Saturday, April 27, 2013

my article on annmayya song


పులికొండ సుబ్బాచారి

అన్నమయ్య పాట మాధ్యమం, నిర్మాణం
పాట అనే సంగీత సాహిత్య  ప్రక్రియ భాష సంస్థితి పొందుతున్న పొందిన అతి ప్రాచీన కాలంలోనే రూపొంది అతి పాతదైన మానవనిర్మిత కళారూపం, సాహిత్య రూపం. అప్పటికి సాహిత్యం లిఖితం మౌఖికం అనే వింగడింపు పొందలేదు. కారణం అప్పటికి ఉన్నది మనిషి నోటిద్వారానే సాహిత్యం మొత్తాన్ని సృష్టించుకునే విధం మాత్రమే. దానికి కొన్ని లేఖన చిహ్నాలను ఏర్పరచుకొని రాయడం నేర్చుకొని తన సాహిత్యానికి చూడడానికి వీలైన ఒక దృశ్యాత్మక స్థిరరూపాన్ని  ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే లిపి.  అందుకే లేఖనం లేదా రాయడం అనేది ఆతర్వాత చాలా కాలానికి జరిగిన సాంకేతిక విధానం సాహిత్యానికి ఒక సహాయం మాత్రమే. సాహిత్యం అన్నది అందునా పాట అన్నది ఒక మానవ అంతః సృజనం ఒక బౌద్ధిక, హార్దిక చర్య దానికి బాహ్య స్వరూపమే లిపి అంటే సాహిత్యానికి ఏర్పడిన లేఖన రూపం.  ఇక్కడే ఒక చారిత్రక సత్యాన్ని ప్రస్తావించాలి. మానవుడు బాగా బుద్ధిజీవుడై మాట్లాడ గలిగిన దశ ఏర్పడి 30,000 ముప్పై వేలనుండి 50,000 ఏభై వేల సంవత్సరాల నాడు అని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. మనిషినే హోమోసాపియన్ అని అంటారు.  కాని మనిషి లిపిని సృష్టించుకొని దాన్ని సాహిత్య లేఖనానికి వినియోగించుకోవడం ప్రారంభించింది కేవలం 6,000 ఆరు వేల సంవత్సరాల క్రితమే అని కూడా వివిధ చారిత్రక అధ్యయనాలలో తెలిసింది.[1] అలా పాట లిపికన్నా చాలా ప్రాచీనమైనది.  అంటే మౌలికంగా నోటి సాహిత్యానికి చెందింది నోటినుండి నోటికి జారుతూ ప్రవహించే పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ.
 అన్నమయ్య జీవించి సాహిత్యాన్ని సృష్టించిన కాలం 1408 నుండి 1503 మధ్య అంటే దాదాపు పదిహేనో శతాబ్ది మొత్తం ఉన్నాడు.     కాలానికి సాహిత్యం లిఖిత రూపంలో కూడా బాగా స్థిరపడింది. పరివర్థితమైన ఛందస్సులు ఏర్పడడం వాటిలో ప్రౌఢమైన కావ్యాలు వెలయడం చాలా కాలం క్రితమే జరిగింది. అయినా అన్నమయ్య కాలానికి లిఖితంగా ఉండే సాహిత్యం తాళపత్రాలకు, శాసనాలకు రాగిరేకులకు పరిమితం అయింది. ఆధునిక కాలాన వచ్చిన కాగితం కాని సాహిత్యాన్ని సామాన్య మానవులు అందరికీ చేరేలా చేయగలిగే ఇతర సాంకేతిక మాధ్యమం కాని లేదు. సామాన్య మానవుల వరకు చేరగలిగే సాహిత్యం అప్పటికీ మౌఖిక సాహిత్య రూపం మాత్రమే అంటే అందరికీ చేరగలిగేది మౌఖికంగా ఉన్న పాట, ప్రదర్శనకు వీలయిన నాటకం, నోటినుండి నోటికి చేరగలిగిన కథ మాత్రమే. ఉన్నత విద్యావంతులైన కవులు పండితులకు అందుబాటులో ఉండే తాళపత్రాల పైన రాయడం లేదా రాగిరేకుల మీద రాయడం వాటిని వాడుకొని చదవడం  అనేది అప్పటికి బాగా ఉన్నత వర్గాలకు అతి చిన్న సంఖ్యలో ఉన్న విద్యావంతులైన శ్రేణికి మాత్రమే అందుబాటులో ఉండే సాంకేతిక సౌకర్యం. స్థితిలో అన్నమయ్య తను నమ్మిన దైవాన్ని గురించి వైష్ణవ మతాన్ని గురించి జనసామాన్యంలో జనబాహుళ్యంలో బాగా విస్తృతంగా ప్రచారం చేయడానికి తలపెట్టాడు. అందుకు బాగా వినియోగపడుతుంది అని ఆయన భావించిన మాధ్యమం పాట. పాటే జనానికి బాగా చేరగలిగిన మంచి మాధ్యమంగా మంచి ఆయుధంగా గ్రహించి అత్యంత ప్రతిభావంతంగా దాన్ని వాడుకొని తన భావాల్ని జనం దగ్గరికి చేర్చగలిగాడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
అన్నమయ్య పండిత కుటుంబంలో విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రితాతలు సంప్రదాయ సాహిత్యానికి లేఖన సాహిత్య సంప్రదాయానికి చెందిన వారే, వేద పండితులే. ఆనాటికి బాగా విస్తృతంగా ఆమోదించిన ప్రక్రియ కులీన వర్గంలో బాగా విస్తృతంగా ఉన్న ప్రక్రియ ఉన్నత వర్గానికి చెందిన ప్రక్రియ కావ్యం లేదా ప్రబంధం. ఇవి చంపూ సాహిత్య మార్గాలు. అంటే సంస్కృత ఛందస్సులతో నిండిన పూర్తిగా లిఖిత సాహిత్యానికి చెందే స్థిరపాఠ్యప్రక్రియ[2] అయిన కావ్యం  ఆనాడు ఉన్నత వర్గం మధ్య తిరుగాడే సాహిత్య ప్రక్రియ. సంస్కృతాంధ్రాలలో ఇతర దేశ భాషలలో బాగా నిష్ణాతుడైన అన్నమయ్య ఉన్నత వర్గానికి పరిమితం అయ్యే కావ్య ప్రబంధ ప్రక్రియలను కాని లిఖిత మాధ్యమానికి చెందిన నాటక ప్రక్రియను కాని గ్రహించకుండా పాటను ఎన్నుకొనడం, ఆయన సంస్కృతంలో కాని గ్రాంథికమైన క్లిష్టమైన ప్రౌఢమైన తెలుగు భాషలో ప్రబంధాలను కానీ రాయడం చేతగాక కాదు. తన లక్ష్యాన్ని చేరడానికి అవి పనికిరావని జనాన్ని చేరడానికి వినియోగపడవని గ్రహించడం వల్లనే. పాటే తన వైష్ణవ భక్తి ప్రచారానికి తగిన మాధ్యమం అని నిర్ణయించుకున్న తర్వాతనే పాటలోనే తన భావాలన్నింటిని రచించాడు. అంటే జనం మధ్య పాడుకున్నాడు. అందరూ పాడడానికి దోహదపడ్డాడు. తాళ్ళపాక చిన్నతిరుమలాచార్యుడు అంటే ఆయన మనుమడు అన్నమయ్య విగ్రహాన్ని తొలుతగా చేయించాడు.[3] విగ్రహాన్ని చూస్తే అందులో అన్నమయ్య చేతికి దండె మాత్రమే కాకుండా ఆయన కాళ్ళకు గజ్జెలు కూడా కనిపిస్తాయి. అంటే దీనితో తెలిసేదేమంటే దండెను మీటుతూ దానితో తన పాటకు శృతిని మేళవించుకొని పాటకు అనుగుణంగా నాట్యం చేస్తూ జనం మధ్య ఆటతో పాటను కలిపి ప్రదర్శించాడని తెలుస్తూ ఉంది.[4]
జనం మధ్యలో జన సాహిత్యంగా ఉన్న పాటను తన మాధ్యమంగా గ్రహించాడు అన్నమయ్య. దీని ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని కూడా సృష్టించాడు. పాట కొత్త ఒరవడి కాదు. అంతే కాదు దేశి సాహిత్య ప్రక్రియలను వాడుకోవడం కూడా కొత్త ఒరవడి కాదు. కాని తన జీవితంలో మొత్తం సాగించిన సాహిత్య యాత్రలో పాటనే ప్రధాన సాహిత్య ప్రక్రియగా ఎన్నుకోవడమే అప్పటికి చాలా విశేషం.  జానపద సాహిత్యంలో లభించే కథలను వాడుకోవడం జనానికి బాగా దగ్గరికి వెళ్లగలిగే పాటకు బాగా దగ్గరిగా ఉండి పాడుకోవడానికి అనువుగా ఉండే ద్విపద ఛందాన్ని వాడుకోవడం అన్నది పదమూడో శతాబ్ది నాటికే పాలుకురికి సోమనాథుడు వంటి శివకవులు చేశారు. నిజానికి తాళ్ళపాక కవులు పెదతిరుమలాచార్యుడు, చినతిరుమలా చార్యులు తిరువెంగళనాథుడు, క్రమంలోని  అందరూ ద్విపద ఛందంలో రచనలు చేశారు. ఆనాటి వారే అయిన వెంగమాంబ వంటి ఇతర కవులుకూడా ద్విపద ఛందాన్ని వాహికగా చేసుకున్నారు. అయినా తాళ్ళపాక కవులు బాగా ఆధారపడిన సాహిత్య వాహిక, ప్రక్రియ పాటే. దీన్ని పదం అని వారు అన్నా, లేదా సంకీర్తన అని అన్నా అది మౌలికంగా, మౌఖికంగా వ్యాప్తిలోనికి వచ్చిన పాటే.
