట్టివేసింది. దీనితో రాజ్యాంగ సవరణ అవసరం అని మాదిగ పోరాట ఉద్యమం దీన్ని చేయించేలా చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం మీద తీవ్రమై ఒత్తిడి చేస్తూ ఉంది. అంతే కాదు ఈ ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది.
ఈ సాంఘిక నేపథ్యంలో మాదిగలు తమ సామాజిక అస్తిత్వాన్ని తాము సాధించుకునే దిశగా ఉద్యమం చేసే సందర్భంలో వారిదైన సాహిత్యం కూడా సృజించుకున్నారు. అంతే కాదు. మాల మాదిగల మధ్య వృత్తి పరంగా సాంఘిక సంబంధాల పరంగా సాంస్కృతిక పరంగా చాలా వైరుద్ధ్యాలు చాలా శతాబ్దాలనుండి ఉన్నట్లుగా పరిశీలనలో తెలుస్తుంది. తెలుగులో ఒక పలుకుబడి ఉంది అన్నాదమ్ములు తగాదా పెట్టుకొని విడిపోయేటప్పుడు "వాడు మాల నేను మాదిగ ఇక వాడికి నాకు ఏ సంబంధం లేదు". అని అంటూండటం ఉంది. అన్నా తమ్ముళ్ల వంటి మాల మాదిగల మధ్యన వైరాలు ఉన్నాయని ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాషువా కూడా ఈ ప్రస్తావన చేసాడు. గబ్బిలం రెండవ భాగంలో ప్రత్యేకించి చెప్పాడు. ఇద్దరూ కలిసి పని చేయవలసి వచ్చింది అని కూడా చెప్పాడు. కాని ఈ సాంఘిక వైరుద్ధ్యాలు పెరుగుతూ వచ్చాయే కాని తగ్గలేదు. రాజకీయ రంగంలో కూడా పార్టీలు తాము ఇచ్చే సీట్లలో కానీ లేదా ప్రభుత్వ పదవులలో కాని ఈ వైరుద్ధ్యం ప్రభావం కనిపిస్తూ ఉంది. పార్టీలు ప్రభుత్వం ఈ వైరుద్ధ్యాల మధ్య ఒక సమతూకం ఉండేలా చూస్తున్నాయి. కాని రిజర్వేషన్ కారణంగా ఇరు కులాల మధ్య బాగా అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితి కవులలో కవితలలో పూర్తిగా ప్రతిబింబించింది. ఇద్దరి మధ్యనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి కూడా ఒక దశలో ఏర్పడింది. కాని అక్కడక్కడ సమన్యయ ధోరణులు బాగా కనపడ్డాయి. ఇటీవల కత్తి పద్మారావు ఒక దినపత్రికలో ఒక సాహిత్య వ్యాసం రాస్తూ తాను జాషువ నుండి చాలా స్ఫూర్తి పొందానని రాసాడు. ఇలా సమన్వయం చేసే వారు కొందరు సాహిత్య కారులు ఇరు వర్గాల నుండి ఉన్నా ఈ వైరుద్ధ్యం బాగా వైపుల్యం చెందింది. చివరికి ప్రభుత్వం జాషువా పేరుమీద ఒక సాహిత్య పీఠాన్ని పెట్టగానే మాల వర్గంనుండి మరొక డిమాండ్ వచ్చింది. జాషువా అంత స్థాయి మహాకవి ఉండగా దళితులందరికీ అతను ప్రాతినిధ్యంవహిస్తాడనే దృక్పథం మాల వర్గం అటుంచింది వారి వర్గం నుండి కూడా ఒక కవి పేరుతో పీఠం ఏర్పాటు కావాలనే కోరిక బలంగా వినిపించిన కారణంగా ప్రభుత్వం బోయి భీమన్న పేరుతో మరొక పీఠాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కనిపించే సామాజిక వైరుద్ధ్యాలు దళిత సాహిత్యంలో తిరిగి మాల మాదిగ కవిత్వం అనే వింగడింపులకు కారణం అయింది.
మాదిగ కవులు చాలా కాలంనుండే కవిత్వం రాస్తున్నారు. జాషువా మాదిగ వర్గంలో శిఖర ప్రాయమైనకవి. ఈయన 1919 ప్రాంతంనుండే కవిత్వాన్ని వెలయించడం ప్రారంభించాడు. కాని 1893 లో ఆంధ్రక్రైస్తవ గీతాలు అనే పుస్తకం వెలువడింది. దీనిలో కొందరు మాదిగ కవులు పాటలు రాసారు. ఆధునిక కాలంలో ఇదే తొలి మాదిగ కవిత్వంగా భావించాలి. (కృపాకర్ మాదిగ ఈ సమాచారాన్ని అందించాడు). కాని మాదిగ కవిత్వాన్ని ఈ వ్యాసంలో ఆ  కాలంనుండి పరీశీలించడం లేదు. 1985 తర్వాత మాదిగల సాంఘిక అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మాదిగ కవిత్వం అనే ప్రత్యేకమైన వింగడింపు ఏర్పడిన కారణంగా ఆనాటి నుండి ఉన్న కవితలనే ఇక్కడ పరిశీలిస్తున్నాను. ఆధునిక కవులలో కనీసం 60 మంది మాదిగ వర్గానికి చెందిన కవులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పొనుగోటి కృపాకర్ మాదిగ ఒక మంచి ప్రయత్నం చేసి మాదిగ కవులు చేసిన ఆధునిక కవితలను ఒక సంకలనంగా కూర్చాడు. కైతునకల దండెం అని దీనికి పేరు పెట్టాడు. ఇందులో 91 కవుల కవితలు ఉన్నాయి. ఇందులో దళితేతరులైన ఇతర కులాలకు చెందిన కవులు కూడా రాసిన కవితలున్నాయి. ఇది చాలామంచి ప్రయత్నం. అంతే కాదు. మాదిగలకున్న ప్రత్యేకమైన చారిత్రికాంశాలను సాంస్కృతిక నేపధ్యాన్ని మాలలతో వారికున్న సంబంధాన్ని గురించి వివరిస్తూ  ఈ కవితలను చదవడానికి ఒక నేపథ్యాన్ని సృష్టించాడు కృపాకర్. పై చెప్పిన ఈ కాలంలో వచ్చిన ప్రముఖమైన కవితలనీ అదీ మాదిగ వాదాన్ని వినిపించే కవితల్ని ఇక్కడ కొన్నింటిని పరిశీలిస్తాను. అయ్యయ్యో దమ్మక్కా అనే కవితా సంకలనంలో జూపాక సుభద్ర పుస్తకం పేరుతోనే ఉన్న కవితలో మాదిగల సాంఘిక జీవితాన్ని వర్ణించింది. తెలంగాణాలో అమాయకమైన స్త్రీని సర్వసాధారణంగా ఓసి దమ్మక్కా అని అంటారు. ఇతర ప్రాంతాలలో దద్దమ్మా అనే అర్థంలో దీన్నివాడతారు. ఉత్త అమాయకురాలైతివి కదా అనే అర్థంలో దీన్ని  వాడతారు. ఈ అయ్యయ్యో దమ్మక్కా అనే కవితలో ఒక చోట "మల్లన్న తోలమ్మ/ మొకానికి గింత సున్నం బూడిద రాసియ్యంగనే/ దప్పుగ తెప్పుగ/, తొండంగ, సబ్బండగ/ నన్ను జూడు నా అందం జూడని/ గీ జబ్బురు తోలమ్మ తొంబై రకాలుగా వన్నెలు బడ్తదా". ఇక్కడ మాదిగ వృత్తి నేపథ్యాన్ని వర్ణిస్తూ ఉంది  కవయిత్రి. మాదిగల వృత్తి చెప్పులు కుట్టడం దానికి వారు తోలు ఊనుతారు. తోలుకు సున్నం బూడిద రాస్తారు. ఉప్పుకూడా రాస్తారు. తర్వాత లందలో తంగేడు చెక్కలో నానబెడతారు. ఇంకా చాలా పని చేసి తోలును ఊనుతారు. అంటే టానింగ్ చేస్తారు. తర్వాతనే ఇది చెప్పులకు కాని డప్పుకు కాని లేదా మోట బొక్కెన తొండానికి కాని ఇతర వ్యవసాయ అవసరాలకు కాని వినియోగిస్తారు. ఇంకా దీని కష్టాలు వర్ణిస్తుంది సుభద్ర ఇక్కడ. "అయ్యయ్యో దమ్మక్కా... / లందను పొందిచ్చుడంటే/ గుబండ కుదిచ్చుకొని/బొంద దువ్వినట్లు గాదు/ నరం తోలు నానీకి/ కోసెడు బాటలు అరిగే నీళ్ళు మొయ్యాలె/ కుక్క నక్క కాకి గద్ద కండ్ల పడకుంట/ కూడు మర్సి కావలుండాలె/లుక్కలుక్క పురుగులు/ జిబ్బజిబ్బ ఈగలు/ గప్ప గప్ప