Tuesday, June 17, 2014

పరిశోధన విధానం గురించి సిద్ధాంతగ్రంథ రచన గురించి కొత్త పుస్తకం





A much awaited book in Telugu finally took a shape. Research methodology has been introduced in small booklets by very experienced researchers like Prof. R.V.S Sundaram, Prof. Gandham Apparao and Prof. Jayaprakash. Theses are no doubt sincere efforts with limited purpose. The present book is also a limited but much wider that suits the researchers and research supervisors in Telugu. It is designed as a complete Style Manual for research in Telugu. I happened to see many Telugu dissertations from various Telugu Departments across India. They did not follow a standard method in making notes, designing the chapters adding appendices and finally making bibliography.  Each one followed different style and do not look at a standard book of Style Manual. The present book introduces some international methods and suggests a suitable style and method for Telugu research. The truly serves to the purposes of Researchers and the Researcher Supervisors in Telugu. 

Pulikonda Subbachary.

తెలుగులో పరిశోధన విధానానికి సంబంధించి ఇప్పటికే మూడు చిన్న పుస్తికలు వచ్చాయి. వాటిని రాసిన ముగ్గరూ చాలా పరిశోధనానుభవం ఉన్న మంచి పరిశోధకులు. ఇప్పటికీ వీటిని విద్యార్థులు వినియోగిస్తున్నారు. కాని తెలుగులో పరిశోధన విధానానీకీి సిద్ధాంత గ్రంథ రచనకు సమగ్రమైన శైలీ గ్రంథం లేదా స్టైల్ మాన్యువల్ ను ఇప్పటికీ తెలుగు వారు తయారు చేసుకోలేదు. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. ఇలాంటి శైలీ గ్రంథాలను సంస్థలే చేయాలి. వ్యక్తులు చేయవచ్చు కాని సంస్థలు పెక్కు మంది పరిశోధకులు కూర్చుని చర్చించి చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టైల్ మాన్యువల్స్ ని వివిధ సంస్థలే అభివృద్ధి చేసాయి. కాని తెలుగు వారిలో ఈ విషయంలో తలలు కూడడం లేదు. అలాంటి సంస్థలు కూడా విశ్వవిద్యాలయ స్థాయిలో మనకు ఏర్పడ లేదు. అకాడమీలు కూడా ఈ పనికి పూనుకో లేదు. మొదటి సారి పూర్తి రూపంలో శైలీ గ్రంథాన్ని తయారు చేసే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా జరిగింది. దీన్ని తొలి ప్రయత్నంగా భావించి తెలుగుశాఖలు ఇంకా సమగ్రమైన శైలీ గ్రంథాన్ని తయారు చేసుకునే పయత్నం చేయాలి. ఈ పుస్తకం వినియోగంలోనికి పూర్తిగా వచ్చిన తర్వాత దీన్ని పాఠకులు ఎలా విస్తృతపరచవచ్చునో తెలియ వస్తుంది. 

భవదీయుడు 
పులికొండ సుబ్బాచారి. 

Saturday, January 25, 2014

PADMASRI TO KOLAKALURI ENOCH

కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీ తెలుగు సాహిత్యానికి సరికొత్త కిరీటం