దృష్ట్యా చూచినప్పుడు జానపద సాహిత్యంగా ఉన్న అంటే మౌఖిక సాహిత్య రూపంలో ఉన్న పాటను తీసుకొని జానపద ప్రక్రియను వినియోగించుకొని వైష్ణవ మత సిద్ధాంతాన్ని, వేంకటాద్రీశుని పైని భక్తిని ప్రచారాన్ని చేయడానికి పూనుకున్నాడు అన్నమయ్య. ఇలా జానపద గేయాన్ని అంటే జానపద సాహిత్యాన్ని మరొక లక్ష్యం కోసం వాడుకొని తొలినాటి అనువర్తిత జానపద సాహిత్యాన్ని (Applied folk literature) ని సృష్టించిన వాడుగా అన్నమయ్య నిలబడుతున్నాడు. అన్నమయ్య పాటను తనదైన పద్ధతిలో రాయడమే కాదు అంటే పాడడమే కాదు. తన కాలానికి బాగా వ్యాప్తిలో  ఉన్న జానపద ఫణితులను అంటే పాటల వరుసలు చందమామా, జాజర, ఓలచ్చ గుమ్మడి వంటి వారాను వర్తానాలున్న ప్రత్యక్ష జానపద బాణీలను కూడా గ్రహించి పాటలు కట్టాడు. కాబట్టి తొలి నాటి అనువర్తిత జానపద గేయాలుగా అంటే అప్లైడ్ ఫోక్ సాంగ్స్ గా అన్నమయ్య పాటల్ని చెప్పాలి.[5] అంతే కాదు ఆయన తన పాట పాడుకోవడానికే అని భావించాడు. తను పాడిన పాటలు మరింత నమ్మకంగా వచ్చే తరాలకు చేరాలనే ఉద్దేశంతో పాటల్ని రాగి రేకుల మీద పాఠ్యాన్ని స్థిరంగా ఉంచాలనే ఆలోచన చేసి పని ప్రారంభించింది అన్నమయ్య అయినా, ఆయన పాటల్ని అన్నింటిని అంటే 32 వేల సంకీర్తనల్ని రాగిరేకులమీద చెక్కించింది ఆయన కుమారులు మనుమలు. సాళువ నరసింహరాయల వెన్నుదన్ను ద్వారా తర్వాతి ఏలికల ద్వారా వారు పని చేయించారు. అయినా అన్నమయ్య పాటలు తాళపత్ర రూపంలో ఉండి చదువుకోవడానికి అంటే పాఠకులకు ఉద్దేశించి సృష్టించినవి కావు. అవి పాడుకోవడానికి చేసిన నోటి సాహిత్య రూపాలు పాడుకునే పాటలే. అలా అన్నమయ్య మౌలికంగా నోటి సాహిత్య ప్రక్రియకు లేదా మౌఖిక సాహిత్య ప్రక్రియకు చెందిన కవి.   అన్నమయ్య సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం. ఒక లిఖిత సాహిత్య సంప్రదాయానికి చెందిన వాడు కులీన వర్గానికి చెందినవాడు పండితుడు అయి ఉండి మౌఖిక సాహిత్య మాధ్యమాన్ని ఎన్నుకుని జీవితాంతం పాడుతూ జీవితాన్ని పాటలా గడిపిన సాహిత్యకారుడు అన్నమయ్య. అతని పాట, సాహిత్య మాధ్యమం మౌఖిక సాహిత్య మాధ్యమం.
అన్నమయ్య ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానాన్ని పొందాడు. దీనికి కారణాలు ముఖ్యమైన వాటిని ఇక్కడ చెప్పాలి. ఆయన తన పదహారో ఏటనే పదాలు కట్టడం అంటే పాటలు కట్టి పాడడం మొదలు పెట్టానని స్పష్టంగా చెప్పాడు. దీనికి గట్టి చారిత్రక ఆధారాన్ని ఆయనే ఇచ్చాడు. రాగిరేకు మీద ఆయన స్వయంగా రాయించిన విషయం ఇక్కడ ఉంది. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు 1346 (1424) అగు నేఁటి క్రోధి సంవత్సరమందు, తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించి పదహారు యేండ్లకు తిరువేంగళనాథుండు (వేంకటేశ్వరస్వామి) ప్రత్యకక్షమైతేను, అది మొదలుగాను శాలివాహన శకవరుషంబులు 1426  అగు నేటి దుందుభి సంవత్సర పాల్గుణ . 12 నిరుధానకు తిరువేంగళనాథుని మీదను అంకితముగాను తాళ్ళపాక అన్నమాచార్యులు విన్నపము చేసిన అధ్యాత్మ సంకీర్తనలు  అని రాగి రేకు ఆరంభంలో స్పష్టంగా ఉంది.[6] అన్నమాచార్యులు క్రీ.. మేనెల 9 తేదీ 1408లో పుట్టి ఫిబ్రవరి 23, 1503లో పరమపదం చెందినట్లు చెప్పడానికి తిరుగులేని చారిత్రక ఆధారాలున్నాయి. పైన చెప్పిన రాగిరేకే ఇందుకు బలమైన సాక్ష్యం. ఆయన 95 సంవత్సరాలు జీవించాడు. అంటే పదహారవ యేట సంకీర్తనలు అంటే పాటలు కట్టడం ప్రారంభించిన అన్నమయ్య మరణించిన దాకా అంటే దాదాపు ఎనభై సంవత్సరాల పాటు పాటలు నిర్విరామంగా రాసాడు. అంటే 29,200 రోజులు పాటలు రాసాడు. ఆయన 36 వేల సంకీర్తను రాసినట్లు కూడా తిరుగు లేని చారిత్రక ఆధారాలున్నాయి. కాని మనకి ఇప్పటికి దొరికినవి 12 వేలు మాత్రమే. అన్నమయ్య పాట ఒక దానిలో ఒక పల్లవి మూడు చరణాలు ఉంటాయి. పల్లవికి రెండు పంక్తులు చరణానికి నాలుగు పంక్తులు ఉంటాయి. అంటే మొత్తం 14 పంక్తులలో పాట పూర్తి అవుతుంది. కొన్ని పాటలు తక్కువ పంక్తులతో ఉన్నా మరికొన్ని ఎక్కువ గా ఉన్నా దాదాపు 95 శాతం పాటలు 14 పంక్తులతోనే ఉన్నాయి.
దీన్ని బట్టి అన్నమయ్య సృష్టించిన సంకీర్తనలు లేదా పాటలు 32 వేలలో మొత్తం 4,48,000 వేలు అక్షరాలా నాలుగు లక్షలా నలబై ఎనిమిది వేల పంక్తులు రచించాడు. ఒక కవి ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించడం మరెక్కడా జరిగినట్లు సమాచారం లేదు. ప్రపంచంలోనే మొదటిది క్రీ.పూర్వం ఏడవ శతాబ్దానికి చెందినదిగా భావించడబడే ఇలియడ్ అనే హోమర్ కవి కృతిగా చెప్పే ఇతిహాసంలో ఉన్నది 15,693 పంక్తులు మాత్రమే. ఇక భారతీయ ప్రాచీన ఇతిహాసం మహాభారతం జయ అనే 25,000 శ్లోకాల స్థితినుండి అది మహాభారతం అనే లక్ష శ్లోకాల విస్తృతి చెందింది. అంటే రెండు లక్షల పంక్తుల పరిమాణంలో మాత్రమే ఉంది. సంప్రదాయికంగా మహాభారతం వ్యాసకృతం అనిచెప్పినా ఎందరో అజ్ఞాత వ్యక్తులు 25 వేలనుండి లక్ష శ్లోకాలకు పెరిగే క్రమంలో కవులుగా దానిలో భాగస్వామ్యం పంచుకున్నారు. భారత దేశంలో 2,00,000 పంక్తులు విస్తృతి ఉన్న సాహిత్యం మరొకటి లేదు. కాని అన్నమయ్య ఒకే వ్యక్తిగా ఉండి 4,48, 000 పంక్తుల సాహిత్యాన్ని సృష్టించాడు. అంతే కాదు ఇందులో కూడా కొన్ని పాటలే చాలా బాగుంటాయి మరికొన్ని పాటలు తాలుగా పోతాయి అని చెప్పడానికి వీలు లేదు. ప్రతి పాటా ఆణిముత్యం అనదగిన పాటే. మరొక ప్రత్యేకత ఏమంటే ఒకే వ్యక్తి ప్రపంచం మొత్తంలో ఇంత విస్తృతి  కలిగిన మౌఖిక సాహిత్యాన్ని సృష్టించిన వాడు కూడా మరొకరు లేరని ఇక్కడ గట్టిగా చెప్పవచ్చు. అన్నమయ్య సాహిత్యం మౌఖిక మాధ్యమ సాహిత్యం నేడు మౌఖిక మాధ్యమంలో లేదు. కాని ఆయన పాట రాయలేదు. పాడాడు. పాడడం కోసమే పాట కట్టాడు. దాన్ని లిఖిత మాధ్యమంలోనికి మార్చింది తర్వాతి పని అది అతను కాని అతని కొడుకులు మనుమళ్లు కాని చేసి ఉండవచ్చు. కాని అతనికి అవి పాటలే. మౌఖిక మాధ్యమ సాహిత్యం కర్తగా విస్తృతిలోగాని ప్రతిభాప్రకృతిలో గాని అన్నమయ్యకు సాటి మరొకరు నాస్తి నాస్తి నాస్తి అని చెప్పవలసి ఉంది. ఇది ఆయన సాహిత్య మాధ్యమం గురించి ఇక ఆయన పాట నిర్మాణాన్ని చూద్దాం.
పాట అన్నది ఒక బహుళ ప్రక్రియా రూపం అది సంగీతానికి సాహిత్యానికీ ఒకే సారి చెందుతుంది. అంటే సంగీతరచన సాహిత్య రచన ఒకే సారి సద్యఃస్ఫూర్తితో జరుగుతాయి. మౌఖిక మాధ్యమంలోనే సృజనం జరుగుతుంది. అంటే నోటి కళగా అది అప్పటికప్పుడు పుడుతుంది.  పాట పాడే లయకు రాగానికి అనుగుణంగానే పాటలోని మాటల కూర్పు అంటే సాహిత్య సృజనం అప్పటికప్పుడు జరుగుతుంది. అంతే కాదు పాడుతూ నాట్యం  చేసే వ్యక్తికి నాట్యంలోని లయకు కూడా అనుగుణంగా పాట సంగీతం ఉంటుంది. అంటే పాట అనేది మూడు కళల సమాహార కళ. ఒకటి సంగీతం, రెండు సాహిత్యం, మూడు నాట్యం. పాట సంస్థితి అన్ని సందర్భాలలో మూడింటిలో ఉండకపోయినా పాట అనేది సంగీతం సాహిత్యం అనే రెండు కళల సమాహారంగా ఎప్పుడూ ఉంటుంది. లిఖిత రూపంలో పుస్తకంలో అచ్చువేసిన పాటలో కూడా పాఠ్యంలో అంతర్గతంగా సంగీతానికి సంబంధించిన నిర్మాణం ఉంటుంది. పాట సృష్టించే వ్యక్తి జానపదుడు కాకుండా అప్పటికప్పుడు పాటను పాడుకునే వాడు కాకుండా ఉన్నా సరే చివరికి అతను సినిమా పాట రచయిత అయినా సరే దాన్ని పాడ బోయే సంగీత బాణీని తెలుసుకుని సంగీత దర్శకునితో కలిసి కూర్చొని పాటను దానికి అనుగుణంగా పదాల పాదాల కూర్పు చేసి రచించవలసి ఉంటుంది. కాలంనాటి వాగ్గేయ కారులుగా ఎంచ బడుతున్న అనువర్తిత జానపద గాయకులు (applied folk singers) గద్దర్, వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న మొదలైన వారు సృష్టించే పాట సృజనలో పద్ధతినే పాటిస్తున్నారు. పాట రచన అంటే సాహిత్య రచన సంగీత రచన కలిసే ఉంటాయి. పాట అన్నది మౌలికంగా మౌఖిక సాహిత్య ప్రక్రియ అది ప్రాథమికంగా పాడడానికి ఉద్దేశించింది. అన్నమయ్య చేసిన పాట రచన కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆయన పాటలు కట్టింది తను నమ్మిన మత సిద్ధాంతాన్ని వైష్ణవ భక్తిని జనబాహుళ్యంలో ప్రచారం చేసి జనం నాలుకల మీద ఆడేలా చేయడానికే.  దాని నిర్మాణాన్ని కూడా అందుకు అనుకూలంగానే  చేసుకున్నాడు.