గబ్బులు/ కడుపుల పేగుల్ని కత్తోలె మెలిబెట్టి/ కండ్లు బెయిని తిప్పి అడ్డం బెడేసినా తప్పని తలరాతయింది అయ్యయ్యో దమ్మక్కా". ఇంకా ఇలా సాగుతుంది కవిత. దీనిలో స్పష్టంగా మాదిగల వృత్తిలో ఉన్న భీకరమైన కష్టాన్ని వర్ణించింది. దీనికి భిన్నంగా మాలల జీవితం ఉంటుంది. వారికి చర్మకార వృత్తి లేనేలేదు. అయితే వ్యవసాయం లేదా నేత. లేదా ఇతర చాలా వృత్తులు. కూలీ జీవితం. కాని ఈ మాదిగ జీవితంలోని కష్టాన్ని అనుభవించిన వారుతప్ప దీన్ని తెలుసుకొని రాయలేరు. ఇదే వృత్తిని ఎండ్లూరి సుధాకర్ అత్యంత ప్రతిభావంతంగా రచించాడు. "ఈ సప్త సముద్రాల తోలు ఒలిచి/ఆకాశానికోమేకు/పాతాళానికోమేకు/ సప్త సముద్రాల మీద/ చర్మాన్ని నానబెట్టిన నీకు/ ఆసూర్య చంద్రులు / చెరో చెప్పు కావలసిందే/ఆకలితోనో/అవమానంతోనో/ తలవంచుకొని నీ చర్మపు జోళ్ళు/ కుట్టుకుంటున్న తాతా/ ఈ ప్రపంచం/ ఉంగటంగా మారి నీ ముంగాలి బొట్టినేలిని/ ముద్దు పెట్టుకోవాలని/ కలలు కంటున్నాను". మాదిగ వృత్తిని నేపథ్యంగా వర్ణంచిన ఈ కవితలో జాంబవుని ప్రసక్తి, జాంబపురాణ ప్రసక్తి ఉంది. విశ్వమంత నేపథ్యం ఉందీ కవితలో. జాంబవుడు అవలీలగా సప్త సముద్రాలను దాటేవాడని పురాకథ ఉంది. రామాయణంలో జాంబవునే మొదట లంకకు పోయి రమ్మని చెప్పగా. పూర్వం నాకు మోకాలి లో ఒక పర్వతం విరిగింది తానిప్పుడు ఎగరలేను హనుమంతుడు దానికి సరైన వాడని చెబుతాడు. ప్రపంచ మొత్తం ఉంగటంగా మారి నీ పాదాలను ముద్దుపెట్టుకోవాలి అనడం అత్యంత ప్రతిభా వంతమైన కవితాభివ్యక్తి అదే సమయంలో మాదిగల కుల అస్తిత్వంపైన మంచివాదాన్ని వినిపిస్తుంది ఈ కవిత విశ్వం మొత్తాన్ని నేపథ్యంగా చేసిన ఈ కవితాప్రతిభా శక్తిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎండ్లూరి సుధాకర్ ఇటీవలే వెలయించిన గోసంగి కావ్యం కూడా కవితాప్రతిభకు పండిన చేను. మాదిగలలో ఒక ఉపకులమైన గోసంగి కులం గురించి ప్రత్యేకంగా రాసిన దీర్ఘ కవిత ఇది. ఇందులో వారి ప్రత్యేక సాంఘిక అస్తిత్వాన్ని గురించి మాట్లాడాడు. మొత్తం దళిత కవులలోనే ఎండ్లూరిసుధాకర్ ఆధునిక కాలంలో ఉన్న అత్యంత ప్రతిభావంతమైన సృజనశీలియైన కవి అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో రాసే మరొక దళిత కవిని ఇంకా వెదక వలసే ఉంది. మాదిగలలోనే కళాకారులు కళారూపాలు చాలా ఉన్నాయి. బైండ్లకథ ఆసాది కథ డక్కలి పటంకథ, చిందుయక్షగానం, గోసంగి వేషం, ఇవన్నీ మాదిగల ఉపకులాల కళారూపాలే. వారు జన్మతః కళాకారులు, మంచిగాయకులు ఈ స్థితిని వర్ణించే కవిత నాగప్పగారి సుందరరాజు రాసిన కవిత పెద్దింటి పిల్ల దీనిలో గ్రామంలోని అన్ని కులాల ఆడపిల్లలు పెద్దమనిషి అయినప్పుడు పోయి పాట పాడిన మాదిగ పిల్ల తాను పెద్దమనిషి అయితే ఒక్క కులం వారు కూడా రానందుకు హృదయం ద్రవించేలా బాధపడుతుంది. చివరికి మా మాలోళ్లు కూడా మా కంటే ఎక్కువంట వాళ్ళ పిల్ల కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు కూడా మా కంటే పెద్దోళ్ళంట అని అనుకుని నా పాట నేనే పాడుకుంటా నా పాట నేనే పాడుకుంటా అని ఈ కవిత ముగుస్తుంది. మాదిగల జీవితపు మరోకోణాన్ని ఆవిష్కరించింది ఈ కవిత. మాదిగలు చనిపోయిన పశువులను తీసుకుపోవడం దాని మాంసాన్ని విభజించడం పంచుకోవడం తినడం గురించి వర్ణించిన కవితలున్నాయి. మాదిగల సాంస్కృతిక చిహ్నాలైన డప్పును చెప్పులుకుట్టే ఆరె చిహ్నాన్ని వారి ఇతర సంగీత  చిహ్నాలను మాలలు హైజాక్ చేసి వారి కులసంబంధ విషయాలలో మాలలు వాడుకుంటున్నారని బాధను వ్యక్తం చేసిన కవితలున్నాయి. సువార్తమ్మ అనే కవయిత్రి (బహుశా మారుపేరేమో) తెరతీయగరాదా అనే కవితలో మాల ప్రముఖులు తమ మాదిగలకు చేసిన అన్యాయాలను రాజకీయాలను ఎండగడుతుంది. మాల ప్రముఖుల పేర్లను కవితలలో నర్మ గర్భంగా ఇరికించి వారి దమననీతిని దుయ్యబడుతుంది ఈ కవిత. దున్న కూర అనే కవితలో మాదిగల ఆహార సంస్కృతిని గురించి వర్ణించడం ఉంది. మాదిగ సాహిత్యాన్ని సృష్టించడమే కాదు దానికి మార్గదర్శనం చేస్తూ సాహిత్య కృషి  చేస్తున్న మరికొందరు ప్రముఖులలో దార్ల వెంకటేశ్వరరావు ఒకడు. కొలకలూరి ఆశాజ్యోతి, ఎజ్రా శాస్త్రి లాబన్ బాబు. ఇంకా చాలా మంది కవులు దాదాపు అరవై మందికి పైగా మాదిగ కవులు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తి సాంఘిక ఆవేశంతో వచ్చిన ఈ కవితలలో కవిత శక్తి చాలా పలచబడిన అసలు లేని కవితలు కూడా ఉన్నాయి. కేవల వచన ప్రాయమైన కవితలూ వచ్చాయి. వాటిలో ఉన్నది మాదిగ ఉద్యమ స్పూర్తే.  మాదిగ కవిత్వాన్ని ఒక చోట సంకలించిన సంకలనానికి కైతునకల దండెం అనే పేరు పెట్టడం కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంది. తెలంగాణాలో కవిత్వం రాసే వాడిని కైతకాలోడు అంటారు. కవిత్వాన్ని కైతకం అంటారు. కై  అన్నది దీనికి  పొట్టి రూపం. దండెం  అంటే ఇంటిలోపల బట్టలు వేసుకోవడానికి గడను కాని పొడవాటి కర్రను కాని అడ్డంగా వేలాడదీసి కడతారు. దీన్ని తెలంగాణాలో దండెం అంటారు. అలాగే మాదిగలు మాంసం ముక్కల్ని ఇంటి బయట ఆరేసుకోవడానికి కట్టిన తాడు కాని గడను కాని దండెం అని అంటారు. ఈ ముక్కల్నే సియ్యలు అని అంటారు. సియ్యలు ఆర బెట్టేది దండెం. కవితలను కైతునకలు అని అచ్చ తెలుగు మాట వాడి  ఈ పేరు పెట్టడంలో కూడా మాదిగల జీవన రీతి తెలియ వస్తూ ఉంది. దళిత కవిత్వంలో మరొక పాయ ఉందని దీన్ని ప్రత్యేకంగా చూడాలని దళిత కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని గుండుగుత్తగా చూడడం వల్ల సరైన ఫలితం ఉండదని సాహిత్య విమర్శలో గ్రహించాలి. మాదిగ కవిత్వం, సాహిత్యం ప్రత్యేక మార్గాన్ని వేసుకుంది. ఇది వారి అస్తిత్వ మార్గం దీన్ని ఇలా చూస్తేనే సామాజిక న్యాయం మరింతగా జరుగుతుంది.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604