తెలుగు సాహిత్యకారులు  సాహిత్య ప్రేమికులు అందరూ చాలా ఆనందించవలసిన రోజు. భారత ప్రభుత్వం కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీని ప్రకటించడం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక మణికిరీటాన్ని పెట్టినట్లు అయింది. ఇది ఒక వ్యక్తికి కాక అణగారిన వర్గాలకోసం కన్నీరు చిందించిన, సామాజిక దురన్యాయాలను ఎదిరించిన ఒక మహా శక్తికి ఇది ఒక సన్మానం అని మాత్రమే నేను చెప్పడం లేదు. ఇంత ఆలస్యంగా నైనా ఇంతటి మహాశక్తిని గుర్తించడంలో చేసిన లోపాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందిని చెప్పదలచుకున్నాను. అంతేకాదు తెలుగు సాహిత్యానికి పద్మశ్రీ రాక ఎన్నో దశాబ్దాలయింది. ఇనాక్ గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా చేసిన అక్షర సేవకు ఇది చాలా ఆలస్యంగా లభించిన గౌరవంగా దీన్ని చెప్పాలి. నిజానికి పద్మశ్రీ ఆయనకు చాలా చిన్నది పద్మ పురస్కారాల క్రమంగా అన్నింటికి ఉన్నతమైనదాన్ని ఈయనకు ఇవ్వవచ్చు. ఇనాక్ గారు సృష్టించిన కథలు నవలలు వాటిలోని దగా పడ్డ పాత్రలు సమాజంలో చిరకాలం చిరంజీవిగా ఉంటాయి. తెలుగు కథకు అందునా వ్యథాభరిత దగాజీవితాలసజీవ చిత్రణకు చిరకాల చిరునామా గా అవి ఉంటాయి. ఇనాక్ ఆధునిక తెలుగు సాహిత్య శిఖరాలలో ఒకరు.
తెలుగులో మరొక దారుణమైన క్రమం ఉంది. తెలుగులో సాహిత్య పైరవీకారులకు చాలా బలం ఉంది.  పది పైసల ప్రతిభతో పది రూపాయిల పైరవీ చేసి వందరూపాయిల అవార్డులు కొట్టేసే వారున్నారు. వారి పైరవీ బ్రతుకు అందరికీ తెలిసిందే. కాని ఇనాక్ గారికి ఇంత ఆలస్యంగా  ఈ పురస్కారాన్ని ఇస్తున్నందుకు రెండు ప్రభుత్వాలు కాస్తంత గిల్టీగా భావిస్తున్నాయని నేను భావిస్తున్నాను. వచ్చే సంవత్సరం వారికి పద్మవిభూషణ్ వస్తే వారికి న్యాయం జరిగినట్లుగా భావించవచ్చు. వారి రచనలు అన్నింటిని ప్రభుత్వంవారు ప్రచురించాలి. ఇనాక్ పేరిట ఆయన చేసిన సామాజిక చింతన కోసం ఒక అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయాలి. దీనితోనే ఏ సామాజిక వేదనను తీర్చడానికి ఇనాక్ నాలుగు దశాబ్దాలు అక్షర యజ్ఞం చేశారో దాని విలువను ఈ పీఠం కొనసాగిస్తుందని భావిస్తాను.

పులికొండ సుబ్బాచారి. 

Sunday, December 29, 2013

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నేటికి ఏడాది దాటింది

ద్రావిడ విశ్వవిద్యాలయం

ఏవి తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు
నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పునరాలోకన