అన్నమయ్య పాటల్లో ఉన్న జానపదం గురించి జానపద సంగీత బాణీల గురించి చందమామా, జాజర వంటి వారానువర్తనాల గురించి ఇప్పటికే చాలా మంది పరిశోధన చేసారు. దాని జోలికి నేను వెళ్ళడం లేదు. అంతే కాదు అన్నమాచార్యుల కుమారుడు పెదతిరుమలాచార్యుడు ఆయన కుమారుడు అంటే అన్నమయ్య మనుమడు చినతిరుమలా చార్యులు అనే ఆయన సంకీర్తన లక్షణమ్ అనే లఘు కృతిని రచించాడు.[7] పదం అనే సాహిత్య ప్రక్రియకు ఉండే లక్షణాన్ని చెప్పాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. పాటను సంప్రదాయ కావ్యశాస్త్రాల మర్యాదను అనుసరించి పదం అని అంటూంటారు. అప్పటి భరతుని నాట్యశాస్త్రం దగ్గరనుండి నండూరి యెంకి పాటల వరకు పాటకు పదం అనే మాటను పర్యాయపదంగా వాడారు. పదం పాడిందంటే పాపాలు పోవాలి అనియెంకిని గురించి చెబుతాడు. 71 కందపద్యాలలో రాసిన సంకీర్తన లక్షణంలో కొన్ని పద్యాలలో ఎన్ని రకాల పదాలుంటాయి వాటి నిర్మాణం ఎలా ఉంటుంది. యతి ప్రాస నియమాలు ఎలా ఉంటాయి. అనే విషయాలను రాసాడు చిన తిరుమలయ్య.
పదం అనే దానికి ప్రాథమికంగా ఎన్నిలక్షణాలు ఉంటాయో చెప్పడానికి ముందు పదం లక్షణాలను అంతకు ముందే ఎక్కడెక్కడ ప్రాచీనులు చెప్పారో చెప్పాడు ఒక సీస పద్యంలో.[8] సంగీత రత్నాకర ప్రబంధం లో, సంగీత చంద్రిక లో, సంగీత చూడామణి, సంగీత సుధాకరం అనే గ్రంథాలలోను వాటికి మూలమైన భరతంలోను పదలక్షణాలు చెప్పబడ్డాయని ఆధారాలు ఇచ్చాడు. తిరుమలాచార్యుడు. పదము అనే ప్రక్రియకు వృత్తము, చూర్ణము, నిబంధకము అనే పేర్లున్నాయని చెప్పాడు. వృత్తము అనేది సమవృత్తము అని విషమ వృత్తము అని రెండు రకాలు గా ఉంటుందని సమ వృత్తంలో నాలుగు పాదాలుంటాయని సరిపాదాలు లేకుంటే దాన్ని అర్థసమవృత్తం విషమ వృత్తంలో పాదాలు మరింత వేరే గా ఉంటాయని దీన్ని అన్నయార్యుడు అన్నాడని చెప్పాడు.  
నిబంధన అనే పేరున్న పదములో యతులు ప్రాసలుంటాయి మాత్రలు తాళసంగతులుంటాయి అని అన్నాడు. వీటిలో నాలుగు పాదాలలో యుతులుంటాయి అని రెండో అక్షరంలో ప్రాస ఉంటుందని లక్షణంగా చెప్పాడు. నిబంధన అనే పదము నకు అవాతంరంగా అవయవాలుగా ఇతర పద్ధతులలోను నిబంధనలుంటాయి అన్నాడు. ఇంకా వివిధ రకాలైన పదములను గురించి వాటి పేర్లను గురించి సంకీర్తన లక్షణంలో ఉంది. అంతే కాదు గ్రామ్యోక్తులను వాటి
ఒడుపు తెలిసి ప్రాముఖ్యాన్ని తెలిసి నైపుణ్యంతో పలకాలి అంటే రచించాలి అని చెప్పాడు. పదము అనే ప్రక్రియ గ్రామ్య భాషలో అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలోనే చెప్పి ఒప్పించాలి అని చెప్పాడు.
ఇలా సంకీర్తన లక్షణం అనే గ్రంథాన్ని శాస్త్రాన్ని బట్టి తెలిసేది పాట నిర్మాణానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే. కాని అన్నమయ్య తన కాలంనాటివికాని తనకు పూర్వం ఉన్న కాలం నాటివికాని అలంకార గ్రంథాలలో ఉన్న పదము అనే ప్రక్రియకున్న లక్షణాల గురించి తెలుసుకున్నా ప్రత్యక్షంగా తాను పాటలు కట్టేటప్పుడు వాటిని గురించి అంతగా పట్టించుకోలేదు. అన్నమయ్య పాటలు సంకీర్తన లక్షణంలో చెప్పిన వింగడింపుకు ఒక్కొక్కటి చెందుతుందో లెక్కకట్టి నిరూపించడం చాలా కష్టం. దుస్సాధ్యం. కాని పాటలో ఒక ప్రాస నియతి యతి నియతి పెట్టుకుని రాసారు అని నియమాలు శాస్త్రాలలో కూడా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. అన్నమయ్య పాటల్ని సంకీర్తన లక్షణ గ్రంథంలో చెప్పిన పేర్ల ప్రకారం లక్షణాల ప్రకారం ఉదాహరణలుగా చూపి అధ్యయనం చేయడం అనేది పెద్ద ప్రయోజనం ఉన్న విషయం కూడా కాదు. కారణం అన్నమయ్య పాట ఒక్కటీ సమాన నిర్మాణంతో లేదు. కాగా అన్నమయ్య తాను పదం కీర్తన అనే పేర్లను ఎలా వినియోగించినా పాటే తన ప్రక్రియ అని భావించినట్లు చెప్పడానికి ఉపయోగపడే ఉదాహరణలు ఆయన పాటల్లోనే దొరుకుతాయి. కీర్తన అనే మాట మామూలు నిత్యవ్యవహార భాషలో పాట అనే అర్థంలోనే జన సామాన్యంలో ఉంది. కీర్తించడం అనే మాట కూడా భక్తికి సంబంధించిన పదంగానే వినియోగంలో ఉంది. బుర్ర రాం కీర్తన పాడుతుంది రోయ్ జాగ్రత్త. అనే తెలుగు పలుకుబడి ఇక్కడ కీర్తన అంటే పాట అనే అర్థం. సంగీతంలోను కీర్తన అనే మాట కృతి అనే మాట కూడా పాట పరంగానే వాడుతున్నారు.
అన్నమయ్య పాటల్లో వస్తు పరంగా ఉన్న వైవిధ్యాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించి చర్చించడం సాధ్యం కాదు. కాని వస్తువుకు రాగానికి దగ్గరి సంబంధం ఉంది. అలాగే పాటలోని రూపానికి సంబంధం ఉంది. వీటిని పూర్తిగా విడిగా చూడడం కుదరదు. అన్నమయ్య తన పాటలన్నింటికి రాగాలను తనే నిర్దేశించాడు. తాను కూడా అదే రాగంలో పాడి అలా పాడడంలో పాటకు బాగా వ్యాప్తి వచ్చిన తర్వాతనే పాట ఆరాగం అనే సంబంధం కలిసింది. రాగిరేకులలో ప్రతి పాట దగ్గర, రాగం పేరు ఉంది. అన్నమయ్య రాగం చెప్పాడు కాని తన పాటలకు తాళం చెప్పలేదు. దీనివల్ల తర్వాతి కాలపు గాయకులు అన్నమయ్య పాటల్ని వారికి అనుకూలమైన తాళంలో పాడుకునే వైవిధ్యం లభించింది. పాటలు పాడే తీరు పరివర్థితమై అన్నమయ్య పదాలు నేడు కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతం శైలిలోనికి వచ్చాయి. కాని అన్నమయ్య పాడిన పద్ధతి ఇదేనా అని చెప్పడం ఈనాడు దీని వల్ల సాధ్యం కాకుండా పోయింది. అన్నమయ్య పాటల్ని బాగా ప్రసిద్ధంగా పాడే వారు పాడిన పద్ధతిని గ్రహించినా కూడా అన్నమయ్య ఇలా పాడి ఉండేవాడు అనే చెప్పే వీలు లేదు. కొన్ని చందమామా అనే వారానువర్తనం ఉన్న పాట తుమ్మెదా అనే వారానువర్తనం ఉన్న పాట ఇంకా ఇలాంటి జానపదగీతాల వరుసల్లో ఉన్న పాటల్ని అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్న వరుసలు కాబట్టి ఇలా పాడి ఉంటాడు అని చెప్పడానికి వీలవుతుంది.
అన్నమయ్య వస్తువుతో రాసిన పాటకైన ఒక సుష్ఠు నిర్మితిని పెట్టుకున్నాడు. పాటకు ఒక పల్లవి ఉంటుంది. ఇది రెండు పంక్తుల్లో ఉంటుంది. రెండు పంక్తుల్లోను యతి మైత్రి పాదానికి పాదానికి ఉంటుంది. పాదంలోని మొదటి అక్షరానికి పాదంలోని మధ్యలోని ఒక అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. సాధారణంగా పదాదిని అక్షరంతోనే మైత్రి కుదురుతుంది. కాని యతి మైత్రి వృత్త పద్యాల ఉన్న రీతిలో ఫలానా సంఖ్యలోని అక్షరానికి (10, 11, 12) అని  కాని జాత్యుపజాతి పద్యాల లో ఉన్న రీతిలో ఫలానా గణంలోని మొదటి అక్షరానికి అని కాని ఒక నియమం ఏదీ ఉండదు. మొత్తానికి ఒక యతి మైత్రి తప్పని సరిగా ఉంటుంది. ఇక పల్లవి లోని రెండో పాదంలోను ఇదే తీరున యతి మైత్రి ఉంటుంది. పల్లవి లోని రెండు పాదాలకు ప్రాస నియమం ఉంటుంది. కింద ఒక ఉదాహరణ చూద్దాం.
అదివో అల్లదివో శ్రీ హరివాసమూ
పదివేలు శేషుల పడగల మయమూ 