Friday, June 1, 2012


పులికొండ సుబ్బాచారి

పావురాల గుట్ట

ఇది పితృవనం
నిజాలు ఎన్నో అడుగల లోతులో ఖనితం కాగా
పైన జిల్లేడ్లు మొలిచిన ఛిద్రజీవన రుద్రభూమి
నిజాలు బొందల్లోంచి వాటంతటవే బయటికొచ్చి
ఇప్పుడు పోస్టుమార్టం చేయుంచుకుంటున్నాయి
ఎన్ని కత్తిగాయాలు ఎన్ని బుల్లెట్ దెబ్బలు
ఎన్నివేల ఎకరాలు రణరక్తప్రవాహ సిక్తం కాలేదా
అది సోంపేటా అది గంగవరమా
అది కడలి అంచులన్నింటి ముంచెత్తి కాటేసిన కార్పొరేట్ భూతమా
అది విల్లాలా జిల్లాలా ఓబుళాపురం ఖిల్లాలా
ఏవైతేనేం
క్షతగాత్ర సత్యాలు పోస్టుమార్టం చేయించుకుంటున్నాయి
గాయాలేవైతేనేం
పచ్చపచ్చని పైరు, కడుపునిండా చన్నుకుడిచిన బిడ్డ
అవి గాలికి తెరలు తెరలుగా తెర్లిన ఆనందాలు అడుగుతున్నాయి
మేం స్మశానాల పాలెందు కయ్యామని
పోస్టుమార్టం చేయించుకుంటున్నాయి
ఉదయాలు అబద్ధం అక్కడ సూర్యుడు వర్చ్యువల్
మేఘాలన్నీ అందుకు సాక్షి
చీకటి తన ముఖానికి సంధ్యారుణ వర్ణాన్ని పూసుకుంది
ఈ గాలి తెమ్మెరలన్నీ అందుకు సాక్షి
అది వర్చువల్ సూర్యుడు ఇది పోస్ట్ మార్టం రిపోర్టు
ఏ మేఘం ఇక్కడ వర్షించిందో చీకటి ముఖానికి వేసిన
సంధ్యావర్ణం అదుగో పితృవనంలో గిరికీలు కొడుతూంది
ఈ గాలికి తెలుసు ఈ నేలకు తెలుసు
ఈ నింగీ ఈ నీరు ఎనాటమీ టేబుల్ పక్కనే ఉన్నాయి
తాము చూసిన నిజాన్ని కళ్ళతో చూస్తున్నాయి
గాయపడ్డ నిజాలు, భూమిపైకి వచ్చిన నిజాలు, మిగిలిన శల్యాలు
కార్బన్ టెస్ట్ ల్లో డిఎన్ ఎ పరీక్షల్లో...
ధృతరాష్ట్ర వ్యామోహం కురుక్షేత్రంలో మడుగు ఒడ్డున
తొడలు విరిగి కూలింది ఈ రోజు
పావురాల గుట్ట కొత్తగా కన్నీళ్ళు పెట్టుకుంటూంది
అది చంచల్ గూడ అయితేనేం చర్లపల్లి అయితేనేం
జైలు ఊసలు ఛిద్రమైన జీవితాల్ని తెస్తాయా
పారిపోయిన వసంతాలు కోకిలల్నెక్కడ వెదుకుతాయి
పితృవనాల్లో దాక్కున్న ప్రజాస్వామ్యం..
నిజాలు బయటికొచ్చి పోస్టు మార్టం చేయించుకుంటున్నాయి...
ష్....ష్... ష్... డాక్టర్ బయటికొస్తాడు
మౌనంగా చూడండి
రేపటికోకిల బిందువులని ఏరుకుంటుంది
జాగ్రత్త రెప్పలచాటున నీళ్ళు తొణకొద్దు సుమీ...


పులికొండ సుబ్బాచారి
Prof. Pulikonda Subbachary
Director
Internal Quality Assurance Cell
Dravidian University
Kuppam 517426 A.P
Mobile: 09440493604
psubbachary@gmail.com






Friday, May 11, 2012



ప్రొఫెసర్   పులికొండ సుబ్బాచారి
Director, Internal Quality Assurance Cell
ద్రావిడ విశ్వవిద్యాలయం 517425
09440493604psubbachary@gmail.com