తెలుగు తల్లీ ఎక్కడమ్మా నీదు మల్లియలు

ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు

ఎచట తల్లీ నిరుడు పాడిన మెచ్చుగీతికలు

ఏల తల్లీ తెలుగు భాషకు ఈ దురదృష్టం

ఏవీ తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు

సరిగ్గా పోయిన ఏడాది ఇదేరోజు అంటే డిసెంబరు  29 న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసాయి. డిసెంబరు 27 నుండి 29 దాకా మూడు రోజుల పాటు జరిగాయి. సాక్షాత్తు మహా మహిమ్ భారత రాష్ట్రపతి తిరుపతికి విచ్చేసి  ఈ మహా సభల్లో పాల్గొన్నారు. ఎన్నో కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలోఉన్న తెలుగు వారు ఒక చోట చేరడానికి మంచి అవకాశం లభించింది. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్నో తెలుగు ప్రదర్శన కళలు లలిత కళలు ప్రదర్శితమైనాయి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమలు మూడు రోజుల పాటు చాలా అట్టహాసంగా చాలా ఆనందకరంగా జరిగాయి. సరే కొంత మంది అలగడం. మాకు తగిన ప్రాధాన్యం రాలేదని బాధపడడం ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఎలాగూ ఉంటాయి. అలగే ఉండినాయి. అంత మాత్రమే కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఏలినవారి పక్షాన మనామనిగా ఎంపికలు జరగడం కూడా తోసివేయరాని విషయం.
సరే ఈ వేడుకలన్నీ ఆనంద కరమైనవే. వీటిని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేన్ని గురించి ఆలోచించాలి. తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల అభృద్ధికి, తెలుగు అధికారభాషఅమలు గురించి చేసిన వాగ్దానాలు ఎన్ని. వాటికి పట్టిన గతి ఏమిటి అనే ఆలోచించవలసిఉంటుంది. ఇది ప్రభుత్వాన్ని కాని లేదా కొందరు ప్రభుత్వాధికారులు కానీ విమర్శించడానికి చేసే ప్రయత్నం కాదు. తెలుగుకు పట్టిన ఈ దౌర్భాగ్యస్థితికి ప్రగాఢమైన బాధను వ్యక్తం చేయడానికి చేసే ప్రయత్నమే. ప్రభుత్వ ప్రతినిధిగా మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఆయన నిజంగా భాష పట్ల సాహిత్యం పట్ల మంచి నిబద్ధత ఉన్నవారు. మంచి పని చేయాలని తలపెట్టినవారు. కాని ఆయన ఒక అనుకోని తీరులో రాజీనామా కూడా చేశారు. సభల్లో చేసిన వాగ్దానాలు చేసిన పథకాలు ఏవీ అమలు కాక పోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించవలసి ఉంది.
ఒక పక్క రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతుంది. తెలుగు జాతి తెలుగు భాష అని ఒక ఏకీకరణ భావంతో జరిగే ఈ మహాసభలు రాష్ట్రవిభజనకు అడ్డుపడతాయని తెలంగాణా వారు భావించారు. అక్కడనుండి చాలామంది కవులు కళాకారులు ఈ మహాసభలకు హాజరు కాలేదు. ఇది రాజకీయ కారణం. అయినా కొంత మంది హాజరయినారు. కొన్ని తెలంగాణా ప్రాంత జానపద కళారూపాలు కూడా ప్రదర్శితమైనాయి. ఇది సంతోషించ దగిన విషయమే.  ఈ మహాసభల్లో ముఖ్యమైన పథకాలు వాగ్దానాలు బయటికి వచ్చాయి. ముఖ్యమైనవి ఏమంటే అన్ని స్థాయిల్లోను తెలుగు అధికార భాషగా అమలు కావాలి. అవసరమైన చోట ఉర్దూ రెండవ అధికార భాషగా ఉంటుంది. ఈ ప్రయత్నం కొంత జరిగింది. న్యాయస్థానాలలో కూడా పూర్తి స్థాయిలో తెలుగు అమలు జరగాలని మరికొన్ని సభల్లో కూడా నిర్ణయాలు జరిగాయి. కాని దీని పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ పీఠమైన రాష్ట్ర సచివాలయంలోనే తెలుగు అమలు చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ
ఉత్తర్వులు ఎన్ని తెలుగులో వస్తున్నాయి అనే విషయం వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం పాఠశాల స్థాయిలో తెలుగు తప్పనిసరిగా ఒక అంశంగా ఉండాలి. ఈ నిర్ణయం ఆనాడే నిరాశను కలిగించింది. కారణం ఇంటర్ విద్య వరకు తెలుగు ఉండాలని తలపెట్టారు. కాని పది వరకైనా ఎన్ని పాఠశాలల్లో ఇది అమలు జరుగుతూ ఉందని ఏ విచారణైనా జరిగిందా. దీని అమలుకు పకడ్బందీ ప్రణాళిక విధానం రచితమైందా లేదు. అంతే కాదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలను నిరోధించి తెలుగును తప్పని సరి భాషగా పెట్టేందుకు ఏదైనా కచ్చితమైన అదేశాలు వారికి చేరాయా అవి అమలు అవుతున్నాయా ఫలితం ఏమి జరిగింది.