ఇక్కడ ఉన్న రెండు పాదాలలో మొదటి పాదంలోని యతి మైత్రి తొమ్మిదో అక్షరానికి ఉండగా రెండో పాదంలో ఎనిమిదో అక్షరానికే ఉంది. ప్రాస కారంతో కుదిరింది. మరొక ఉదాహరణ.
నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు
త్యము వీరల రణని బ్రదుకరొ సాటికి బెనగక జడులాల

రెండు పాదాలలోను యతి మైత్రి రెండు చోట్ల ఉంది. కాని నిత్యులో 'ని', నిగమాంత లో ఉన్న 'ని' యతి స్థానంలో ఉండటం వల్ల  రెండో పాదంలో సత్యములో '' సాటికి లోని 'సా' కు యతి మైత్రి కుదరడం వల్ల పల్లవి పాడడంలో లయ కుదురుతుంది. ఇందులోని ప్రాస సంయుక్త తకారం.
ఇలా ఏర్పడిన తర్వాత వరుసగా మూడు చరణాలు ఉంటాయి. ఒక్కో చరణంలో సరిగ్గా నాలుగు పంక్తులు ఉంటాయి. పైన పల్లవిలో చెప్పిన యతి ప్రాసనియమాలు చరణాలలోను ఉంటాయి. కాకుంటే పల్లవిలో రెండు పాదాలుండగా చరణంలో నాలుగు పాదాలుంటాయి. ఇక చివరి చరణంలో ముద్ర ఉంటుంది. అది వేంకటేశ్వరుని కున్న వివిధ నామాలలో ఏదైనా ఒకటి ముద్రగా మూడో పాదంలో కాని నాలుగో పాదంలో కాని ఉంటుంది లేదా ఇందులోని పాదంలోనైనా ఉండవచ్చు. నియమం లేదు. ఇది అన్నమయ్య కీర్తన అని గుర్తు పట్టడం ముద్ర వల్లనే సాధ్యం అవుతుంది. ఒకరు సృష్టించిన పదాలను మరొకరు అంది పుచ్చుకొని పాడే అలవాటు ఆనాడే ఉందని ఒక విషయం ద్వారా తెలుస్తుంది. తాళ్ళపాక చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణం లో ఇలా పాటల్ని చౌర్యం చేసే వారిని దూషిస్తూ ఒక పద్యం రాస్తాడు. పరిస్థితిని గమనించే వేంకటేశ్వర స్వామి ముద్రను వేసాడు అన్నమయ్య. కాని ముద్రలో తన పేరును కాకుండా స్వామి పేరునుంచడం లోని అంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ చౌర్యం నిరోధించడంగా మాత్రమే దీన్ని అర్థం చేసుకోకూడదు. అన్నమయ్య రాసిందే అయినా ప్రజల్లోనికి వెళ్ళి అందరు పాడే స్థితిలో ఎవరైనా ఇది నా పాటే అని చెప్పుకునే వారు రావచ్చు. అప్పుడు పాట అసలు కట్టిన వానికి కీర్తి రాకుండా మధ్యలో వానికి రావచ్చు. దృష్టితోనే ఆనాటి వాగ్గేయ కారులు శతక కవులు తమ ముద్రలను ఏదో ఒక రూపంలో వేసుకున్నారు.  కింద ఒక చరణాన్ని చూద్దాం.
లజాక్షి మోమునకు క్కవ కుచంబులకు
నెలకున్న కప్పురపు నీరాజనం
లివేణి కురువునకు స్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం                     - క్షీరాబ్ది-

ఇదే పాటలో చివరి చరణం కింద ఉంది

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం                          -క్షీరాబ్ది-

ఇలాంటి చరణాలు మూడు సర్వసాధారణంగా అన్ని పాటల్లోను ఉన్నాయి. కాని చాలా అరుదుగా కొన్ని పాటల్లో ఆరుచరణాలున్నాయి. బ్రహ్మమొక్కటే పాటలో ఆరు, జో అచ్యుతానంద జోజోముకుందా పాటలో అరుదుగా తొమ్మిది చరణాలున్నాయి. నానాటి బ్రదుకు నాటకము లో రెండే చరణాలున్నాయి.  ఇంకా చాలా వైరుద్ధ్యాలున్నాయి. కొన్ని పాటలు కేవలం ఆరు పంక్తులతో ఉన్నాయి. ఇలాంటి విశేషమైన పాటలు కొన్నే కనిపిస్తాయి. కాని అత్యధికంగా కనీసం తొంభై శాతం పాటలు ఒక పల్లవి మూడు చరణాలతో నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. పల్లవిలో రెండు పాదాలు చరణంలో నాలుగు పాదాలు యతిమైత్రి  ప్రాసనియమం అనే నియమాలు అన్ని పాటల్లో ఉన్నాయి. ఇలా పాటలన్నీ ఒక ఏకరూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి.
కాని పాటల నిర్మాణం ఒక అమరికలో ఏక రూప నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. కాని పాటకు పాటకు నిర్మాణం మారుతుంది. కారణం  పల్లవి పాదాలలో కాని చరణాలలోని పాదాలలో కాని గణ నియమం అనేది లేదు. అంతే కాదు పాదం పొడవులో నియమం ఏదీ లేదు.  పాదాలు ఎంత పొడవైనా ఉండవచ్చు. అంతే కాదు ఒకే చరణంలోఉన్న నాలుగు పాదాలు కూడా నాలుగు పొడవుల్లో ఉండవచ్చు. అన్నమయ్య పాటల్లో అతి తక్కువలో ఎనిమిది అక్షరాలున్న పాదాలున్నాయి అతి దీర్ఘంగా 26 అక్షరాల దాకా ఉన్న పాదాలున్నాయి. పాట కట్టడంలో ఇంత స్వేచ్ఛ ఉండడం వల్లనే పాటలు మౌఖిక మాధ్యమంలో ప్రజల్లో అతి సులభంగా చాలా బాగా వ్యాప్తిలోనికి రాగలిగాయి. జానపద గేయాలకుండే ప్రధాన లక్షణమే ఇది పాద నియమం కాని గణ నియమం కాని ఏదీ ఉండదు. జానపద గేయాలు ఏదీ తీసుకున్నా పల్లవిలోను చరణాలలోను అనుకోకుండా మీకు యతినియమం కనిపిస్తుంది. గద్దర్ పాటల్లో కూడా  నియమం అనుకోకుండానే కనిపిస్తుంది. ఇది పాటలో సంగీత మాధుర్యం రావడానికి తోడ్పడుతుంది. అంతే కాదు జానపద గేయం చరణాలలో ఏదో ఒక విధంగా ఆది ప్రాస కాని అంత్య ప్రాస కాని సమతూకంలోని పాదాలు కాని ఉండి పాటకు లయను తియ్యదనాన్ని తెస్తాయి. పాటని వచనం నుండి వేరు చేసే గుణమే ఇది. విధమైన సమానాక్షర సమ్మేళనం వల్ల స్వేచ్ఛలో కూడా ఉన్న నియతి వల్ల పాటలకు సంగీత గుణం, తియ్యదనం చేరతాయి. అవి వివిధ రాగాలకు ఒదగడానికి సాధ్యం అవుతుంది. అన్నమయ్య పాటలోని నిర్మాణాన్ని కింది విధంగా ఒక డయాగ్రంలో చూడవచ్చు.