తొలి అస్మితి (అస్తిత్వ) సాహిత్యం కులపురాణాలే
తెలుగులో అస్తిత్వ సాహిత్యం అనే ఒక సాహిత్య వర్గీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. ఇటీవలే అంటే మరీ ఐదారు సంవత్సరాలే అయింది. రకరకాల రాజకీయ కారణాలవల్ల సాంఘిక సంఘర్షణల కారణంగా తెలుగులో కవులు రచయితలు కూడా సామాజిక వర్గాల రీత్యా విభాజితమయ్యారు. దళిత సాహిత్యం అని దళిత కవిత్వం అని ప్రారంభమై అది బాగా ఒక ప్రత్యేక అస్తిత్వంతో నిలదొక్కుకున్న తర్వాతనే మిగతా సామాజిక వర్గాల నుండి కూడా ఈ రకమైన అస్తిత్వవాణి వినబడుతూ వస్తూ ఉంది. తెలుగులో దళితుల గురించి దళిత సమస్యను గురించిన సాహిత్యం ఎప్పటినుంచో ఉన్నా దళిత సాహిత్యమనే కొత్త వర్గీకరణ చేయడం 80 వ దశకంలోనే ఆరంభం అయింది.  ఈ రోజున దళిత సాహిత్యం కన్నా భిన్నంగా, మైనారిటీ సాహిత్యమని, వెనుకబడినకులాలవారి సాహిత్యమని బహుజన సాహిత్యమని స్త్రీవాద సాహిత్యమని ఇందులో కూడా ఉన్నత వర్గాల స్త్రీ వాద సాహిత్యం, దళిత బహుజన వర్గాల స్త్రీవాద సాహిత్యమని, మైనారిటీ స్త్రీ సాహిత్యమని ప్రత్యేకమైన వర్గీకరణలతో సాహిత్యం వస్తూ ఉంది. తెలుగు సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నా ఈ  సామాజిక అస్తిత్వాలను గురించి విచారించి రాసే సాహిత్యం, వచన కవిత, కథా ప్రక్రియల్లో బాగా వెలువడింది. దళిత కవిత్వం, మైనారిటీ వర్గాలకు చెందిన కవిత, స్త్రీవాద వివిధ రకాల స్త్రీవాద కవిత అలాగే వెనుకబడిన తరగతులకు  వృత్తి కులాలకు చెందిన కవితలు కవితాసంపుటాలు బాగా వెలువడినాయి. కథలు కూడా మైనారిటీ జీవన చిత్రాలను బాగా తెలిపేవి, చేతివృత్తుల కులాల జీవన గమనాలను సమస్యలను బాగా వర్ణించిన కథలు బాగా వెలువడినాయి. చేతి వృత్తుల వారి జీవితాలను బాగా వర్ణించిన కథా సాహిత్యంపైన విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇక నవలా ప్రక్రియలో కూడా వివిధ సామాజిక వర్గాల అస్తిత్వాన్ని ప్రత్యేకించి చిత్రించిన నవలలు వచ్చాయి. ముఖ్యంగా దళిత జీవితాన్ని గురించి వెనుకబడిన వృత్తి కులాల వారి గురించిన నవలా సాహిత్యం కనిపిస్తూ ఉంది.  కొంత కాలం గడిచిన తర్వాత తిరిగి తెలుగు సాహిత్య చరిత్రను రచింప బూనుకునే సాహిత్య చరిత్రకారులు ఈ గడచిన రెండు దశాబ్దాలలో జరుగుతూ వస్తున్న సామాజికపరిణామాల్ని వాటికనుగుణంగా వస్తూ ఉన్న సాహిత్య వర్గీకరణాల్ని బాగా గమనించవలసి ఉంటుంది.  
తెలుగులో ఇటీవలి కాలంలో సామాజిక సమూహాల గుర్తింపునకు సంబంధించి వెలువడిన సాహిత్యాన్ని గురించి ఆలోచించి చేసిన విమర్శనా వ్యాసాలు వాటిపైన చర్చోపచర్చలు ఆయా సామాజిక వర్గాలుగా విడిపోయిన రచయితలు రచయిత్రులు వారి సంఘాల మధ్య రాజకీయాలు వీటిపైన ఘాటైన చర్చలు దాదాపు ఏడాది క్రితం వివిధ పత్రికలలో బాగా జరిగాయి. అధిక ఉష్ణోగ్రతతో కూడిన చర్చల గురించి  లోతుపాతుల్లోనికి వెళ్ళి ఎలువు సలువులను క్షుణ్ణంగా చర్చించవలసిఉంది.
 ఒక వ్యక్తికి సంబంధించి కాని వ్యక్తుల సమూహం అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన అంటే భారతీయ సందర్భంలో కులానికి సంబంధించిన  సామాజిక పరమైన గుర్తింపును గురించి సామాజిక సమస్యను గురించి ఆలోచించి సాహిత్యాన్ని సృజించడం గాని ఒక సామాజిక వాదాన్ని వినిపించడానికి గాని సాహిత్యాన్ని చేయడం చాలా ప్రాచీన కాలంనుండే శతాబ్దాల నాడే ఉందని చెప్పడానికి వీలుంది. ఈరకమైన సాహిత్యాన్ని గురించి వివేచిస్తూ దీని సామాజిక ప్రకార్యాలను (functions) క్షోదక్షమంగా చర్చించవలసి ఉంది. ఇలాంటి సాహిత్యం తెలుగులో కూడా అతి ప్రాచీన కాలంనుండి ఉంది. కాని దాన్ని ఒక వర్గం పైకి రానీయకండా పరిశీలనకు రానీయకుండా చేసింది. ఈ సామాజిక సాహిత్యం ఒక సమాంతర రేఖలో మౌఖిక సాహిత్యంలో కొనసాగి వస్తూనే ఉంది. దీన్ని గురించే ఇక్కడ చర్చించడానికి లక్షించాను.
ఇక్కడ కొంత పదచర్చ కూడా తప్పని సరి అవసరం.  అస్తిత్వం అనే పదాన్ని తెలుగు సాహిత్య విమర్శలో ఇంతకు ముందు వేరే అర్థంలో వాడేవారు. Existence అనే పదానికి సమానార్థకంగా అస్తిత్వం అనే పదాన్ని గ్రహించిExistentialism అనే సాహిత్య వాదాన్ని తెలుగులో అస్తిత్వవాదసాహిత్యం అనేపేరుతో అనువదించి బాగా వ్యవహరించారు. అరవై డెబ్బై దశకాలలో వచ్చిన సాహిత్య విమర్శ విశేషించి నవలపై వచ్చిన సాహిత్య విమర్శలో ఈ పదాన్ని బాగా వినియోగించారు. కాగా ఇటీవల అస్తిత్వం, అస్తిత్వసాహిత్యం, అస్తిత్వవాదం అనే మాటల్ని ఇక్కడ చెప్పిన వింగడింపుకన్నా భిన్నంగా పైన చెప్పిన కొత్త అర్థంలో వినియోగిస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన గుర్తింపును అస్తిత్వం అని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సాంఘిక గుర్తింపును గురించి సృజించిన సాహిత్యాన్ని అస్తిత్వ సాహిత్యం అని వ్యవహరించడం ఇటీవల జరుగుతూ ఉంది. నిన్నమొన్నటి పత్రికలలో వచ్చిన సాహిత్య వ్యాసాలలో ఇలా వినియోగించారు. కొత్తగా వీటిని చదివేవారికి పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినా తొలినాటి నుండీ వచ్చిన సాహిత్య విమర్శను చదువుతూ వస్తున్న వారికి మాత్రం ఈ పదం చాలా ఇబ్బందిగానే ఉంది. పాత,Existentialism అనే అర్థమే మనసులో ఉన్నవారికి అస్తిత్వవాదం అని చూడగానే అదే గుర్తుకు వస్తుంది. అయోమయానికి గురిచేస్తుంది.నిజానికి literature of social identity అనే అర్థం వచ్చేలా సమకూర్చడానికి  అస్తిత్వవాదసాహిత్యం అనే పదబంధ సరిపోదు. ఐడెంటిటీ అనే ఆంగ్లపదానికి సరైన తెలుగు పదం గుర్తింపు. కాని గుర్తింపు అనే అచ్చ తెలుగు పదంతో తర్వాత అవసరమైన సమాసాలని చేయలేము. ఉదాహరణకి గుర్తింపు సాహిత్యమనో గుర్తింపువాదం అనో గుర్తింపువాద సాహిత్యమనో సమాసాలు చేస్తే అంత బాగోదు. అంటే ఇక్కడ వ్యాకరణం ప్రకారం ఇవి వైరి సమాసాలు అనో దుష్ట సమాసాలు అనో వ్యతిరేకించడం కాదు. కాని వినడానికే అంత బాగాలేవు. వీటికి పూర్తిగా వచ్చే సంస్కృత సమాసాలు చూడవలసిందే. అస్మి అంటే నేను అస్మితి అంటే నేను అనే భావన అంటే  నా అస్మితి అంటే నేను అనే ఐడెంటిటీ. వివిధ సామాజిక వర్గాలు వాటి సామాజిక పరమైన గుర్తింపును గురించి సామాజిక వర్గాల సామాజిక సమస్యల గురించి సృష్టించే సాహిత్యం అంతా వారి సామాజిక గుర్తింపు అంటే ఐడెంటిటీని గురించి రాసే సాహిత్యమే. ఈ భావనలో దీన్ని అస్మితిసాహిత్యం అని అనవచ్చు.  హిందీ సాహిత్యంలోను అస్మితి అనే మాటను వినియోగిస్తున్నారు. తెలుగులో ఇటీవలి కాలంలో వచ్చిన ఈ సాంఘిక వాదాన్ని అస్మితివాదం అని ఇలా వివిధ సామాజిక వర్గాలు సృష్టించుకుంటున్న సాహిత్యాన్ని అస్మితిసాహిత్యం అని అస్మితివాదసాహిత్యంఅని స్పష్టంగా వర్గీకరించి అధ్యయనం చేయవచ్చు. వర్గీకరణ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కాబట్టి ఈ కొత్త సాహిత్య వర్గీకరణని అస్తిత్వసాహిత్యం అని అనకుండా అస్మితిసాహిత్యం ఈ నేపథ్యంతో చేసే వాదాన్ని అస్మితివాదం అని  ఆ సాహిత్యాన్ని అస్మితివాదసాహిత్యం అని వ్యవహరిస్తే బాగుంటుంది అని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను.