నగరాలలో అన్ని పట్టణాలలో దుకాణాల ముందు అన్ని సంస్థల ముందు నామ ఫలకాలన్నీ తెలుగులో ఉండేలా ఆదేశాలు చేస్తామన్నారు. నాటి అధి కార భాషాసంఘం అధ్యక్షులు దీని అమలును గురించి చాలా శ్రద్ధగా చెప్పారు. చేశారు కూడా. కాని హైదరాబాదులో నగరంలోని ఏ దుకాణం ముందూ బోర్డులు తెలుగులోనికి మారలేదు. అదే కర్ణాటకలో అయితే స్వచ్ఛంద సంస్థలవారే ఇంగ్లీషులో ఉన్న బోర్డులు అన్నింటిపైన నల్లరంగుపూస్తారు. కన్నడంలో రాసినదాకా ప్రభుత్వం వారు కూడా ఊరుకోరు. ఈ అదృష్టం తెలుగుకు రావడానికి ఇంకా ఎన్నిదశాబ్దాలు ఎదురు చూడాలి. ఈ ఏడాది మొత్తం తెలుగు భాష సాంస్కృతిక  సంవత్సరంగా పాటించి విశేషకార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. కాని ఏమి జరిగింది. మూడు కళా వేదికలు అంటే ఆడిటోరియంల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆ దిశగాపని ఏమి జరుగుతూ ఉందో తెలియదు. ఇది యాదృచ్ఛికంగా తెలుగు వైతాళికుడు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు నూటాఏభై యవ జయంతి. ప్రభుత్వం ఆయన కోసం కొన్ని మంచిసభలను నిర్వహించింది. మంచి కార్యక్రమాలు చేపట్టింది. కాని ఆయన కట్టుకున్న సొంత ఇల్లు ఆకుటుంబానికి దారిలేక అమ్ముకోవలసి వచ్చింది. దాన్ని కొనుకున్న వారు దాన్ని కూలగొట్టారు. ఇది తెలుగు వారు అందరినీ కలచివేసే అత్యంత దురదృష్ట ఘటన. ఏ భాషా రాష్ట్రంలోను ఇది జరిగి ఉండేది కాదు. ఏ మహాకవికీ ఇంతటి క్షోభకలిగేది కాదు. ఇది తెలుగు వాడైనందుకు గురజాడకు పట్టిన గతి.
ప్రపంచ మహా సభలు నిర్వహించి ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. కాని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏడాది గడిచి పోయింది. ఈ దురదృష్టానికి కారయణం ముఖ్యమైంది, తెలుగు జాతి ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే. రాష్ట్రం చీలి పోయే స్థితిలో అటు వారు కాని ఇటు వారు కాని చివరికి ప్రభుత్వం కాని భాషను గురించి పట్టించుకునే స్థితిలో లేదు. తెలంగాణా వారికి ముందున్న పెద్ద సమస్యవారికి రాష్ట్రం ఏర్పడడం ఆ సమస్య ముందు భాషకు సంబంధించినది వారికి చాలా చిన్న సమస్య అయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిదైన భాషా విధానాన్ని వారు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సర్కారాంధ్ర వారికి కాని రాయలసీమ వారికి కాని ముందున్న సమస్య రాష్ట్ర విభజనను అడ్డుకోవడం. ఈ సంకులసమరంలో తెలుగు భాషకోసం చేసుకున్న బాసలన్నీ నీటిలో కలిసినయ్. తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కు చెందిన కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్కడికి రావాలనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అది రెండు రాష్ట్రాలలో పని చేయవలసి వస్తుంది. తెలంగాణా వాడిగానే తెలంగాణా వాదిగానే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను.  రాజకీయంగా అధికార పరంగా పాలనా పరంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో ఉండవచ్చు. ఇది వేరే విషయం కాని భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో మనం ఇద్దరం అన్నదమ్ములం కొంత సంయమనం పాటించాలి రెండు రాష్ట్రాలలో ఉన్నంత మాత్రాన మాండలికాలు మారినంత మాత్రాన తెలుగు భాష రెండుగా చీలదు. అప్పుడు కూడా రాజమండ్రి నన్నయను, వరంగల్లు పోతన్నను రాయలసీమ పెద్దన్నను ఒకే భాషాసాహిత్య విమర్శ విధానాలతో చూడవలసి ఉంటుంది. అప్పుడూ తెలుగు సాహిత్యం ఒకటే అవుతుంది. తెలుగు తల్లికూడా రెండుగా చీలి తెలంగాణా తల్లి, ఆంధ్రమాతగా రెండుగా అవతారాలెత్తవలసిన అవసరం లేదు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉమ్మడి విధానాలు అవలంబించవచ్చు. రాష్ట్రం ఎలాగూ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానినికలిగి ఉంటుంది కాబట్టి తెలుగు క్లాసికల్ సంస్థ రాజధానిలోనే పెట్టుకొని ఇరు ప్రాంతాల వారు కలిసి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. అదే సమయంలో తెలంగాణా మాండలికాలకు రాయలసీమ మాండలికానికి కళింగాంధ్ర మాండంలికానికి తగిన విధంగా పెద్ద పీట వేసుకొని పరిశోధనలు చేయవచ్చు.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ఏడాది గడిచిపోయింది. అయినాఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది.  ఎవరినీ నిందించకుండా రెండు ప్రాంతాల వారు భాషాసాహిత్యాలకు సంబంధించి అధికార భాష అమలుకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవలసిన సమయం ఇది. ఇది ఎవరినో తప్పుపట్టడానికి కాకుండా తెలుగు భాషకు పట్టిన దురదృష్టానికి బాధపడుతూ రాసేది. భాషా సాహిత్యాల విషయంలో ఇద్దరు అన్నదమ్ములు మరింత సహనంతో సంయమనంతో పని చేయవలసిఉంది. చేసిన బాసలను తిరిగి ఆలోచించుకోవలసిన సమయం కూడా ఇదే.