అన్నమయ్య పాటకు చిత్ర రూపం ఇది. ఇందులోని అడ్డు గీతలు పల్లవి చరణాలలోని పంక్తులు, మొదటి నిలువు గీత అన్ని పంక్తులలోని తొలి అక్షరం. రెండవ నిలువు గీత  ప్రాస స్థానం అన్ని పంక్తులలో అంటే పాదాలలో ఒకే చోట ఉండడాన్ని సూచిస్తుంది. మూడో నిలువు గీత యతి మైత్రి అక్షరాన్ని తెలుపుతుంది. కాని దాని పక్కన ఉన్న గుండ్రటి గుర్తులు యతిస్థానం వేరు వేరు చోట్ల ఉండడాన్ని తెలుపుతుంది. మొదటి అక్షరం మాత్రం ఒకే తొలిస్థానంలో ఉండడాన్ని కూడా చూడవచ్చు. పల్లవి ఎన్ని చోట్ల పునరావృతమౌతూ ఉందో చూడవచ్చు. పాట నిర్మాణం ఎంత పకడ్బందీగా ఉన్నా స్వేచ్ఛకూడా ఉండడాన్ని గమనించవచ్చు.
పల్లవి
చరణం1
చరణం2
చరణం3
పల్లవి
పల్లవి
పల్లవి
పల్లవి
ప్రాస
యతి మైత్రి
యతి మైత్రి అక్షరాలు
అఅ
 











పై నున్న పాట నిర్మాణాన్ని సాహిత్య రూపంలో కింద పూర్తిగా చూడవచ్చు.

అప్పులేని సంసార మైన పాటే చాలు
తప్పులేని జీత మొక్క తారమైన చాలు                      -అప్పులేని-

కంత లేని గుడిసె గంపంతైనా చాలు
చింత లేని అంబ లొక్క చేరెడే చాలు
జంత గాని తరుణి జాతైన నదే చాలు
వింత లేని సంపదొక్క వీసమే చాలు                  -అప్పులేని-

తిట్టు లేని బతుకు ఒక దినమైన నదే చాలు
ముట్టు లేని  కూడొక్క ముద్దెడే చాలు
గుట్టు చెడి మనుకంటె కొంచెపు మేలైన చాలు
వట్టి జాలి పడు కంటె వచ్చినంతె చాలు         -అప్పులేని-

లంపట పడని మేను లవలేశమె చాలు
రొంపి కంబమౌ కంటె రోయుటె జాలు
రంపపు కోరిక కంటె రతి వేంకట పతి
పంపున నాతని జేరె భవమే చాలు                   -అప్పులేని-


అన్నమయ్య పాట అంతర్గత నిర్మాణాన్ని పైన చిత్ర రూపంలోను సాహిత్యంలోను చూచాము.
పాట నిర్మాణాన్ని పాడే క్రమంలో వింటూండగా మరొక రకమైన నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఇది శ్రేణీకృతమైన నిర్మాణం. పాడేటప్పుడు చరణంలోని ఒక పాదం తర్వాత మరొక పాదం పాడుకుంటూ పోతాడు గాయకుడు. పైన చిత్రంలో పాదాలు ఒక దానికింది మరొకటి ఉండడం చూచాము. కాని పాడే క్రమంలో పాదాలను ఒక దాని తర్వాత ఒక దాన్ని ఒక శ్రేణిలో రాస్తే వరసలోని పాదాలలో అక్షరాలు ఏవేవి ఎక్కడెక్కడ పునరావృత్తి చెందుతాయో మనం మరొక రీతిలో గమనించవచ్చు. అక్షరాలు నిర్ణీత క్రమంలోను స్వేచ్ఛగానూ పునరావృతమై పాటకు నిర్మితిని కల్పిస్తాయి. పాటను శ్రవణపేయం చేస్తాయి.  యతి మైత్రి కలిగించే అక్షరాలు అలాగే పాదాల ప్రాస స్థానాక్షరాలు కూడా పునరావృతమై ఇదీ ఒక క్రమంలో జరగడం వల్ల చరణంలో ఒక సుష్ఠు నిర్మితి ఏర్పడి పాటకు మాధుర్యాన్ని పునరావృతులే కలిగిస్తాయి. అయితే పునరావృతుల్ని సంప్రదాయకమైన వృత్యను ప్రాసాలంకారంగా చెప్పడం పాట నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు చేసినట్లు అవుతుంది. కవి ఉద్దేశానికి అపచారం  చేసినట్లు కూడా అవుతుంది.

దీన్ని కింద చిత్ర రూపంలో చూడవచ్చు.
పాదం 1
పాదం 2
పాదం 3
యతిమైత్రి పాదంలో
 పై
ప్రాస సంబంధం పాదాల మధ్య
 







Structure of a Song:  syllable repetition at equal intervals in linear order.
పాట నిర్మాణం:  శ్రేణీక్రమ సమానాంతర అక్షరావృత్తి

మౌఖిక మాధ్యమంలో స్వేచ్ఛగా రచించే పాటలో అప్పటికప్పుడే సంగీత సాహిత్యాలు సృజన జరిగే పాటలో అంతర్గతంగా ఇంత నిర్మాణం ఉంటుంది. నియమాలు ఏమీ లేవు అనే స్థితిలో కూడా నిర్మాణం ఉంటుంది. అన్నమయ్య తాను సృష్టించిన పాటల్లో ముప్పావు మువ్వీసం పాటలు ఇదే రీతిలో సృష్టించాడు.  చాలా జానపద గేయాలలో వాటిదైన నిర్మితి వాటికి ఉంటుంది. దీనిలో చరణాలలోని పాదాల సంఖ్య కాని చరణాలలో సమాక్షర యతిస్థానం నిర్ణయించడం గాని కవి అప్పటికప్పుడు చేసుకుంటాడు. ప్రాస స్థానాన్ని పాటించక పోయినా అంత్య ప్రాసను పాటించవచ్చు. లేదా సమతూకంలో ఉండే పదాలు చివరలో కాని మొదటలో కాని వేసుకోవచ్చు. ఏదైనా పాటకు అప్పటికప్పుడే దాని నిర్మాణం ఏర్పడుతుంది. ఎన్ని జానపద గేయాలు చూచినా రీతి కనిపిస్తుంది. పల్లవి మూడు చరణాలుండే పాటలే సర్వసాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయి. పాట సాహిత్యంలో మాత్రం నిర్మాణం లేకుండా కేవలం వచనంలా కనిపించే వచనాన్ని సైతం సంగీతజ్ఞులైన గాయకులు తియ్యగా పాడ వచ్చు. కాని అంత మాత్రాన అది మంచి పాట కావాలని ఏమీలేదు. పాట అనే ప్రక్రియ సాహిత్య ప్రక్రియగా తనదైన నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడే సంగీతానికి బాగా తోడ్పడుతుంది. తియ్యటి పాట సృష్టి జరుగుతుంది. అన్నమయ్య పాటకాడుగా విజయం సాధించింది ఇక్కడే. పాటకాడు అనే మాటను వాగ్గేయకారుడు అనే మాటకు సరిగ్గా సమానార్థక పదంగా వాడుతున్నాను. మనవాళ్లు తెలుగు సమాసాన్ని వాడడానికి ఎందుకో ఇష్టపడరు గాని. పాటకాడు అనే మాట రాసే వానికి పాడే వానికి రెండింటికి సమానంగా వర్తిస్తుంది. కాబట్టి అన్నమయ్య మంచి పాటకాడు.
Select Bibliography:
అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. సంపుటాలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు.
చిన్న తిరుమలా చార్యులు తాళ్ళపాక. 1835. సంకీర్తన లక్షణమ్. విజయ రాఘవాచార్య వి. సంపా. 1935. మైనర్ వర్క్స్ ఆఫ్ అన్నమాచార్య అండ్ హిస్ సన్స్. మద్రాసు. మహంతాస్ దేవస్థానమ్స్ ప్రెస్. లోనిది.
Ambika Ananth and Adviteeya. N. Dixit. (tr.) 2005. Nector Ocean of Annmacharya (Translations of Annamayyas songs). Tirupathi. T.T. D press.
Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio.
Ong, J. Walter. 1982. Orality and Literacy: Technologizing of the Word. Metheun & Co. ltd.
Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press.