ఇక సాంఘిక అస్మితిని గురించి సాహిత్యం ఎప్పటినుండి వస్తున్నది అని వివేచిస్తే, ఇది పైన చెప్పినట్లు ఇప్పటిది కాదు. ఆధునిక సాహిత్యానికి లిఖిత సాహిత్యం విషయానికి వస్తే పైన చెప్పిన రీతిలో ఇది ఇటీవలిదే. కాని మౌఖిక సాహిత్యంలో శతాబ్దాలనుండే అస్మితిసాహిత్యం వస్తూ ఉంది. కాని మనం మౌఖిక సాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తించింది మహా అయితే ఒక వంద సంవత్సరాలనుండి. మౌఖిక సాహిత్యం కూడా సాహిత్యమేనా అని వాదించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇది మన బలహీనత, దౌర్భాగ్యం.  ప్రపంచంలోని 6,500 భాషలలో భారతదేశంలోనే 1650 భాషలు ఉన్నాయి. కాని వీటిలో లేఖన సంప్రదాయం ఉన్న భాషలు 20 మాత్రమే. ఇవి రాజ్యాంగం గుర్తించిన 20 భాషలు వీటిలో కూడా అన్నింటిలో ఉన్నత స్థాయిలో లిఖిత సాహిత్యం లేదు. కాని మిగిలిన 6530 భాషలకు కూడా సాహిత్యం ఉంది. వాటిలో కూడా రామాయణ భారతాలు, కవిత్వం, కథలు ఉన్నాయి. కాని 95 శాతంగా ఉన్న ఈ మౌఖిక సాహిత్యాన్ని ఇంకా మనం సాహిత్యం గా గుర్తించడం లేదు.
తెలుగులోని  మౌఖిక సాహిత్యం ప్రాచీనత గురించి చర్చించవలసిన అవసరం లేదు. ఈ భాష ఎంత ప్రాచీనమైందో దీని సాహిత్యం కూడా అంత ప్రాచీనమైంది. కులపురాణం అనే సాహిత్య ప్రక్రియ కూడా ఇంత ప్రాచీన మైంది. కులపురాణాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా గుర్తించి దానిపైన ప్రత్యేకంగా పరిశోధించడం 1980 దశకం నుండి అస్మదాదులతో ప్రారంభం అయింది. అప్పటిదాకా వచ్చిన సాహిత్య విమర్శలో విశేషించి పురాణాల పైన పరిశోధన చేసిన పండితులు వీటిని సాహిత్య ప్రక్రియగా గుర్తించకుండా పక్కకి నెట్టివేశారు. కారణం ఇవిమౌఖిక సాహిత్యంలో ఉన్నాయనే కాదు. లిఖిత సాహిత్యంలో కూడా ఇవి వచ్చినా ఇవి కొన్ని కులాల సామాజిక అస్మితి (అస్తిత్వం) గురించి మాట్లాడి అగ్ర కులాల అధిపత్యాన్ని తిరస్కరించిన కారణానే వీటిని సాహిత్య ప్రక్రియగా గుర్తించక సాహిత్య ప్రపంచంలోనికి రాకుండా అడ్డుకున్నారు.
కులపురాణం అన్నది తొలి సాహిత్యప్రక్రియగా కూడా చెప్పడానికి వీలుంది. కారణం సాహిత్య ప్రక్రియలలో పరివర్థితమైన సాహిత్య ప్రక్రియగా ప్రతి సంస్కృతిలోను పురాకథ లేదా మిత్ అనే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. సృష్టి గురించిన సాహిత్యం వివిధ సామాజిక వర్గాల పుట్టుకల గురించిన పురాకథా సాహిత్యం అతి పురాతన జాతులలోను కనిపించిన వైనాన్ని ప్రపంచ వ్యాప్తంగా జానపదవిజ్ఞానులు, ఆంథ్రోపాలజీకి అంటే మానవ శాస్త్రానికి చెందిన శాస్త్రజ్ఞులు ఇప్పటికే వివరించి ఉన్నారు. తెలుగు విషయానికి వస్తే మనకు స్పష్టమైన లిఖితసాహిత్యం 11 వ శతాబ్దినుండే కనిపిస్తుంది. అదీ లభించినంత వరకు అనే ఇక్కడ చెప్పేది. కనీసం ఆరవ శతాబ్దంనుండే లిఖిత పద్యసాహిత్యం కావ్యాలు ఉన్నట్లు శాసనస్థ ఆధారాలు చెబుతున్నాయి. తెలుగు భాష ప్రాచీనతను నిరూపించి కేంద్రప్రభుత్వ ప్రాచీన భాష హోదా పొందే ప్రయత్నంలో జరిగిన ఇటీవలి పరిశోధనలో ఇది బాగా తెలియవచ్చింది. అదే కాలంనుండి అంతకు ముందే కులపురాణ సాహిత్యం తెలుగులో అటు మౌఖిక సాహిత్యంలో ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.
కులపురాణం ప్రాచీనత గురించి విశేషించి అది గొంతు విప్పే సామాజిక అస్మితిని గురించి వివరంగా చర్చించవలసి ఉంది. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే విశ్వకర్మపురాణం సంస్కృతంలో ఉన్నట్లు మనకు శ్రీమాన్ కొండూరు వీర రాఘవాచార్యులవారి పరిశోధనలో తెలియవచ్చింది. వడ్డెపాటి నిరంజన శాస్త్రిగారు 1937లో ప్రచురించిన విశ్వకర్మబ్రాహ్మణ వంశాగమము అనే గ్రంథంలో వేదాలలో పంచఋషి సంప్రదాయం గురించి చాలా వివరంగా ఉంది. ఇందులో పంచగోత్ర ఋషుల గురించి వారు అనుసరించే అనుష్ఠానాల గురించి చాలా వివరంగా ఉంది. సప్తఋషి సంప్రదాయం గురించి మాత్రమే మాట్లాడే వర్గం వీరి గురించి మాట్లాడరు. కారణం వీరు విశ్వకర్మ కులానికి చెందుతారని విశ్వకర్మపురాణంలో విశ్వకర్మల ప్రాచీనతను సామాజికంగా ఉన్న ఔన్నత్యాన్ని గురించి మాట్లాడవలసి వస్తుందని అంగీకరించవలసి వస్తుందని ఒక భయం. ఒక సామాజిక వర్గం అస్మితిని వివరించే ఈ వేదప్రామాణ్యాన్ని కూడా వీరు అంగీకరించరు. ఇదే విశ్వకర్మపురాణం బ్రాహ్మణాధిక్యతని తిరస్కరించి ఐదు శ్రామిక వృత్తులు కళావృత్తుల కులాలవారి సామాజిక అస్మితిని తెలియజేస్తూ మౌఖిక మాధ్యమంలో ఆనాటి నుండీ వస్తూ ఉంది. దీన్ని దాదాపు 17 వశతాబ్దంలో వీపూరి వెంకటార్యుడు అనే కవి విశ్వకర్మపురాణం పేరుతో పద్యకావ్యంగా రాశాడు. మన సమాజంలో అంటరానితనం అనే ఘోర సామాజిక దురన్యాయానికి గురైన మాదిగ మాల కులాలకు కులపురాణంగా ఉంది జాంబ పురాణం. జాంబపురాణం అన్ని ఇతర కులాల అధిక్యతని నిరసిస్తూ మాదిగ కుల మూలపురుషుడు అయిన జాంబవంతుడు సృష్టికి ఆదిగా జన్మించి ఇతర దేవతల మానవుల సృష్టికి వారి చేతివృత్తుల కులాలకు వారి పనిముట్ల సృష్టికి కారణం అయ్యాడని చాలా విపులంగా వివరిస్తుంది. జాంబపురాణం మౌఖిక సాహిత్యం లో ఎప్పటినుండి వస్తున్నది అని ప్రత్యేకంగా ప్రశ్నించవలసిన అవసరమే లేదు. జాంబపురాణం తాళపత్ర రూపంలో కూడా డక్కలి వారి వద్ద, నులక చందయ్యల వద్ద కొన్ని శతాబ్దాలనుండే వస్తూ ఉంది. అసలు నిమ్నకులాల వారు తాళపత్రాలు తయారు చేస్తారని వాటిమీదకొన్ని శతాబ్దాలనాడే ఘంటంతో రాశారని మన ఉన్నత సామాజిక వర్గాల వారు ఇప్పటికీ నమ్మలేని నమ్మని నిజం. విశ్వకర్మ కులంవారే కాదు  దళితులలోనే అతిదళితులుగా భావించే నులక చందయ్యలలో, డక్కలి కులం వారిలో తాళపత్రాలు చేసి వాటిపైన గ్రంథ రచన చేయడం ఉంది అని శతాబ్దాలనాడే ఉంది అని ఈనాటి నాగరక సమాజం కళ్ళువిప్పి తెలుసుకోవాలి. కులపురాణం సామాజిక అస్మితిని ఎలా తెలియజేస్తుంది. ఎలా వాదిస్తుంది అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణని అతి క్లుప్తంగా ఇక్కడ చెప్పవలసి ఉంది. "ఒక ఊరిలో ఒక సాలె కులస్తుల ఇంట్లో పెళ్ళి అయింది. పెళ్ళి జరిగిన తర్వాత ఊరేగింపు తీసారు. ఊరేగింపులో పగటి దివిటీలు పచ్చ జెండాలు పట్టుకొని బజారులో పోతున్నారు. ఇలా పోయే ఊరేగింపును రాజుగారు ఆయన మహలులో ఉన్నతసౌధం కిటికీలలోనుండి చూశాడు. భటులను పిలిచి ఎవరా ఊరేగింపు ఏమా సంగతి అని అడిగాడు. భటులు వచ్చి సాలెవారి ఇంట్లో పెండ్లి అని చెప్పారు. ఆఁ కులంతక్కువ వారు అయిన సాలెవారికి ఇంత అహంకారమా. పగటి దివిటీలు పచ్చజెండాలు అనేవి అయితే రాజకుటుంబాల ఊరేగింపులోగాని దేవుళ్ల ఊరేగింపులో కాని ఉపయోగించాలి.  