Monday, December 16, 2013

Telugu Poetry in Internet Medium

పులికొండ సుబ్బాచారి

తెలుగు కవిత్వం మాధ్యమ పరిణామం, గుణాత్మక పరిణామం

కవిసంగమం ప్రయోగం కవిసంగమం ప్రగతి చారిత్రకం అవుతుంది

కవిసంగమం చిన్ని ప్రయత్నంతో ప్రారంభం అయింది. నా తమ్ముడు యాకూబ్ దీనికి నాంది పలికాడు. ఇంటర్ నెట్లో ఉన్న సౌకర్యన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చాలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఇతనికి కలిగింది. ఒక ప్రయత్నం చేశాడు. అతనికి వ్యక్తిగతంగా గడచిన పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్నవారు అయిన యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగాడు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. నాకు తెలిసిన వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు. కవిసంగమం ముఖపుస్తకం ఇప్పటికే సాధించిన ప్రగతి (విజయం అని అనడం లేదు)ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఇది చాలా ప్రముఖమైనది చారిత్రకమైనది అవుతుంది.
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవి సంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమంలోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ ను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్నవారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు.  తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనిక ప్రవేశించినదని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
అయితే కవి సంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ,  వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. తెలుగు పదం అనే ఒక గూగుల్ మెయిల్ గ్రూపు ఒకటి తెలుగు పదాల నూత్న కల్పనలను గూర్చిన ప్రయోగం చేసింది. అది ఇంకా జరుగూతూనే ఉంది. కాని మెయిల్ గ్రూపు కవిత్వ వ్యాప్తికి అంతగా అనువైనది కాదు. కాని ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న గూగుల్ ప్లస్ లో కూడా కవిసంగమంలాంటి ప్రయోగం చేయవచ్చు. నేను కూడా బ్లాగు తయారు చేసి దానిలో వ్యాసాలని కవితలను ప్రచురించడం దాదాపు ఆయిదు సంవత్సరాల క్రితమే చేసాను. దాదాపు రెండు వేలమందికి పైగా పాఠకులు నా బ్లాగును చదినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పినట్లుగా బ్లాగుకు, ఫేస్ బుక్ కు ఉన్నంత చాలన గుణం (డైనమిజమ్) ఉండదు. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.
అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందు బాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించ లేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడంమంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమిన్ని నిరసించిన వారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్త తరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు. కవిసంగమం రూపకర్త యాకూబ్ ని దీనికోసం నిరంతరం పనిచేస్తున్న ఇతర కార్యకర్తలను ఈసందర్భంగా నేను అభినందిస్తున్నాను. తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి కొత్త యుగంలోనికి ప్రవేశించినదని ఎలక్ట్రానికి మాధ్యమాన్ని అంటే విద్యున్మాధ్యమాన్ని ప్రత్యేక మాధ్యమంగా గుర్తించి, తెలుగు కవిత్వంలో విద్యున్మాధ్యమ కవిత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించి పరిశీలించాలని ఇక్కడ నేను ప్రతిపాదిస్తున్నాను.