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
జానపద విజ్ఞాన గిరిజన అధ్యయన శాఖ
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం 517246



[1] Ong, J. Walter. 1982 p. 2.
[2] లిఖిత సాహిత్యం (fixed text) స్థిరపాఠ్యంతో ఉంటుంది. అదే మౌఖిక సాహిత్యం లేదా జానపద సాహిత్యంలోని పాఠ్యం అస్థిరమైనది మనిషి మనిషికి ఇది మారుతుంటుంది. అన్నమయ్య పాడడానికి ఉద్దేశించుకున్న పాట ఇలా మనుషుల మధ్యలోనికి చేరి మారిపోయేదే.
[3] Ambika Ananth and Adviteeya. N. Dixit. 2005. P. 144
[4] దండె అనే ఈ సంగీత వాద్యం కడప జిల్లాలో ఇప్పుడు కనిపించడం లేదు. కాని ఈవ్యాసకర్త ఇటీవల వికారాబాద్ జిల్లాలో క్షేత్రపరిశోధన పర్యటన చేసినప్పుడు అనంతగిరి కొండ మీద పద్మనాభ స్వామి ఆలయం దగ్గర్లో విష్ణుభక్తుడైన మాలదాసరి దండె తీసుకొని పాడుతూ కనిపించాడు. ఇది పాట పాడేటప్పుడు శృతి చేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుంది.
[5] Applied folklore is the branch of folkloristics concerned with the study and use of folklore and traditional cultural materials to address or solve real social problems. -- http://en.wikipedia.org/wiki/Applied_folklore.                                     In the early years of the concept of Applied Folklore it was called as Folklorisums and Folklorism. These Ideas were conceptualized by Regina Bendix. She Defined Applied folklore as “Folklore outside of it context   or spurious folklore… The term Folklorisums has been applied to visually and aurally striking or aesthetically pleasing materials such as festive performance, music, art (but also foods) that lend themselves to being extracted from their initial contexts and put to new use for different often for larger audiences” p. 537  Bendix, Regina 1988. Folklorism: The Change of Concept. International Folklore Review 6: 5-15. In Charlee T. MacCormick and Kim Kennady White. Ed. 2011. Folklore: An Encyclopedia of  Beliefs, Customs, Tales, Music and Art. California. ABC- Clio
[6] అన్నమాచార్యులు తాళ్ళపాక. 1980. అధ్యాత్మ సంకీర్తనలు. తిరుపతి. అన్నమాచార్య ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానములు. పుట. 59.
[7] Vijayaraghavacharya, V. ed. 1935. The Minor Works of Annmacharya and His Sons. Madras. Sri Mahanthas Devasthanams Press. Pp. 137-150