ఈ సాలెవారికి ఇంత ధైర్యమా వారిని పిలిపించండి అని ఆజ్ఞవేశాడు. వారు అఘమేఘాలమీద సాలె ఇంటి యజమానిని రమ్మని దండధారులు గద్దించారు. ఆ ఇంటి యజమాని భయపడ్డాడు అనుకున్నంతా జరిగిందని తన కులంవారు అందరితో సమావేశమై తన కులానికున్న హక్కును గురించి మాట్లాడుకున్నారు. చివరికి తమ వాదాన్ని వినిపించడానికి వారి కులగాయకుడు పౌరాణికుడు అయిన పురాణం కొండయ్య అనే అతన్ని రాజుగారివద్దకు పంపించారు. రాజు ఇంటి యజమాని రాకుండా నువ్వు వచ్చావేం అని ఉరిమాడు. మహారాజా తమకు మాహక్కు గురించివివరించడానికి పురాణకథ తెలిసిన నన్ను పంపారు అని చెప్పాడు వినయంగా. ఏమిటా హక్కు, పగటి దివిటీలు, పచ్చజెండాలు పట్టుకునే హక్కు రాజులకు దేవుళ్లకే ఉంది. మీకు లేదు దీనికి శిక్షఅనుభవించాలి అని గర్జించాడు రాజు. మహారాజా మీరు ఏ శిక్ష అయినా వేయండి కాని నేను మనవిచేసేది విన్నతర్వాత వేయండి అని అభ్యర్థించాడు. రాజు అంగీకరించాడు. మహారాజా నావిష్ణుఃపృథివీపతిః అని తమరు అంగీకరిస్తారు కదా అని అడిగాడు. దానికి రాజు అవును రాజు అంటే విష్ణుమూర్తి అవతారమే అని అన్నాడు గర్వంగా మీసంపై చెయి వేసి. మహారాజా సాలెలు తమకు బావమరదులు అవుతారు. అనిచెప్పాడు పురాణం కొండయ్య. రాజు గాండ్రించి, తల తీయిస్తాను జాగ్రత్త మేము మీకు బావమరదులం ఎలా అని అడిగాడు. మహారాజా మీరు విష్ణుమూర్తి, తమరి ఇంటి ఇల్లాలు లక్ష్మీ దేవి భార్గవులు ఇంట పుట్టిందని ఆయన ఆడబిడ్డ అని అంగీకరిస్తారు కదా అని అడిగాడు కొండయ్య. దానికి రాజు అవునని తల ఊపాడు. ఇక కొండయ్య ఇక భార్గవమహర్షే తమ వంశపురుషుడు అని అతని కుమారుడు మృకండుడు అని అతని కుమారుడు మార్కండేయుడు అని వీరంతా తమకులంవారు అని లక్ష్మీదేవి మాకూతురు కాబట్టి తమరు సాలె వారికి అల్లుడు అని మాకు బావల వరస  అవుతారని కాబట్టి సాలెవారికి ఆవిధంగా ఊరేగింపుతీసే హక్కు ఉందని వాదించాడు. రాజు పురాణం కొండయ్య పురాణపరిజ్ఞానానికి వాదనాపటిమకు ముగ్ధుడయ్యాడు. అతని వినయానికి సంతోషించి అవును మేము దీన్ని అంగీకరించాము వెళ్ళవచ్చు అని చెప్పాడు". ఇది కూనపులి వారు అనే సాలెల ఆశ్రితకులంవారు చెప్పే పద్మసాలెల కులపురాణంలో ఒక భాగం మాత్రమే. ఇందులో సాలె కులంవారి సామాజిక అస్మితిని ఔన్నత్యాన్ని స్థాపించి కులం తక్కువ అనే వాదాల్ని ఖండించడం జరిగింది. పద్మసాలె కులం ప్రాచీనతని వారి పవిత్రని వారి పనికున్న పవిత్రతను గురించి వాదిస్తుంది. సాలెల కులపురాణం. జాంబపురాణంలో కూడా సరిగ్గా ఇలాగే బ్రాహ్మడు మాదిగ వారికి ఇంటి అల్లుడు అని అరుంధతి మాదిగవారి ఆడపడుచు అని బ్రాహ్మణుని ఇల్లాలు అని జాంబపురాణం వాదిస్తుంది. దీనిలో ఉన్న గొంతు కూడా సామాజిక అస్మితిని తెలుపుతూ రెండు కులాలు మౌలికంగా ఒకటే అని చెప్పే ప్రయత్నమే చేస్తుంది. పైన చెప్పిన రెండు కులపురాణాలలో లాగే కొంత భిన్నత్వంతో అన్ని కులాలవారికీ కులపురాణాలు ఉన్నాయి. ఈ కులపురాణాలన్నీ కూడా ఆయా కులాల సామాజిక అస్మితిని గురించి అంటే ఈనాడు అనే సామాజిక అస్తిత్వాన్ని గురించే ఘోషిస్తూ ఉంటాయి. అంటే తొలి సామాజిక అస్మితి (లేదా అస్తిత్వ) సాహిత్యం కులపురాణాలే అని చెప్పాలి.  
కులపురాణాలన్నింటిలోని మౌలిక లక్షణాలను క్లుప్తంగా గమనిస్తే ఇవి కింది కులాల ప్రాచీనతను గురించి, వారి వృత్తి ప్రాధాన్యాన్ని గురించి, వృత్తి పనిముట్లుకు వృత్తికి ఉన్న పవిత్రతను గురించి, సమాజంలో ఆ కులాలకున్న ఉండవలసిన ఔన్నత్యం గురించి మాట్లాడతాయి వాదిస్తాయి. అంతేకాదు ఇతర కులాల ఆధిక్యతని ఖండిస్తాయి. ఈ మౌలిక లక్షణాలు అన్నీ అస్మితి సాహిత్యానికి కూడా మౌలిక లక్షణాలే అవుతాయి. లిఖిత సాహిత్యంలో కూడా చాలా కులాల వారి కులపురాణాలు 16 వశతాబ్దంనుండే దొరుకుతున్నాయని చెప్పడానికి చాలా చారిత్రక ఆధారాలు లభించాయి. సాలెల కులపురాణం పద్మపురాణం లేదా భావనర్షిపురాణం  16వ శతాబ్దంలోనే రాయబడింది ఇది ప్రాచ్యలిఖిత భాండాగారాలలో తాళపత్ర ప్రతి లభించింది. దేవాంగుల కులపురాణం దేవాంగ పురాణం కూడా పద్యకావ్యంగా ఉంది. కన్యకాపురాణం కూడా అతి ప్రాచీనమైనది లభించింది. ఇలా కులపురాణం మౌఖిక సాహిత్యంలో అతి ప్రాచీన కాలంనుండే ఉంది. లిఖిత సాహిత్యంలో కూడా సంస్కృతంలో రెండు వేల సంవత్సరాలనాడు తెలుగులో కూడా 16 వ శతాబ్దంనుండే లభిస్తుంది. అందువల్ల కులపురాణాలే తొలి అస్మితి (అస్తిత్వ) సాహిత్యం అని ఇక్కడ స్థాపించడం జరుగుతూ ఉంది.
నిమ్నకులాలుగా, అంటరాని కులాలుగా ఈసడించబడిన ఈకులాలు కులపురాణలని కలిగి ఉండి పై కులాల ఆధిక్యాన్ని నిరసిస్తూ తమ సామాజిక అస్తిత్వాన్ని నిలుపుకోవడమే కాదు, తమ కులాల పురాణాలను ప్రచారం చేసి తమ సామాజిక అస్మితిని నిలుపుకోవడానికి శతాబ్దాలనుండే గట్టి వ్యవస్థీకృతమైన ప్రయత్నం చేశాయి. కులపురాణాలను ప్రచారం చేయడానికి ఒక మంచిసామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అదే ఆశ్రితకుల వ్యవస్థ.  ఈకులాలన్నింటికి ఆశ్రిత కులాలు ఉండి కులపురాణాన్ని గానం చేయడం ప్రదర్శించడం దాన్నే వృత్తిగా జీవించడం ఒక పటిష్టమైన సాంఘిక వ్యవస్థ. ఈ ఆశ్రిత కులాలు దాదాపు అన్నికులాలకు ఉన్నాయి. వారు తమ దాతృకులం వారికి కులపురాణాన్ని ప్రదర్శించి వారి నుండే ఏడాది మేరలుపొందడం హక్కుగా కలిగి ఉన్నారు. అన్నికులాకన్నా ఎక్కువగా మాదిగవారికే ఆరు రకాల ఆశ్రిత కులాలవారు ఈ సేవలను అందిస్తూ మాదిగ కుల పురాణాన్ని ప్రదర్శించి ప్రచారం చేస్తున్నారు. వీరిలో డక్కలి, నులకచందయ్య, బైండ్ల, ఆసాది, గోసంగి, సంగడి, చిందు అనే కులగాయకులు ఈ పని చేస్తూన్నారు. అన్ని చేతి వృత్తుల వారికి ఈ విధమైన ఏర్పాటు ఉంది. చాకలి, మంగలి, కమ్మరి కులాలకు కూడా ఆశ్రితకులాలు వారి కులపురాణాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా కులపురాణమే తొలి సామాజికఅస్మితి సాహిత్యం సామాజికఅస్తిత్వ సాహిత్యం అని చెప్పవచ్చు.
అంతేకాదు ఉన్నత కులాల వారికి కూడా తమ సామాజిక అస్తిత్వాన్ని గురించి లేదా వారిని క్షత్రియ స్థానంలో స్థాపించుకోవడానికి కులపురాణం అవసరమైంది. రెడ్లకున్న కులపురాణం బసవలింగపురాణం, లేదా కుంటిమల్లారెడ్డి కథ. దీన్నిప్రచారం చేయడానికి పిచ్చుకుంట్లు అనే ఆశ్రిత కులం ఉంది. దీని ద్వారా రెడ్లు క్షత్రియులు అని వారి అస్మితిని నిరూపిస్తారు. నిత్య సత్యవ్రతుడని అనిచెప్పుకున్న నన్నయ్య తన మహాభారతం అవతారికలోనే అబద్ధం చెప్పాడు. కనీసం తను నిజం అనుకున్న అబద్ధాన్ని రచించాడు. రాజరాజ నరేంద్రుడు మహాభారత వంశానికి కురువంశానికి చెందినవాడు అని  చెప్పే ప్రయత్నం చేసి "హిమకరు దొట్టి పూరు భరతేశులు...." రాజనరేంద్రుని పూర్వికులు అనిపద్యం రాశాడు. ఈ విధంగా రాజనరేంద్రుని చంద్రవంశ క్షత్రియుడుగా స్థాపించే ప్రయత్నం చేశాడు నన్నయ్య. నిజానికి ఆంధ్రప్రదేశ్ ను లేదా తెలుగు నేలను పరిపాలించిన వారిలో క్షత్రియ వంశాలులేవని చరిత్రకారులు వివరించి మరీ చెబుతారు.  వెయ్యి సంవత్సరాల క్రితం నాటి రాజనరేంద్రుని కనీసం నాలుగు వేలనుండి ఐదు వేల సంవత్సరాలనాటి వారుగా భావించే కురువంశానికి చెందినవాడుగా చెప్పడం అద్భుతమైన పురాణ కథా కల్పన. రాజుల వద్ద ఉన్న "కులబ్రాహ్మణులు", ఆస్థాన కవులు అయిన అందరూ చేసిన పని వారివారి రాజులను క్షత్రియులుగా చంద్రవంశానికో సూర్య వంశానికో ముడిపెట్టే ప్రయత్నమే. ఈ రకంగా ఇదంతా సామాజిక అస్తిత్వాన్ని లేదా అస్మితిని వారికి కొత్తగా ఏర్పాటు చేసే ప్రయత్నమే, అస్మితి సాహిత్యమే. ఇలా కులపురాణాలు తిరుగులేని బలమైన సామాజికఅస్మితి సాహిత్యం అని అంతే కాదు కులపురాణాలే తొలి సామాజిక అస్మితి (అస్తిత్వ) సాహిత్యం అని గట్టిగా చెప్పవచ్చు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