పులికొండ సుబ్బాచారి. 

Friday, November 15, 2013

ఖమ్మం వీధుల్లో పరిమళం - హృదయ వైద్యునితో ఓ గంట.
ఖమ్మం వెళ్ళడం అంటే అక్కడి వీధుల్లో నడుస్తుండడం అంటే నాకెంతో ఇష్టం. ఏడాదికి ఒక్కసారైనా అలా ఖమ్మం వెళ్ళికి రాకపోతే ఏదో పోగొట్టుకున్నవాడిలా అయిపోతాను. ఖమ్మం వీధుల్లో నడుస్తుంటే అది వీధుల్లో నడవడం కాదు, నేను నా బాల్యంలో, కౌమారంలో, తొలియౌవనంలోనికి, తొలి ప్రేమసందడుల్లోనికి నడుచుకుంటూ వెళ్ళడమే. ఆమె కళ్ళు ఏవీధుల్లో జీవితాల్ని కొలుస్తూ తిరుగుతుంటాయో అనుకుంటూ నా కళ్ళు ఆ వీధులన్నీ ఆమె కళ్ళ కోసం గాలిస్తూ వెదికిన గుర్తులు అక్కడ ఇంకా చెదరకుండా ఉంటాయి. పగలంతా చెమటోడ్చి (దారు శిల్పం – అన్ని దారు పరికరాలు) అదే చెమటతోని ఈవెనింగ్ కాలేజికి అలా సైకిల్ పైన వెళ్తూ వెళ్ళిన రోజులు ఆ స్వేదపరిమళాన్ని మనసుముక్కుకు అందిస్తాయి.

బాబూ మియా టీ అంటే అదొక అనుభూతి. బాబూమియా అనే వ్యక్తి స్టేషన్ కి ఎదురుగా ఉన్న  అప్పటికి సన్నగా ఉన్న వీధిలో టీకొట్టు. అంటే మామూలు టీ కొట్టు కాదు. అతని చేతిలో ఏదో మాయ ఉంది. బొగ్గుల కుంపటి మీద  టీచేస్తాడు. అందులో అల్లం వేస్తాడు ఇంకేదో వేస్తాడు అతని మాయని. వేడివేడిగా అక్కడ బాబూమియా టీతాగడం ఖమ్మం వాసులకు అదొక అనుభూతి ఆ రుచిని ఎవరూ మరవలేరు. చాలా పెద్దవాళ్ళు అక్కడికి వచ్చి టీ తాగుతారు. కార్లు ఆపి బాబూ మియా టీ తాగి అక్కడినుండి ఆ ఉత్తేజంతో నిష్క్రమించడం అదొక భావన. అంతే కాదు ఈనాటికి బాబూమియా వారసులెవరో దాన్ని నడుపుతున్నారు. కాని ఆ పరిమళం లేదు. నేను అఫ్సర్ కబుర్లాడుకున్న ఆ ప్రభాత్ టాకీస్ కూలి పోయింది. ఏదో ఎక్కడో గాయం తగిలినట్లనిపించింది. ఆ వీధులన్నీ మారిపోయినయ్ పాతవాటిని కూల్చినయ్. తమను తాము వెడల్పు చేసుకున్నయ్ . జనసమ్మర్ధం బాగా పెరిగింది.