[8] Ibid p. 140

Saturday, April 20, 2013

my new article on dalit other caste relations


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
చరవాణి. 9440493604

విలోమవివాహాలు - విధ్వంసమయ్యే కులాలు
పెద్దమ్మ కథ సామాజిక దురన్యాయం

సూరుల జన్మంబు సురల జన్మంబు ఏఱుల జన్మంబు ఎరుగనగునె అని ఒక చాటు పద్య శకలం మనకు చాలా సందర్భాలలో ఎదురవుతుంది. దీనికి రెండర్థాలు చెప్పవచ్చు. సూరులుఅంటే పండితులు (కవులు కూడా అని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు) సురలు అంటే దేవతలు  ఇంకా ఏఱుల జన్మాలని తెలుసుకోలేము అని ఒక అర్థం వస్తుంది. అంతే కాదు. ఎఱుగనగునె అనే ప్రశ్నార్థక పదానికి ఎరుగవచ్చునా అంటే తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చునా అని మరొక అర్థం వస్తుంది. కులం గురించి అడగ వద్దు అని చెప్పే ఇలాంటి మాటలు ఇంకా మనకు చాలా కనిపిస్తాయి. కాని వర్ణసంకరం గురించి కుల సంకరం గురించి గగ్గోలు పెట్టే కథలు పురాణ కాలం నుండి కనిపిస్తాయి. విలోమ వివాహాల గురించి అనులోమ వివాహాల గురించి మనుస్మృతి బాగా చెబుతుంది. ఏ ఏ కులాలు సంకరం అయినప్పుడు దాని ఫలితంగా మరే కులాలు పుడతాయి అని వివరంగా చెబుతుంది మనుస్మృతి. ఈ వర్గీకరణంలో నేడు కనిపించే చాలా కులాలు తీవ్రమైన అవమానానికి గురి కావలసి వస్తుంది కూడా వాటి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు. అందుకే మనుస్మృతిని తగల బెట్టే ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది.
అనులోమ వివాహం అంటే పురుషుడు పెద్దకులానికి చెందిన వాడై ఉండి లేదావర్ణక్రమంలో పైవర్ణానికి చెంది ఉండి కింది వర్ణం స్త్రీని కాని కింది కులం స్త్రీని కాని పెండ్లాడితే అది అనులోమవివాహం అవుతుంది. అంటే బ్రాహ్మణ వర్ణం పురుషడు తనకు కింది వర్ణాలైన, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహం ఆడితే అది అనులోమ వివాహం అవుతుంది. అలా కాక కింది వర్ణం నుండి కాని కింది కులాలనుండి కాని పురుషుడు పై వర్ణం నుండి లేదా పై కులం నుండి స్త్రీని వివాహం ఆడితే అది విలోమ వివాహం అని అంటారు. దీన్నే ప్రతిలోమ వివాహం అనికూడా అనడం ఉంది. ఈ పేరును బట్టే దీనికి వ్యతిరేక గుణాన్ని లేదా నీచలక్షణాన్ని ఆపాదించడాన్ని చూడవచ్చు. అంటే విలోమ వివాహాలను అంగీకరించక ఈసడించిన సమాజం పురాణ కాలంనుండి ఉండడాన్ని పురాణ కథల్లోను దేవత కథల్లోను చూడవచ్చు. దీనివల్ల వచ్చే అనర్థాలను కూడా మనుస్మృతి పేర్కొంది. విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలలో ధర్మారావు తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు కింది మూడు వర్ణాల స్త్రీలను పెండ్లిచేసుకోవడం పెద్దకథా విస్తృతిలో వర్ణించాడు. దీన్ని ఆనందంగా అంగీకరించే ఆయన విలోమ వివాహాలను ఎక్కడా ఆయన సానుకూలంగా వర్ణించడు.
విలోమ వివాహాల్లో వచ్చే సామాజిక సమస్యను గురించి ఆధునిక సాహిత్యంలో  కూడా చాలా విస్తృతంగానే వివరించి చిత్రించారు. రంగనాయకమ్మగారి బలిపీఠం నవలలో (సినిమాలోను) దళిత కులానికి చెందిన వ్యక్తి అగ్రకులానికి చెందిన (బ్రాహ్మణ) స్త్రీని పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్య ఎలా ఉంటుంది అని చాలా విస్తృతంగా చెప్పింది. ఈ సమస్యలను సినిమాలు కూడా వివరంగా చూపాయి. ఇదే సామాజిక సమస్యను అంటే కింది కులాలకు చెందిన పురుషులు పైకులాల వారి స్త్రీలను విశేషించి బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీలను పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా దళిత కులం పురుషులు బ్రాహ్మణ స్త్రీలను పెండ్లి చేసుకుంటే పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయి. అనే సమస్యను వర్ణించిన జానపద కథలు చాలా దొరుకుతాయి. మౌఖిక సాహిత్యం అంటే జానపద సాహిత్యం దీన్ని బాగా విస్తృతంగానే వర్ణించింది. ఇది గ్రామదేవతల కథల్లో కూడా వస్తుంది. పెద్దమ్మ అనే గ్రామ దేవత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో ఉన్న గ్రామ దేవతలలో బాగా వ్యాప్తిలో ఉన్న గ్రామదేవత.  ఈ పెద్దమ్మ కథని  ఈ దేవతకి కొలుపులు కొలిచే టప్పుడు చెబుతారు. దళిత కులాకు చెందిన బైండ్లవారు, ఆసాది వారు, కొమ్ముల వారు, పంబలవారు వారి జానపద కళారూపాలైన బైండ్లకథ ఆసాదికథ, పంకథల్లో ఈ కథలను చాలా సుదీర్ఘంగా చెబుతారు. పెద్దమ్మ కథ వీరి కళారూపాల్లో బాగా విస్తృతంగా ఉంది. అంతే కాదు పెద్దమ్మ కథని చాలా కులాలవారు విడిగా కథగా చెప్పుకోవడం కూడా ఉంది. పెద్దమ్మకథని బ్రాహ్మణ కుటుంబాలలో కూడా అందునా స్త్రీలలో కూడా పిల్లలకి చెప్పే కథల్లాగా చెప్పుకోవడం ఉంది.  ఈ కథని నేను మూడు తావుల్లో సేకరించాను. ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఈ కథను చెప్పగా విన్నాను. ఈ కథలో ఒక క్లిష్టమైన సామాజిక సమస్యను వర్ణించడం చూడవచ్చు. ముందు కథను చదివి తర్వాత దాని విశ్లేషణలోనికి పోదాం.
పెద్దమ్మ కథ: అనగనగా ఒక ఊళ్ళొ ఒక బ్రామ్మణాయన ఉన్నడు. ఆయనకి పొలం యగసాయం కూడా ఉంది. ఆ సంవత్సరం పొలంలో  జొన్న పంట వేశిండు బాపనాయన. ఆయన పొలాన్ని పాలికిచ్చినా ఆ ఇంటి వాళ్లే దానికి కాపలా కాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పాలు మూడొంతులు. పాలి రైతు కూడా అప్పుడప్పుడు కాపలాకి వత్తడు.
ఆయనకి ఈడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ కూతురునే పగటి పూట చేను కాపలాకి పంపిస్తూ ఉంటడు. చేనుకి తూర్పు  నడాన ఒక మంచె ఉంది.  ఆ మంచె మీద కూసోని బాపనాయన కూతురు వడిసాల తిప్పి తిప్పి రాళ్ళు కొడతా పిచికలు వాల కుండా కాపలా కాస్తది.
ఒక నాడు. అట్ల కాపలా కాస్త ఉండగా ఆ పొలం పక్కన దారెమ్మడి ఒక ఈడు కొచ్చిన కుర్రవాడు పోతుంటడు. అక్కడ ఈ అమ్మాయి కేకలు పెట్టుకుంటా వడిశాల తిప్పుకుంటా ఉంటే చూస్తడు ఆ కుర్రవాడు. ఈ బాపనాయన కూతురు బాగా ఎర్రగా బుర్రగా ఉండటాన ఆ పిల్లగాడు చూపు తిప్పుకోలేక అట్లనే చూశి చూశి దారిలో పోతడు. తిరిగి మాపిటేలకి ఆ దారి గుంటా వత్తా వత్తా ఆ యమ్మాయిని మళ్ళీ చూశిండు. ఈ అమ్మాయి కూడా ఆ పిల్లగాడిని చూశింది. పిల్లగాడు కూడా బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. ఎవురా మన ఊరి అబ్బాయేనా అని అనుకుంది.
ఆ పిల్లగాడు ఇంటికి పోయినంక కూడా ఆ పిల్లని మరిశి పోలేక పోయిండు. కళ్ళలోనే కనపడతది. మళ్ళీ ఆ దారిలోకే వచ్చి ఆ పొలం కాడికి వచ్చి  చూశిండు. ఆ యమ్మాయి మంచె మీదే ఉండి పిచికలని తోలతా ఉంది. ఈ పిల్లగాడు ఆ దారి దాకా వచ్చి. అక్కడక్కడే తిరుగుతా ఈ పిల్లని చూస్తా ఉన్నడు. కాసేపటికి ఆ యమ్మాయి ఈ పిల్లగాడిని చూచి నిన్నకనపడిన అతను ఇతనే కదా అని అనుకుంది.  అట్ల రెండు మూడు రోజులు చూశిండు. ఆ పిల్లగాడు అట్ల చూడడాన్ని ఈ పిల్ల గమనించి తననే చూడడానికి వస్తన్నడు అని తెలుసుకుంది.  అయిన తనను ఏమీ అన లేదు కదా అని ఊరుకుంది.
అట్ల అయినంక ఒక రోజున ఆ పిల్లగాడు మంచె దగ్గరికి వచ్చి ఆ యమ్మాయి దగ్గిరి కి వచ్చి కాస్త మంచినీళ్ళు పోస్తావా దప్పికగా ఉంది అని అంటడు. ఆ యమ్మాయి కూడా మంచె దిగి బుర్రకాయ తీసింది. ఆ పిల్లగాడు గొంతుగా కూర్చోని దోసిలి పట్టిండు. ఆయమ్మాయి. బుర్రకాయ ఎత్తి అతనికి మంచి నీళ్లు పోసింది. కాసేపు అక్కడే కూర్చున్నాడు. ఆయమ్మాయిని చూసుకుంటా. ఆయమ్మాయి కాసేపు చూచి తిరిగి మంచె ఎక్కింది.
ఇక ఆయమ్మాయి ఇంటికి పోయి. పిల్లగాడు బాగా ఉన్నడు. బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. బాగా మాట్లాడతన్నడు బ్రామ్మల పిలగాడే గావచ్చు అని అనుకుంది. మళ్ళీ తెల్లారి రోజున పొలానికి పోయింది. మద్యానం వేళకి మంచి రెండు జాముల ఎండలోకూడా ఆ పిల్లగాడు మళ్లీ వచ్చి కాసేపు దూరంనుండే చూశి. తర్వాత దగ్గరికి వచ్చి మంచి నీళ్ళు అడిగిండు. ఆయమ్మాయి మంచె దిగి బుర్రకాయతో మంచినీళ్ళు పోసింది. అతను తాగిన తర్వాత వెళ్ళి పోయిండు.
అట్ల నాలుగైదు సార్లు ఆ పిల్లగాడు మంచినీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడు కుంటరు.  అట్లా నాలుగైదు సార్లు మాట్లాడు కున్నంక వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చుకుంటరు. ఇక కొద్ది రోజులకే పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు. ఇక ఒక నాడు పొద్దు పోయినంక ఆళ్ళిద్దరు ఇంటికి పోకుండా మూట ముల్లెతో రాత్రి పూట వేరే ఊరికి ఎవురికి చెప్పకుండా లేచి పోతారు.
ఆ బ్రామ్మణాయన కూతురు ఇంటికి రాలేదేమా అని పోలానికి వచ్చి చూచి ఊరంతా తిరిగి తిరిగి ఏడుసుకుంట ఇంటికి పోతాడు.
ఇక వీళ్ళు ఇద్దరూ వేరే ఊరికి పోయి. కాపురం పెట్టుకుంటారు. ఆ పిల్లగాడు కూలీనాలి చేసుకుని ఏదో సంపాదించుకొని వస్తుంటడు. ఈమె వండి పెటతాఉంటది.  అట్ల కాలం గడుస్తా ఉంటది. ఐదేళ్ళు గడిసినయ్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఇట్లా ఉండంగ ఉండంగ. ఆ ఊళ్ళో ఆ బాపనాయనని కూతురు ఎక్కడికో లేచి పోయిందని పిల్ల తల్లి బాయిలో దూకి చచ్చిపోద్ది. తండ్రిని కుటుంబాన్ని ఆ ఊరి బ్రామ్మలు కులంనుండి ఎలేస్తారు. 
అయితే ఒక నాడు ఈ పిల్లగాడి తల్లి దండ్రులు ఊరు ఊరు వాళ్ళ కొడుకు కోసం తిరిగి తిరిగి ఆ ఊరికి వచ్చి తమ పిలగాడు అక్కడున్నాడని తెలుసుకుంటారు. పిలగాడి తండ్రి పిలగాడిలాగే ఎర్రగా ఉన్నాడు. కాని చాలా మోటుగా ఉండడాన్ని వాళ్ళ కోడలు చూచింది. ఆతని తల్లి అంటే ఆమె అత్త అయితే బాగా నల్లగా ఉంది. ఆ మాట తీరు బట్టి కూడా వాళ్ళది ఏకులం అని తెలుసుకోలేక పోయింది. అయిన అంతా అయినాంక ఇప్పుడు తెలిసి ఏం లాభం అనిఅనుకుంటది.
అయితే ఒకనాడు. ఆయమ్మాయి అప్పాలుచేసింది.  అంటే బొబ్బట్లు చేసింది అన్నమాట. చేసి అత్తకి వడ్డించింది. ఇదేంటి బర్రె నాలికలాగా ఉంది. అని అడిగింది. అప్పడు ఆయమ్మాయికి బాగా తెలిసి వచ్చింది. తాను చేసుకున్నది ఒక మాదిగ వాళ్ళ అబ్బాయిని అని, బాగా తెలిసింది. తాను మోసపోయానని అనుకున్నది. అయినా తప్పు నాదే అని తాను ఏనాడు అతని కులం గురించి అడగలేదని మనిషిని చూచి తనకులమే అని అనుకున్నా కాబట్టి  తప్పు తనదే అని తెలుసుకుంది. తన భర్త ఇంటికి రాగానే అతడిని చూచింది. పిల్లలని బాగా చూచుకో మని చెప్పింది. బాయికాడికి నీళ్ళకి పోతానని చెప్పి ఇంట్లో చెప్పకుండా తన ఊరికి పోతది. తన తండ్రి ఇంటికి పోతది. తన తల్లి చచ్చిపోయిందని తెలిసి ఏడుస్తది. ఇంటికి రాగానే తండ్రి తన మొకం చూడలేదు. ఇంటిలోనికి రానియ్యలేదు. దూరంగా నిలబడ్డాడు. అప్పుడు ఆయమ్మాయి. తండ్రిని ఒక మాట అడిగింది. నానా నానా కుక్కు ముట్టిన కుండని ఏమి చేయాలి అనిఅడుగుతది.
అప్పుడా తండ్రి అయితే పగల కొట్టు లేకుంటా తగల పెట్టు అని అంటాడు. ఇక ఇంట్లోకి ఏమాత్రం పోవాలనే ఆలోచన చేయకుండా తాను  వెనుదిరిగి తన ఊరికి పోయింది.  అప్పటికి తన అత్త మామలు వాళ్ళ ఊరికి పోయారు.
ఇక ఆమె తన ఇంట్లోకి పోయింది. భర్త వచ్చిన దాకా ఆగింది. తన ఇద్దరు పిల్లలు కూడా ఇంటికి వచ్చిందాకా ఆగింది. మాపిటేలకి పిల్లలు వస్తారు. పిల్లలని భర్తని ఇంట్లో ఉంచుకుంది. కాసేపు పిల్లలని చూచుకింది. ముద్దాడింది. ఆమెకు ఒళ్ళంతా మంటలు పుట్టినట్టు అప్పుడు అనిపించింది. ఇంటికి అన్ని వైపులా గడులు పెట్టి. పోయిలోంచి కొరకాసు తీసుకొని ఇంటికి నిప్పు పెట్టింది. తాను తన భర్త ఇద్దరు మగపిల్లలు మంటల్లో కాలి చచ్చి పోతారు.
పొద్దుగూకే వేళకి ఇల్లు తగలబడి పోవడం చూచి ఊళ్ళోవాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఇల్లు తగల బడి పోవడం చూచి ఆర్పడానికి చూస్తారు. కాని అప్పటికే పూర్తిగా కాలింది. లోపల నాలుగు శవాలు మాడిపోయి కనిపించినాయి.
చచ్చి పోయినతర్వాత ఆ బ్రామ్మణ ఆమే ఆ ఇంటి దగ్గరే దేవతలా ఆకాశంలో కనిపించింది. తాను దేవతనని తనను పెద్దమ్మ దేవత అని పిలిచి గుడి కట్టండి అని ఊరి వాళ్ళని కోరుతుంది. ఊరి జనం అంతా ఆమె మహిమ చూచి భయపడి గుడికడతాం అని అంటారు. నా భర్త నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు. నాతో పిల్లల్ని కన్నాడు.  వాడు దున్నపోతై పుడతాడు. నా  ఇద్దరు కొడుకులు గావు గొర్రెలై పుడతారు. అందుకని ఏడాదికి ఒక సారి కొలుపు చేయండి. నాకు ఒక దున్నపోతును బలి  ఇవ్వాలి రెండు గావు గొర్రెలని  బలి ఇవ్వాలి. ఏడాదికి ఒక సారి ఇట్లా కొలుపు కొలిస్తే నేను మిమ్మల్ని సల్లంగా చూస్తా. లేకుంటే మీ ఊరికి అరిష్టం జరుగుద్ది అనిచెబుతుంది. అక్కడనుండి ఆమె అక్కడే పెద్దమ్మ తల్లై వెలిసింది. ఊరి వారు అక్కడే గుడి కట్టి కొలుపులు చేస్తున్నారు.