Friday, April 20, 2012


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
psubbachary@gmail.com
దళితుల ఆహారం చర్చనీయాంశమా?
(ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉదంతం నేపథ్యంలో...)
రాముడు లేడి మాంసం తిన్నాడు అనే అంశాన్ని తిక్కనగారు తన నిర్వచనోత్తర రామాయణంలో రాకుండా అనువాదం చేసాడని ఒక చాలా పెద్ద పరిశోధకుడు చాలా సంవత్సరాల క్రితం ఎత్తి చూపాడు. దీనికి కారణం తిక్కన శాకాహారి కావడమేననీ ఆ పరిశోధకుడు తీర్మానించాడు కూడా. తను అత్యంతం భక్తితో సేవించే శివుని విగ్రహానికి తిన్నడు మాంసాన్ని నివేదిస్తే శివుడు చాలా సంతోషించాడు అని చెప్పే కావ్యం జగత్ప్రసిద్ధమే. గ్రామదేవతలకు గ్రామీణులు తాము తినే ఆహారమైన మేకలు గొర్రెలు కోళ్లను సమర్పించుకోవడం చాలామామూలుగా వస్తున్న విషయం. ఇవేవీ చర్చనీయాంశాలు కావు. ఈ నాటి సమాజంలో అభ్యంతరకరమైన విషయాలూ కావు. ఆంధ్రప్రదేశ్ లో కాని ఇతర రాష్ట్రాలలో కాని దళితులు గొడ్డు మాంసం (ఆవు ఎద్దు దున్న బర్రె) తింటారు. అసలు దళితులు చరిత్ర క్రమంలో అంటరానివారు కావడానికి ఇదే కారణమైందనే సాంఘిక సిద్ధాంతం కూడా సమాజ శాస్త్రంలో ఒకటుంది. కాని ఇటీవలి కాలంలో దళితుల ఆహారం బాగా చర్చనీయాంశంగా మారుతూ వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉదంతం అకస్మాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక చాలా సైద్ధాంతిక పరమైన ఆలోచనతో ఒక హక్కును చాటుకోవడానికి చేసిన దళిత ప్రయత్నంగా ఇది కనిపిస్తూ ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి దళిత విద్యార్థులు, మరికొందరూ ప్రయత్నించడం దాన్ని మరొక వర్గం విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది. పెద్ద హింసాకాండే జరిగింది. ఉస్మానియా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇది తొలిసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో శనివారం ఆదివారం చికెన్, మటన్ అంటే కోడిమాంసం మేక గొర్రె మాంసాలను ఆహారంలో ఇవ్వడం ఉంది. (నేను 1980 నుండి 1987 దాకా ఉస్మానియా హాస్టళ్ళలో ఉన్నాను. విద్యార్థిగా నాకు బాగా తెలిసిన విషయం ఇది). దళిత విద్యార్థులు ఆరోజుల్లోనే మేము తినే మాంసం కూడా పెడితే బాగుంటుంది కదా అనే వాదన చాలా గుంభనంగా చేసే వారు. దాన్ని వారు పైకి గట్టిగా అనడానికి కూడా బాధపడే వారు. దాన్ని వారే చిన్నతనంగా భావించే రోజులు అవి. కాని సామాజిక అస్తిత్వ ఉద్యమం పెరిగిన తర్వాత దళితులు తమ సమాజపు సాంఘిక జీవన విధానాన్ని పూర్తిగా ఎసర్ట్ చేసుకుంటున్నారు(తమజీవితాన్ని తమ ఇష్టం ప్రకారం గడపాలనే భావన).  ఈనాడు దళితుల తమ ఆహారపు అలవాట్లను తమ హక్కుగా బహిరంగంగా చెప్పి తమ జీవన శైలిపై ఆహారపు అలవాట్లపై సమాజంలోని ఇతర వర్గాలు ఆంక్షలు పెట్టడానికి వీలు లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయపు భీఫ్ ఫెస్టివల్ ని అర్థం చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో భీఫ్ ను కూడా హాస్టళ్ళలో విద్యార్థులకు ఇస్తున్నట్లు తెలియవచ్చింది. 
గొడ్డు మాంసంతినడం అనే విషయం శతాబ్దాలుగా చర్చనీయాంశంగానే ఉంది. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఒక శిక్ష ఉండేది. అదేమంటే గ్రామంలోని ఉన్నత కులానికి చెందిన వారు ఎవరైనా దళితుల అమ్మాయిని కాని స్త్రీలను కాని చెరిపినప్పుడు ఆ వ్యక్తి వారికి పట్టుబడితే అతడిని గూడెం లోనికి తీసుకుపోయి గుంజకు కాని చెట్టుకు కాని కట్టేసి అతని నోట్లో గొడ్డు మాంసం ముక్కను పెట్టి తర్వాత వదిలి పెట్టే వారు. దీని అర్థం అతను మాదిగ మాలలతో సమానుడైనాడని చెప్పడం అతడిని అపవిత్రుడుగా చేయడంగా భావించేవారు. నా బాల్యంలో కూడా మా గ్రామంలో ఇది జరిగినట్లు చెప్పుకునేవారు. దళితుల మహాభారతం అయిన జాంబపురాణంలో ఆదిజాంబవుని వంశంవారు, చెన్నయ్య అతని వారసులు అంటరానివారుగా మారే శాపం తగలడానికి ఆవు మాంసం తినడమేనని చెప్పే ఉదంతం ఉంది. దీన్ని బట్టి గొడ్డు మాంసం తినడం అనేది ఈ సంస్కృతిలో హీనమైనదిగా పరిగణింపబడి అది దళితులకు శాపమైనది అని చేసే వాదనలకు బలం దొరికింది. కాని నేటి దళితుల వాదన తమ సామాజిక హక్కును గురించి తమ జీవన శైలిని తాము అనుకున్న విధంగా నడుపుకోవడానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కు గురించి. తమ ఆహారాన్ని తాము తినడానికి మరొక సామాజిక వర్గం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని అన్నికులాల వారికి ఆహారం అందించే పబ్లిక్ సంస్థలలో అందరి ఆహారం అందించడం తమకు సిద్ధమైన హక్కు అని వారు భావిస్తున్నారు. వాదిస్తున్నారు. ఇది చాలా న్యాయబద్ధమైన రాజ్యాంగ బద్ధమైన ఆలోచనగానే ఉంది.
కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం పరిపాలించే రోజుల్లో గోవధ నిషేధం గురించి చర్చ జరిగే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చౌకధరలో తమకు మంచి ఆహారం (ప్రొటీన్ రిచ్ ఫుడ్) దొరికే మార్గం ఇదే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.  బహు సంస్కృతుల ప్రజలు నివసించే విశాల మైన దేశంలో ఇలాంటి భేదాభిప్రాయాల రావడం చాలా సహజం. అది ఆయా ప్రజల సహజ హక్కులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు సంబంధించిన విషయం.
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు కూడా జంతు బలిని నిషేధించాయి. జంతుబలి చేసిన వారిని అరెస్టు చేయవచ్చు శిక్షించవచ్చు. కాని ఇది మతరమైన అంశం అందుకే పోలీసులు చూసీ చూడనట్లు ఊరుకుంటారు. ఆది వారం వస్తే గంగమ్మ గుడులలో కనీసం వందకు తగ్గ కుండా మేకలు గొర్రెలు బలి అవుతాయి ఒక్క కుప్పం పట్టణంలోనే. ఇది వారు తినే ఆహారాన్ని వారు తమ దేవతకు అర్పిస్తున్నారు. కాని ఇతర మతాలలో ఉన్న జంతుబలిని ఏ ప్రభుత్వం నిషేధించలేకపోయింది. ఇది చాలా చర్చనీయాంశం. ఒక మతానికి చెందిన ఆరాధనలలోనే జంతుబలిని నిషేధించడం పట్ల చాలా ప్రశ్నలు ఉన్నాయి.
కాని ఇక్కడ ఇంకా మౌలికమైన చర్చ అవసరం. మానవుడు పుట్టుకతో మాంసాహారా లేక శాకాహారా అనే (హెర్బిఓరస్ లేక కార్నిఓరస్) అనే శాస్త్రీయ చర్చ అలాగే ఉంది. కాని ఈ రోజున ఈ భూమండలంలోని అన్ని దేశాలలోను జరిగే చర్చ అన్ని జంతువులకు అన్ని పక్షులకు ప్రాణులకు జీవించే హక్కు ఉంది అని చెప్పడమే. మనిషిని మరొకరు బలి ఇచ్చి కోసుకొని తింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే బాగుంటుందని అలాగే అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని ఈనాడు మనిషి ఆలోచించి వాదిస్తున్నాడు. ఏ జంతువునీ చంపే హక్కు మనిషికి లేదు.
అడవి జంతువులను వేటాడి చంపడం నేరం అని చెప్పి నిషేధించిన ప్రభుత్వం ఇంటి జంతువులైన కోళ్ళు మేకలు, గొర్రెలను చంపడాన్ని నిషేధించలేదు. మున్సిపాలిటీలలో ఇంతకు ముందు కుక్కలను పట్టుకుపోయి కరెంటు పెట్టి చంపేసే వారు. జీవకారుణ్య సంఘాల వారి కృషి ఫలితంగా వాటిని చంపడం ఆగిపోయి వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు  చేసే ప్రక్రియ అమలులోనికి వచ్చింది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. కాని ఈ జీవ కారుణ్య సంఘాల వారు బ్లూక్రాస్ వగైరా వగైరా పేర్లతో దేశవ్యాప్తంగా ఉన్న జీవ కారుణ్య సంఘాల వారు జంతుబలిని కాదు జంతు వధని నిషేధించమని కోరరు ఎందుకని? అసలు మొత్తం మాంసాహారాన్ని నిషేధిస్తే జంతు వధ అనేది ఉండదు. ఈనాడు మానవుడికున్న అవగాహన ప్రకారం ప్రతి జంతువుకూ బ్రతికే హక్కు సహజంగా ఉంది అని అంగీకరించినప్పుడు ఏజంతువునూ చంపి తినే హక్కు ఏ మనిషికీ లేదు. ఇలా ఆలోచించినప్పుడు నిషేధించవలసింది జంతు బలిని కాదు, జంతువధను. హిందువులకు పవిత్రమైనదిగా భావించే గోవును మాత్రమే వధించడం నిషేధించాలి అని అనడం సరికాదు. అసలు మొత్తం ఏ జంతువునూ కోడి మేకలు సహితం చంపకూడదు అలా చంపే హక్కు మనిషికి లేదు అని నిషేధించడం చాల అవసరం. ఇదే సహజ న్యాయం కూడా. (ఈ వ్యాసకర్త బ్రాహ్మణేతరుడైన సంపూర్ణ శాకాహారి). అంతే కాని కొన్ని జంతువులను చంపి తినడం సరైనదే, కొన్నిజంతువులను చంపితినడం న్యాయం కాదు అని వాదించడం రాజ్యాంగ బద్ధమైన సమన్యాయానికి విరుద్ధం అవుతుంది. దళితులు తినే ఆహారం ద్వారా వారి సామాజిక స్థితిని కొలవడం సమన్యాయవిరుద్ధమైన చర్య. భారత దేశంలో అన్ని వర్ణాలలోను మాంసాహారం ఉందని చెప్పే చారిత్రక ఉదంతాలు ఉన్నాయి. వేదకాలంలోని జంతుబలి మాంసాహారభక్షణాన్ని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఒరిస్సా, బెంగాలులోని అన్నివర్ణాల వారు అన్ని మాంసాలను తింటారు. ఈనాడు మనిషి ఆలోచించే సమన్యాయ సిద్ధాంతం ప్రకారం అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. దేన్నీ చంపే హక్కు మనిషికి లేదు. ప్రభుత్వాలు మొత్తం జంతువధని అంటే మాంసాహారాన్ని నిషేధించే దిశగా అడుగులు వేసి అన్ని ప్రాణుల్ని చంపడాన్ని నిషేధించాలి. అంత దాకా ఒక సామాజిక వర్గానికి చెందిన ఆహారాన్ని అనుమతిస్తూ మరొక వర్గానికి చెందిన ఆహారాన్ని అంటే వారి  జంతువధని ప్రశ్నించే వీలు లేదు. దళితుల  ఆహారం అప్పటిదాకా చర్చనీయాంశం కారాదు. అందరి హక్కులతో వారికీ ఉన్న హక్కు. మనకు కావలసిఉంది సంపూర్ణ జంతువధ నిషేధం. నిజానికి మనిషికన్నా క్రూర జంతువు ఉన్నాడా అనేది జంతువుల మూగ వేదనలలో నుండి పారే రక్తంలోనుండి వస్తున్న ప్రశ్న. 