డా. ఎం.ఎఫ్ గోపీనాథ్ తో సంవాదం
నాకొక ఖమ్మం మిత్రుడు హృదయ వైద్యుడు  ఎం.ఎఫ్ గోపీనాథ్. భారత దేశంలో తొలి దళిత సామాజిక వర్గపు హృదయ వైద్యుడు. ఈయన హృదయాలను శోధించే హృదయ వేదనలకు స్పందించే భావుకుడు. నారచనలు ఆయన చదువుతుంటాడు. ఆయన రచనల్ని నేను చదువుతుంటాను. కలిసి ఒక దశాబ్దం పైగానే అయిందనుకుంటా. ఇటీవలి కాలంలో కలవలేదు. అయినా మేము మాట్లాడుకుంటూంటే రోజూ కలుస్తున్న వాళ్లం మాట్లాడుకున్నట్లే ఉంది. అదే వేవ్ లెంక్త్ అంటే... ఈసారి ఖమ్మంలో తప్పనిసరిగా కలవాలని ముందే అనుకున్నాం. 14 వ తేదీ ఆయనతో దాదాపు ఒక గంటపైగా గడపడం చాలా ఆలోచనలకు దారి తీసింది. ఇటీవలి ఆయన పుస్తకం "నాపొగరు మిమ్మల్ని గాయపరిచిందా అయితే చాలా సంతోషం". అనేది చాలామందిని బాగా ఆలోచింపజేసింది. మేము మాట్లాడుకున్న గంటసేపూ ఈ సామాజిక వేదనలగురించే.. మిత్ ని విశ్లేషించి సామాజిక వేదన తిరుగుబాటు వాటిలో ఎలా ఉందో తెలుసుకోవడం గురించి మాట్లాడుతూ మత రహిత సమాజం, జీవితం గురించ చాలా చర్చ చేశాము. జానపద శాస్త్రంలో పరసనల్ ఎక్స్ పీరియన్స్ నేరేటివ్స్ పైన పరిశోధన చేయడం ఈనాడు చాలా విస్తృతంగా జరుగూతూ ఉంది. దళితులకు సంబంధించిన ఇలాంటి నేరేటివ్స్ ని చాలా సేకరించాను. కాని ఇటీవలి కాలంలో ఒక దళిత ఎక్స్ పీరియన్స్ గోపీనాథ్ రాసినంత విస్తృతంగా ప్రభావవంతంగా రాలేదు. దీనిపైన మరింత అధ్యయనం అవసరమని ఇద్దరం గుర్తించాము.

మళ్ళీ ఖమ్మం పరిమళం గురించే మనసంతా భావనామయం అయింది. కవిత్వం చివ్వున లేస్తుంది ఖమ్మాన్నితలచుకుంటే. నేను, అఫ్సర్, సీతారాం, యాకూబ్ అందరం ఖమ్మం పరిళానికి తలవంచిన వారిమే..
పులికొండ సుబ్బాచారి.

Saturday, June 8, 2013

మిత్రులారా కవితలు పేజీలో నా సరికొత్త కవిత

చినుకు ఓనమాలు 
చూడండి.

స్పందిస్తే చాలా సంతోషం.
సుబ్బాచారి పులికొండ.