పైన చెప్పిన  పెద్దమ్మ కథ చాలా ప్రచారం ఉన్న గ్రామదేవతల కథలలో ఒకటి. దీన్ని ఇతర పరిశోధకులు కూడా సేకరించారు. అయితే వారి సామాజిక నేపథ్యం కారణంగా వారి పద్ధతిలో వారు విశ్లేషించారు. ఈ కథ అటు దళిత కుటుంబాలలో కనిపిస్తుంది. అంతే కాదు విపరీతంగా ఇటు బ్రాహ్మణ కుటుంబాలలో కూడా ఈ కథ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు.  నేను కలిసి మాట్లాడిన వారిలో కూడా చాలామంది ఈ కథ గురించి వివరించి చెప్పారు. ఈ కథను ఎక్కువ సందర్భాలలో అమ్మాయిలకు చెప్పే నీతికథలాగా చెబుతారు. అంటే అమ్మాయిలు కులం తప్పి పెళ్ళి చేసుకుంటే లేదా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా స్వతంత్రించి పెళ్ళి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణగా కూడా  ఈ కథను చెబుతారు.
ఈ పెద్దమ్మ గ్రామదేవత కథ లాగే పెద్దమ్మ దేవాలయాలు ఆంధ్రదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. పెద్దమ్మకి ఏడాదికి ఒకసారి జాతరలు జరిగే టప్పుడు బైండ్లవారు పంబాల వారు కొమ్ముల వారు ఈ కథని ప్రదర్శించి చెబుతారు.  పెద్దమ్మ గుడులు కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి. మరికొన్ని చోట్ల రాతి కట్టడంతో చాలా పెద్దగా ఉన్న గుడులు కూడా ఉన్నాయి.
పైన చెప్పినకథలో జరిగింది ఒక అసాధారణమైన విలోమ వివాహం. అంటే కింది వర్ణం వాడు అసలు వర్ణమే లేని పంచముడైన పురుషుడు అన్నింటికన్నా పై వరుసలో ఉన్న వర్ణంలోని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతను తన కులాన్ని చెప్పలేదు. ఆమె అడగలేదు. కాని ఇద్దరి ఇష్టంతో పెళ్ళి జరిగింది. పిల్లలూ పుట్టారు. కాని అతని అసలు కులం తెలుసుకున్నంతనే అప్పటిదాకా తనువుకు తనువు అయిన భర్త స్పర్శ అగ్నితో సమానం అయింది. తనను తాను తగల బెట్టుకోవడమే కాకుండా భర్తని చివరికి కన్నపిల్లల్ని కూడా తగులబెట్టి నిలువునా చంపేసింది. అంతే కాదు ఈ పగ ఎంత దూరం పోయిందంటే తరతరాల పాటు ఆమె భర్తని పిల్లలని బలిపశువుల్లా బలిచేయమని కోరింది.  పెళ్ళి చేసుకోవడం వర్ణాంతరంగా చేసుకోవడం ఒక వేళ తప్పు అని భావిస్తే ఆ తప్పు చేసి ఆత్మ బలిదానం జరిగినప్పుడు అగ్రవర్ణానికి చెందిన ఆమె దేవతగా వెలసి పూజలు అందుకుంటూ ఉంది. కాని అదే తప్పు కారణంగా ఆ దళితకులానికి చెందిన భర్త పిల్లలు తరతరాలుగా బలిపశువులుగా బలి ఇవ్వబడుతున్నారు.
భార్య భర్తల సంబంధంలో భర్త భార్య కన్నా ఎత్తుగా ఉండాలి. భార్యకన్నా ఎక్కువ చదువుకున్నవాడు అయి ఉండాలి. అన్ని విషయాలలోను భార్యకన్నా అధికంగానే ఉండాలి. ఇవన్నీ పురుష ప్రపంచం నిర్ణయించి తరాలుగా శతాబ్దాలుగా అమలు చేస్తున్నవే. అలాగే కులాంతర వివాహాలు జరిగినప్పుడు, వర్ణాంతర వివాహాలు జరిగినప్పుడు కూడా భర్త ఉన్నత కులానికి ఉన్నత వర్ణానికి చెందిన వాడుగానే ఉండాలి. అందుకే అది అనులోమ వివాహం అని సానుకూలంగా వర్గీకరించి చెప్పినది కూడా పితృస్వామ్యవిలువలను స్థిరంగా ఉంచే ప్రయత్నంలో జరిగిన పనే. విశ్వనాథవారి వేయి పడగలలో కథానాయకుడి తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడు మిగతా క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలను పెళ్ళి చేసుకున్న తీరును  ఆ ఉపాఖ్యానాలను చెప్పి నతీరు ఈ అనులోమ వివాహాలను ఆమోదించి ఉన్నతలక్షణంగా తీర్చి చెప్పడం. పై వర్ణాలకు కింది వర్ణాలపై ఉన్న అధికార స్వామ్యాన్ని చెప్పే విషయమే.  వేయిపడగలలో క్షత్రియకాంత సంతానం, వైశ్యాకాంత సంతానం, చివరికి శూద్రకాంత సంతానం సంగతి ఏమైందో చదివిన వారికి అంతా తెలిసిన విషయమే. మనుస్మృతిలోన అమరకోశంలోను ఉన్న వర్ణసంకర సంతానాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారో చదివితే వివిధ కులాల పైన అవి కక్కే విషం గురించి తెలుస్తుంది. 
పెద్దమ్మకథలో మరొక భరించలేని విషాదం ఏమంటే విలోమ వివాహంలో బలిపశువు అయిన దళితుడు అతని పిల్లలు ప్రతి సంవత్సరం దున్నపోతు రూపంలో గావు గొర్రెల రూపంలో బలి అవుతున్నారు. ఈ బలులు ఎందుకు చేస్తున్నారో తెలియక ప్రజలందరూ చూస్తునే ఉంటారు. దేవతను ఎందుకు సంతోష పెట్టడానికి బలులు ఇస్తున్నారో ఇచ్చే వారికి చాలామందికి తెలియక పోవచ్చు. ఇంకా తెలుసుకోవలసిన మరొక విషయం ఏమంటే ఈ బలులను సంప్రదాయికంగా బలి ఇవ్వవలసినవారు, కత్తితో నరికి బలి ఇచ్చేది దళిత కులాలకు చెందినవారే. గొర్రె పిల్లల్ని మాత్రం కొన్ని గ్రామదేవతల గుడులలో గావు పట్టేది కొన్ని వెనుక బడిన కులాల వారు చేస్తారు. కాని దున్నలను నరికేది కొన్ని చోట్ల గొర్రెలను డొక్కచీల్చేది మాత్రం దళిత కులాలవారే.
అనులోమ వివాహాలు పితృస్వామిక విలువలు చిరస్థాయిగా కొనసాగేలా చేసే తీరులోనే ఇంకా ఉన్నాయి. విలోమ వివాహాలు చేసుకుంటే కింది కులాలవారు కింది వర్ణాల వారు ఏవిధమైన సాంఘిక దురన్యాయానికి గురవుతారో పెద్దమ్మకథలోనే కాక నేటికీ నిజజీవితంలో చాలా సందర్భాలలో ఈనాటికి ఎదురౌతున్న విషయం. పితృస్వామిక విలువలు ఒకవైపున కుల వర్ణ అసమానతల దురన్యాయం మరొక వైపున దాడిచేసే చట్రంలో విలోమ వివాహాలలో దళిత బహుజనులు ఎలా బలౌతారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పెద్దమ్మకథ. ఇది మన గ్రామ దేవత కథ కూడా.  మన సమాజంలో వర్ణధర్మాలు కుల ధర్మాలను నిరంతరం కొనసాగించేలా చేస్తున్న ఆచారాలను మనకు తెలియకుండానే కొన సాగిస్తున్నాం. విలువలను నమ్ముతున్నాం. ఇదే ఇంకా కొన్ని శతాబ్దాలదాకా సాగబోయే విషాదం.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.