Tuesday, April 10, 2012


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

మన దేవుళ్ళకు తెలుగు రాదా?
(వ్యావహారికభాషా మార్గదర్శి గురజాడ 150 జయంతి సంవత్సరం పురస్కరించుకొని భాషోద్యమవ్యాసం).

మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలియదు.  తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మాత్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటూంఛారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్కచ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచారకులు వంటి అథమ పాత్రలు, స్త్రీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించబడిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి. ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్త్రీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనారీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మనకు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చుకుంటాడు. తన సామాజిక అవసరాలకు ఏ భాష అవసరమో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీవితపు అవసరాలకు తన భాషే వినియోగపడాలని ప్రతి భాషీయుడు కోరుకుంటాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భానికి అవసరమైన భాషలో పని చేసుకోవలసి ఉంటుంది.
ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామాజిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు.  ప్రతి సంస్కృతిలో జానపదులలో గిరిజనతెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచారమంతుడు అని, ముజావర్ అని పాస్టర్ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సంస్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.  
ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవులు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటికి రిచ్యువల్ లాంగ్వేజస్ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్ర్యం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు. లైఫ్ సైకిల్ రిచ్యువల్స్ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టినప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించవలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాలలోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలుగు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్యక్రమాలలోను పూజారి చదివే మంత్రాలు పూజలు  అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి. 
దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, ధూపదీపమాఘ్రాపయామి  అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువుతాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయంచే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్ గృహే పత్నీ సహితం అని వగైరా మన  ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.  ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.
అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అని పిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిది మందికి అర్థం కాదు. కట్టించుకునే పెండ్లి కూతురుకీ అర్థం కాదు చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ  అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యాన్ని కడుతున్నాను అని చక్కగా తెలుగులో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలుగులో చేస్తే చాలా హాయిగా ఉండదా. కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థం కాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మంత్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారి గారు సెలవిచ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించుకునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రాలు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగుతుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని మా పెద్దవాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడుకు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుంది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బారావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని ఈ పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు. చాలా గ్రామ దేవత గుడులలో పేరంటాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు దళితులు పూజారులుగా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటిలో తెలుగులోనే పూజా కార్యక్రమాలు జరగడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవతల గుడులలో రజకులు, క్షురక వృత్తి వారు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ముల వాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూజలు చేసే గుడులు జాతరలు కొన్ని ఉన్నాయి వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుండా చదవడం కూడా ఉంది. దీన్ని బట్టి పవిత్ర కార్యక్రమాలు అన్నీ తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.
చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉంది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పైగా ఉన్న తెలుగు వారు అటు గుడులలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలోను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎందుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మన దేవునికోసం మనమే చేసే పూజకు మధ్యవర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవడం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించినవి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలు లేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్నవేసుకుంటే రాదు అని చెప్పగలిగే తెలుగు వారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మత కార్యాలకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసుకుందాం. ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ టార్గెట్ గా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. పెండ్లిలోను అందరికీ అర్థమయ్యే తెలుగులో ప్రమాణం చేస్తారు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైనదాన్ని అభివృద్ధి పరచారు. వారి మతప్రచారకులకు మామూలు అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఇక్కడ కూడా ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఇంకా ఇలాంటి చాలా సంఘటనలు రుజువు చేస్తాయి. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దానికోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.
పులికొండ సుబ్బాచారి 

Wednesday, April 4, 2012

మిత్రులారా
నేను మా విశ్వవిద్యాలయంలోని మా జానపదవిజ్ఞాన శాఖనుండి తెలుగు జానపద కథలలో అంతర్గతంగా ఉన్న వివిధ సామాజిక వర్గాల వారి మనోభావాలు సామాజిక నిరసన ఎలా ఉంటుంది అనే అంశంపైన యుజిసి వారి మేజర్ రిసెర్చి ప్రాజెక్టుకోసం పరిశోధన చేస్తున్నాను. ప్రస్తుతం వివిధ జిల్లాలనుండి కథలను సేకరిస్తున్నాను. రాయలసీమ జిల్లాలలో కొన్ని సర్కారు జిల్లాలలో కొన్నింటి నుండి కథలు సేకరించాను. ఇక తెలంగాణా జిల్లాలలో నుండి కొన్నింటిని సేకరించవలసి ఉంది. 
తెలుగు వారందరికీ చేసే మనవి ఏమంటే మీకు తెలిసిన జానపద కథలు ఏమైనా ఉంటే పంపండి వాటిని పరిశోధనలో విశ్లేషణకు చేరుస్తాను. వాటిని ఇచ్చిన వారి పేరు పైన ప్రచురిస్తాను. ఈ ఆలోచనను నలుగురితో పంచుకుంటే నేను మరింత కృతజ్ఞుడిని 
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.