Wednesday, May 8, 2013


తెలుగు జాతి కవులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఎందుకీ వివక్ష 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రావూరి భరద్వాజను సముచితంగా గౌరవించింది. పదిలక్షల రూపాయిలను బహూకరించింది. అంతే కాదు సాంస్కృతిక శాఖ తన తరఫున రెండు లక్షల రూపాయిలను అందజేసింది. 
ఇంత వరకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. కాని ఇది వివక్షాపూరితం అని చెప్పాలి. అంతే కాదు కవులను, రచయితలను గౌరవించే పద్ధతి కూడా ఇది కాదు అని చెప్పువలసి ఉంది. మిగతా రంగాల వారి ముందు కవులను అక్షర సేద్యంచేసే సృజన శీలురు అందరినీ తక్కువ చేయడం గా భావించ వలసి ఉంది. ఎందుకంటే బాడ్ మింటన్ ఆడే కళాకారిణికి ఒక అంతర్జాతీయ స్థాయి ఆటలో గెలిస్తే 50 లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది ఈ ప్రభుత్వం. మరొక కబడీ కళాకారుడికి పాతిక లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది. ఇంతకుముందు కూడా క్రీడాకారులకు ఇంత మొత్తంగా బహుమతులను ప్రకటించడం ఇండ్ల స్థలాలను అందించడం చేస్తూ ఉంది ప్రభుత్వం. కేంద్రప్రభుత్వం జ్ఞానపీఠ పురస్కారం పొందినవారికి పాతిక లక్షల ఇస్తున్నారనే వార్త ఆనందం కలిగించేదే. కాని క్రికెట్ క్రీడలో గెలిచిన క్రీడాకారులకు కోట్ల రూపాయిలు ఇచ్చి విదేశీ కార్లు ఇచ్చి రాజధానిలో ఇళ్ళ స్థలాలిచ్చి ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఒక కవి ఒక రచయిత అత్యంత సృజనశీలుడై ప్రతిభావంతుడై జీవితాంతం చేసిన అక్షర శ్రమకు అత్యంత విలువైన అక్షర కళకు ఇచ్చే బహుమతి జ్ఞానపీఠ పురస్కారం అలాంటి వ్యక్తిని సాహిత్య స్రష్టను ప్రభుత్వాలు ప్రోత్సహించవలసింది ఇంతేనా. ఏం వాళ్ళు చేసే కృషి క్రీడాకారులు చేసే కృషికన్నా తక్కువా. నిజానికి క్రీడాకారులు సమాజనికి ఇచ్చేది ఎంత వారి వల్ల కలిగేది ప్రజలకు తాత్కాలిక మైన ఆనందం మాత్రమే. క్రీడాకారుల కృషి అప్పటికప్పుడే ముగిసి పోతుంది. కాని ఒక కవి చేసిన సాహిత్య కృషి తరాలు శతాబ్దాల పాటు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. పఠనానందాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకు 50 లక్షలు కోట్ల రూపాయిలు ఇచ్చే కేంద్ర రాష్ట్ర్రప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి సాహిత్య కారులను జ్ఞానపీఠ వంటి అత్యంత ఉన్నత పురస్కారాలు పొందిన వారిని క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు తగ్గకుండా అంతకు ఎక్కువగా ఇచ్చి గౌరవించాలి. అలా కాకుండే ఒక బాడ్ మింటన్ క్రిడాకారిణికి 50 లక్షలు ఇచ్చి ఒక క్రికెట్ క్రీడాకారుడికి కోటి రూపాయలు ఇచ్చి జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారికి పది లక్షలు ఇవ్వడం అనేది నిస్సందేహంగా సాహిత్యకారులను అవమానించడమే. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడా మేల్కొనాలి కవులకు సాహిత్యకారులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. కనీసం మన పొరుగు రాష్ట్రం కన్నడిగులు జ్ఞానపీఠ పురస్కారం పొందిన కువెంపు అనే కవికి ఎంత గౌరవం ఇచ్చిందో గ్రహించాలి. సుమారు పది కోట్ల విలువైన భవనాన్ని కట్టి అందులో ఆయన పేరిట సాహిత్య పరిశోధన కేంద్రం పెట్టారు. కోటి రూపాయిలతో ఆయన ఇంటిని నవీకరించారు. ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. తెలుగు జాతి కవులను సాహిత్యకారులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఇంకా ఎంత కాలం కావాలి. 
పులికొండ సుబ్బాచారి.